Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశ న్యాయవ్యవస్థ తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంది. కథువా అత్యాచార ఘటన కేసులో పఠాన్కోట్ ప్రత్యేక న్యాయస్థానం సముచితమైన తీర్పు వెలువరించింది. గత ఏడాది జనవరిలో జమ్మూలోని కథువాలో ఆసిఫా అనే ఎనిమిదేండ్ల బాలికను అపహరించి, ఆలయం స్టోర్రూమ్లో నిర్బంధించి, మత్తుమందులిస్తూ లైంగిక దాడిచేసి, హత్య చేసిన హృదయవిదారక ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితులకూ వారికి సహకరించిన పోలీసులకూ న్యాయమూర్తి తగిన విధంగా శిక్షలు విధించారు. దారుణం జరిగిన 275 రోజుల్లోనే తీర్పు వెలువరించడంతో పాటు, పసిపాపను పొట్టన పెట్టుకున్న నేరగాళ్లకు కఠిన శిక్షలు పడడం సమాజానికి ఊరటనిస్తోంది.
కథువా ఘటనలో రాజకీయమూ, మతమూ నేరంతో కలగలిసిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది. జమ్మూకాశ్మీర్లో పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ అమానుష అత్యాచార, హత్యాసంఘటనకు మతాన్నీ, రాజకీయాన్నీ అద్దుతూ కమలనాథులు వీరంగం చేశారు. సాక్షాత్తూ ఇద్దరు బీజేపీ మంత్రుల నాయకత్వంలో నేరస్తుల అరెస్టులను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. అరెస్టుల అనంతరం వాటిని నిరసిస్తూ ఊరేగింపులు జరిగాయి. మతం కారణంగా ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం ఈ కేసు విషయంలో తీవ్రంగా స్పందిస్తూ, అమాయకులను వేధిస్తున్నదని ఆరోపిస్తూ బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఆగమాగం చేశాయి. హిందూ ఏక్తామంచ్తో పాటు, కథువా బార్ అసోసియేషన్ సైతం రోడ్డెక్కి నిందితుల పక్షాన ర్యాలీలు తీశాయి. చార్జిషీటు దాఖలు చేయకుండా అధికారులను న్యాయవాదులు అడ్డుకున్నారు. ఈ ఘటనకు మతం రంగు పులిమి బీజెపీ రచ్చ చేసిన నేపథ్యంలో కేసు విచారణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంజాబ్కు తరలిపోయింది.
ఆ తెగలకు చెందిన వారు తమ బంధువులను కొట్టడంతో తాము ప్రతీకార చర్యకు పాల్పడ్డామని నేరస్తులు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి, ముస్లీం బక్రవాల్ సంచార తెగకు చెందిన వారిని ఆ ప్రాంతం నుంచి తరిమివేయాలనే తలపుంతో నేరస్తులు బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేశారు. ఇలాంటి చర్యకు పాల్పడితే బాధితులు భయపడి పారిపోతారన్నది నేరస్తుల ఆలోచన. అన్నెం పున్నెం తెలియని ఆ పసికందును ఇంత కిరాతకంగా హింసించి, హత్య చేసిన దుర్మార్గులకు కొంతమంది పోలీసులు పూర్తిగా సహకరించడం మరింత దారుణం. ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు స్పందించి, బాధితులకు అండగా ఉండాల్సిన సమాజం మతం ఆధారంగా నిలువునా చీలిపోయి, నేరస్తుల వైపు నిలిచింది. హిందువులు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో బాధితులకు సమాజం అండ లేకుండా పోయింది. నేరస్తులను సమర్థిస్తూ ఊరేగింపులు తీసి, ప్రసంగాలు చేసిన తమ పార్టీ వారిని బీజేపీ అధినేతలు అడ్డుకోలేదు సరికదా మరింతగా ప్రోత్సహించారు. ఈ సంఘటన ఆధారంగా మత తత్వాన్ని రెచ్చగొట్టి హిందువులను తమకు ఓట్ బ్యాంక్గా మార్చుకునేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నించారు. కాశ్మీర్లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, హిందువులు వేధింపులకు గురవుతున్నారని, చేయని నేరాలకు శిక్ష అనుభవిస్తున్నారనీ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అయితే న్యాయస్థానంలో సత్యమే నిలిచింది. గెలిచింది. ముక్కుపచ్చలారని బిడ్డను బలితీసుకున్న ముష్కరులకు తగిన శిక్ష పడింది. ఏడుగురు నిందితుల్లో ఆరుగురికి శిక్ష పడింది.
కథువా కేసును త్వరిత గతిన కొలిక్కి తెచ్చిన పోలీసు, న్యాయవ్యవస్థలను అభినందించాల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా ప్రచారం పొందిన కథువా కేసు విషయంలో చూపిన చొరవ మిలిగిన లైంగిక దాడులూ, హత్య కేసుల్లో కూడా పోలీసు, న్యాయవ్యవస్థలు చూపాలి. దేశంలో మహిళలపై, ముఖ్యంగా పసికందులపై జరుగుతున్న దారుణాలకు బాధ్యులైన అందరు నేరస్తులకు త్వరిత గతిన కఠిన శిక్షలు అమలు జరిపినపుడే పూర్తి న్యాయం జరిగినట్టు భావించాల్సి ఉంటుంది. ఇతరులతో వైరం వల్లనో, కుటుంబ కలహాల కారణంగానో ఎదుటి వారిపై పగతీర్చుకునేందుకు పసిమొగ్గలను చిదిమేయడం ఇటీవలి కాలంలో అధికమవుతున్నది. ఈ ఉన్మాదం సభ్యసమాజానికే మాయని మచ్చ. ఇలాంటి దుర్మార్గులను రాజకీయ పార్టీలు, అందునా అధికార పార్టీలు వెనకేసుకు రావడం అత్యంత దారుణం. ఇంతటి దారుణాలకు పాల్పడిన నేరస్తులను వెనకేసుకువచ్చి, కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించిన రాజకీయ నాయకులను శిక్షించకుంటే నేరస్తులు మరింతగా రెచ్చిపోతారు. తామేమి చేసినా కాపాడే నాయకులున్నారన్న ధైర్యంతో పదేపదే నేరాలకు పాల్పడతారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం నేరాలకు మతం రంగు పులిమి, నేరస్తులకు రాజకీయ అండదండలు అందించడం నేరస్తులు చేసిన నేరం కన్నా పెద్ద నేరం. ఇలాంటి రాజకీయ నాయకులను కూడా నేరస్తులతోపాటు శిక్షించాలి.
రాజకీయ అండదండలున్న నేరస్తులు ఈ తీర్పుపై కచ్చితంగా పైకోర్టుకు వెళతారు. అక్కడ కూడా ఈ తీర్పునే ఖాయం చేయాల్సిన అవసరముంది. ఈ దురాగతంపై న్యాయ,పోలీసు వ్యవస్థలు స్పందించిన తీరు అభినందనీయం. అయితే ప్రజాస్పందన ఆ స్థాయిలో లేకపోవడం బాధాకరం. నేరస్తుల కొమ్ముకాచేవారికి పాలనాపగ్గాలు అప్పగిస్తే తమ ఉనికికే ప్రమాదకరమని ప్రజలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా ఈ దురాగతాలనుండి బయటపడతారు.