Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏవైనా తప్పుడు లెక్కలు, గణాంకాలు ప్రస్తావనకు వస్తే ఇదివరకు 'కాకి లెక్కలు' నానుడి గుర్తొచ్చేది. ఇప్పుడు జీడీపీ గణన తీరును చూస్తుంటే ఆ కాకి లెక్కలను సైతం తలదన్నేలా మోడీ లెక్కలున్నాయి. తాజాగా ఈ విషయాన్ని మోడీ సర్కారు-1 హయాంలో ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణియన్ తన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. ఎన్నో ఆశలతో వచ్చిన ఆయన బీజేపీ విధానాలు నచ్చక పదవీకాలం ముగియకముందే అర్థాంతరంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో జీడీపీని ప్రభుత్వవర్గాలు ఎక్కువచేసి చూపించాయని, ఇదంతా కేంద్ర పెద్దల కనుసన్నల్లోనే జరిగిందని అరవింద్ పేర్కొన్నారు. లేనిది ఉన్నట్టు చూపుతూ లెక్కలను తారుమారు చేయడంలో మోడీకి మించినవారు మరొకరు ఉండరు కదా! తిమ్మిని బమ్మిని చేసి అదే కరెక్టు అని చూపించడంలో కార్పొరేట్ మీడియా ఉండగా తిరిగి మోడీ లాంటి వారు అధికారంలోకి రావడంలో వింతేమి ఉంటుంది. కానీ, దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి అధికారంలోకి వచ్చేందుకు.. తప్పుడు లెక్కలు చూపి గత పాలకుల కంటే మెరుగైన వృద్ధిరేటును సాధించామని గొప్పలు చెప్పుకుని ఓట్లు దండుకోవడమంటే 130కోట్ల మంది ప్రజలను మోసపుచ్చడమే.
అత్యధిక మెజార్టీతో మోడీ తిరిగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే అరవింద్ సుబ్రహ్మణియన్ జీడీపీ వృద్ధిరేటుపై వ్యాఖ్యలు చేయడం చిన్న విషయం కాదు. బీజేపీ పెద్దలు, కేంద్రమంత్రులు చెప్పినట్టుగా వృద్ధిరేటు సరాసరి ఏడు శాతం కాదనీ, కచ్చితమైన గణాంకాలు పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే 4.5శాతమేనని అరవింద్ చెప్పారు. ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి 6.6శాతానికే పరిమితమవుతుందని పేర్కొంది. దీంతో, మోడీ ప్రభుత్వం తన మొదటి ఐదేండ్లపాలనలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థికవ్యవస్థతో ఎంతగా ఆటలాడుకున్నదీ, ఎన్ని విషయాలు మరుగున పెట్టినదీ మరోసారి బహిర్గతమైంది. ప్రధాని ఆర్థిక సలహాదారుగా ఉన్నపుడే ఈ విషయం చెప్పి ఉండాల్సిందని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎదురుదాడికి దిగుతున్నారు. అయినా ఆయన వెనక్కితగ్గలేదు. నిజాలను దాచిపెట్టి ఎదురుదాడికి దిగడం బీజేపీకి అలవాటేనని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సూక్ష్మగణాంకాలు పేలవమైన వృద్ధిని కనబరుస్తున్నప్పుడు సగటున జీడీపీ ఏడు శాతం వృద్ధి నమోదు చేయడం సాధ్యం కాదని దాదాపు 108మంది ప్రధాన ఆర్థికవేత్తలు గతంలోనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించినట్టు జీడీపీ వృద్ధిరేటు ఏడు శాతం అయితే తగినన్ని ఉద్యోగాలు వచ్చి ఉండాలి కదా! ఎందుకు రాలేదు అన్న రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశ్నకు ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం లేదు.
ఐదేండ్లకాలంలో వాస్తవాలను తొక్కిపెట్టి మోడీ సర్కార్-1 ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు. రైతులు గిట్టుబాటు ధర దక్కక కాడి పడేస్తున్నా, కొనుగోలు శక్తి సన్నగిల్లి మధ్యతరగతి ప్రజానీకం కుదేలైనా, ప్రోత్సాహం దక్కక పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూత పడుతున్నా మోడీ ఏలుబడిలో పెరిగినట్టు కనిపించిన జీడీపీ లోగుట్టు ఏంటి? ఇదంతా మోడీ సర్కార్ కనికట్టేనని నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్ఓ) కూడా కుండబద్దలు కొట్టింది. 2016-17లో స్థూల జాతీయోత్పత్తి 6.7శాతం నుంచి ఏకంగా 8.2శాతానికి పెరిగినట్టు మోడీ సర్కార్ ప్రకటించింది. 2015లోనే జీడీపీ అంచనాలను మార్చేందుకు బీజేపీ సర్కార్ మాస్టర్ప్లాన్ వేసింది. వృద్ధిరేటు లెక్కింపునకు బేస్ ఇయర్గా ఇప్పటివరకు పాటిస్తూ వచ్చిన 2004-05 సంవత్సరాన్ని మార్చేసి 2011-12ను ప్రామాణిక సంవత్సరంగా ప్రకటించడం ఇందులో భాగమే. పారిశ్రామికోత్పత్తి అమాంతంగా పెరిగిందంటూ పరిశ్రమల జాబితాలో పేర్కొన్న 36శాతం కంపెనీల్లో అసలు ఉత్పత్తి లేకపోవటమే కాదు, వాటి కార్యాలయాల చిరునామాలు కూడా లేకపోవడం గమనార్హం. ఇవన్నీ సూట్కేసు కంపెనీలు. ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం సష్టించిన ఉత్తుత్తి కంపెనీలు అని తెలుస్తూనే ఉన్నది. ఆర్థిక నిపుణుల మాటల్లో చెప్పాలంటే అక్షరాలా ఇదో పెద్ద కుంభకోణం.
రికార్డు స్ధాయికి నిరుద్యోగం చేరిందని ఎన్నికలకు ముందు అధికారిక సమాచారాన్ని అనధికారికంగా ఒక పత్రిక ప్రచురించినపుడు దానిని ఖండించిన మోడీ సర్కార్ ఎన్నికల తరువాత సదరు సమాచారం వాస్తవమే అని అంగీకరించవల్సి వచ్చింది. నయా ఉదారవాద విధానాల ఫలితంగా సంక్షోభం తీవ్రంగా ముదురుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ విధానాల వైపుగా మార్పు నేటి తక్షణ అవసరం. ఇప్పటికైనా దేశ ఆర్థిక ప్రగతి ప్రణాళికలకు అత్యంత కీలకమైన జీడీపీని గణించడంలో తప్పిదాలకు వీల్లేని శాస్త్రీయ విధానాలపై కసరత్తు చేయాలి. ఇందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రజలు సమాయత్తం కావాలి.