Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒకే దేశం - ఒకే ఎన్నిక''.. ఈ ఆలోచన వినడానికి బాగానే ఉంది కానీ, ఇది ఆచరణకు వస్తే ఎవరికి ప్రయోజనం? ఎవరికి ప్రమాదం? ఈ ప్రశ్నకు సమాధానం మీదే ప్రజాస్వామ్య మనుగడ ఆధారపడి ఉంది. లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదనను మోడీ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. గత పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో అధికారంలోకొచ్చిన బీజేపీ... ఆ వెంటనే జరిగిన ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో చావుదెబ్బ తినడంతో ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చింది. కానీ, అప్పట్లో మెజారిటీ ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని చేతులెత్తేయడంతో ఈ అంశాన్ని పక్కన పెట్టింది. మళ్లీ మోడీ ప్రభుత్వం కొలువుదీరడంతో దీనిని తిరగదోడుతోంది. ఈ నెల 19న వివిధ పార్టీల అధ్యక్షులతో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో దీనినొక ప్రధాన ఎజెండాగా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ దెబ్బతిన్న వేళ... వామపక్షాలే గాక పలు ప్రాంతీయ పార్టీలూ బలహీనపడిన సమయంలో బీజేపీ ఇందుకు తెరతీయడం గమనార్హం! ఇది ఒక వ్యూహం ప్రకారం తమ అసలు ఎజెండా అమలుకు కమలనాథులు సిద్ధమవుతున్నారన్న అభిప్రాయా లతో పాటు, అమిత్షాను హౌంమంత్రిగా నియమించడం లోని వారి అంతరంగాన్నీ వెల్లడిస్తోంది!!
ఇప్పుడే కాదు, సుమారు పదేండ్ల క్రితమే నాటి బీజేపీ అగ్రనేత అద్వానీ ఈ అంశాన్ని లేవనెత్తారు. మోడీ తిరగదోడుతున్నారు. ఇందుకు బీజేపీ చెప్పే సాకులేమిటంటే.. ఏటా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందువలన పాలనపై తగిన శ్రద్ధ పెట్టలేకపోతున్నారట! ఈ కారణంగా పదేపదే ఎన్నికల కోడ్ అడ్డుపడుతున్నందున సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సరిగా చేపట్టలేకపోతున్నారట! పాలనకంటే రాజకీయాలే ముఖ్యమనుకుంటే తప్ప రాష్ట్రాల ఎన్నికలు కేంద్రంలో పాలనకు ఏవిధంగానూ అడ్డు కాదు. ఎన్నికల దృష్ట్యా కొత్తగా ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నాలకు తప్ప అప్పటికే అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలక్షన్ కోడ్ ఎప్పుడూ ఆటంకం కాదు. మరో సాకు, ఎన్నికల నిర్వాహణా, వ్యయం భారంగా మారుతున్నదని. ఈ ఖర్చు ఒక్కో ఓటరుకు రూ.46.4 మాత్రమే.(2014 లెక్కల ప్రకారం) మన ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన ఎన్నికల కోసం ఈ మాత్రం ఖర్చు చేయలేమా? అయినా ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లంతా తగులబెట్టుకుంటామా? భిన్నత్వంలో ఏకత్వమనే వైవిధ్యానికి నిలయమైన దేశంలో.. వివిధ రాష్ట్రాలు, భాషలు, విభిన్న జాతులు, భిన్న భౌగోళిక ప్రాంతాలు, భిన్న వనరుల లభ్యత, అభివృద్ధీ - అసమానతల్లో అనేక వైరుధ్యాలున్న నేపథ్యంలో.. సార్వత్రిక ఎన్నికల మాటెలా ఉన్నా, రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలూ సమస్యలే కాదు, వాటి పరిష్కారాలూ వేరువేరుగానే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో జమిలి ఎన్నికలు ఎలా సాధ్యం? ఎలా సమంజసం?
చట్టపరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే, అవసరమైన మౌలిక వనరులు సమకూర్చుకుంటే ఇది సాధ్యమేనంటోంది బీజేపీ. కానీ ఎలా సమంజసం? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేస్తోంది. అయినా ఇది సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశం కానే కాదు. రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన అంశం. ప్రజల ఆకాంక్షలకే కాదు, మన రాజ్యాంగ నియమాలకు, ప్రజాస్వామ్య విలువలకూ విరుద్ధం. అన్నింటికీ మించి భారత ఫెడరల్ వ్యవస్థకే పెను ప్రమాదం. పార్లమెంటుతో పాటే అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఎన్నికలు జరపాలనుకున్నప్పుడు... అందుకనుగుణంగా కొన్ని శాసనసభల కాలపరిమితిని పెంచడం, కొన్ని శాసనసభల కాలపరిమితిని తగ్గించడం చేయాలి. కానీ ఇది ఐదేండ్ల కాలానికి ప్రజలిచ్చిన తీర్పుకు విరుద్ధం. మన రాజ్యాంగ నియమాలూ ఇందుకు అంగీకరించవు. ఇక రాష్ట్రాల్లో ఏదైనా ప్రభుత్వం మధ్యలో సభా విశ్వాసాన్ని కోల్పోతే ఏం చేయాలి? సభా విశ్వాసంతో సంబంధం లేకుండానే ఆ ప్రభుత్వం కొనసాగుతుందా? లేక రాష్ట్రపతి పాలన పేరుతో కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటుందా? ఇవి రెండూ ప్రజాస్వామ్యయుత పరిష్కారాలు కావు సరికదా మన సమాఖ్య స్ఫూర్తికే విఘాతాలు.
విభిన్న రాజకీయ పరిస్థితులు కలిగిన భారత్ వంటి సమాఖ్య వ్యవస్థకు ఈ జమిలి ఎన్నికలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ ఆకాంక్షలు ఎజెండాలొకొస్తాయి. అభివృద్ధికి సంబంధించి వేరువేరు రాష్ట్రాల్లో వేరు వేరు మార్గాలను ఎంచుకుంటారు ప్రజలు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీకి ప్రజాదరణ ఉంటుంది. కానీ ఈ జమిలి ఎన్నికలతో ప్రాంతీయ ఆకాంక్షలన్నీ మరుగునపడతాయి. జాతీయ అంశాలే ప్రధానమవుతాయి. రాష్ట్రాల హక్కులూ, అధికారాలూ హరించబడతాయి. వేయి గొంతులతో ప్రాంతీయ అస్థిత్వాలను, ప్రజాస్వామ్యాన్ని నినదించే అవకాశాలు చిదిమేయబడతాయి. బీజేపీకి కావాల్సిందీ అదే. అందుకే ఈ నిజాలను దాచిపెట్టి 'ఒన్ ఇండియా - ఒన్ పోల్' అంటూ ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోంది. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలన్నీ ఆత్మరక్షణలో ఉన్న వేళ... అధికారంలో సుస్థిరంగా ఉన్న కమలదళం, ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకునే దిశగా చేస్తున్న కుట్ర ఇది. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే భాష అంతిమంగా ఒకే పార్టీ అన్న పన్నాగంలో భాగమిది. ఏకీకృత వ్యవస్థకు పాదులు తీసే ప్రయత్నమిది. భారత ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చే ఈ పన్నాగాలను పసిగట్టలేనంత అమాయకులు కాదు ఈ దేశ ప్రజలు. ప్రతిపక్షాలూ ప్రాంతీయ పార్టీల మాటెలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలో మాత్రం ఈ ప్రయత్నాలకు భంగపాటు తప్పదు.