Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మబ్బులు కాసేదెందుకురా.. వానలు కురిసేటందుకురా
వానలు కురిసేదెందుకురా.. పంటలు పండేటందుకురా'' అంటూ అల్లరి చేస్తున్న పిల్లల గంతులు చూస్తుంటే మనసుకు ఆనందం కలుగుతుంది. కానీ...
''పార్టీలున్నది ఎందుకురా.. ఫిరాయించేటందుకురా
చట్టాలున్నది ఎందుకురా.. తూట్లు పొడిచేటందుకురా'' అంటూ గోడలు దూకుతున్న రాజకీయ పెద్దల గంతులు చూస్తుంటేనే ఆందోళన కలుగుతున్నది. సార్వత్రికం ముగిసి కొత్తసభ కొలువుదీరిన మురిపెం తీరకముందే.. ఏలినవారి లీలల ముందు చట్టాలు చట్టుబండలే అవుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ దేశంలోనైనా 'చట్టాలు' అమలు చేయడానికే చేస్తారు తప్ప ఉల్లంఘించడానికి కాదు. కానీ చట్టాలు చేసే పెద్దమనుషులే చట్టసభల సాక్షిగా వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న దేశం బహుశా ప్రపంచంలో భారతదేశం ఒక్కటే నంటే అతిశయోక్తి కాదేమో..! అందుకు నిర్వీర్యమవుతున్న ఫిరాయింపుల నిరోధక చట్టం ఓ తాజా ఉదాహరణ. పార్టీలు మారడమంటే కండువాలు మార్చుకోవడమేనన్నంత తేలిగ్గా ఉంది పరిస్థితి. అధికారమార్పిడి అనంతరం ఇదో ఆనవాయితీగా మారింది..!
ఒక ప్రాంతమో లేదా రాష్ట్రమో అన్న పరిమితులేమీ లేవు... ఇప్పుడు దేశమంతటా ఫిరాయింపుల పర్వమే. వామపక్షాలు మినహా అన్ని పార్టీలదీ అదే తంతు. గెలిచిన పార్టీలు ఓడిన పార్టీలో గెలిచినవారిని బెదిరించో, బుజ్జగించో తమలో కలిపేసుకోవడం, ఓడిన పార్టీలో గెలిచిన అభ్యర్థులు వ్యక్తిగత స్వార్థాలకు అధికారపార్టీ ప్రాపకానికి పాకులాడుతూ గోడదూకడం సర్వసాధారణంగా మారింది. పైకి నియోజకవర్గ అభివృద్ధి కోసం, కార్యకర్తల అభీష్టం కోసం అంటూ సుభాషితాలెన్ని పలికినా లోగుట్టు స్వప్రయోజనమేనన్నది బహిరంగ రహస్యమే..!
ఇక తమది విభిన్నమైన, విశిష్టమైన పార్టీ అని తమకు తాము కితాబులిచ్చుకుని భుజాలు చరుచుకునే కమలనాథులు... ఈ అడ్డగోలు ఫిరాయింపులకు దిగజారడాన్ని ఏమనాలి? సాక్షాత్తూ అధికారపార్టీ అధ్యక్షుడే రాష్ట్రాల వారిగా ఫిరాయింపులకు ప్రణాళికలు రచిస్తుంటే, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడవలసిన ప్రధానమంత్రి ఈ గోడదూకుడు నేతల భుజాలు నిమురుతూ స్వాగతం పలుకుతుంటే... ఇక ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఎవరు కాపాడాలి? గతంలో కేవలం ప్రతిపక్షాల సమావేశానికి హాజరైనంతనే శరద్యాదవ్పై అనర్హత వేటు వేసిన ఉపరాష్ట్రపతి స్థాయి నేత... ఇప్పుడు అర్జీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే టీడీపీ ఎంపీలను బీజేపీ ఎంపీలుగా పరిగణిస్తుంటే మన ప్రజాతీర్పును ఎవరు రక్షించాలి?
ప్రజాతీర్పునే కాదు, ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తున్న ఈ కుప్పిగంతుల నివారణకు అడ్డుగోడగా... 1985లోనే నాటి ప్రధాని రాజీవ్గాంధీ హయాంలో ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకొచ్చింది. అయితే గోడలు నిర్మిస్తూనే ఆ గోడలు దూకడానికో అవకాశం అట్టిపెట్టుకోవడం పాలకపార్టీల నైజం. చట్టసభలోని ఒక పార్టీ సభ్యులలో మూడింట ఒకవంతు విడిపోతే అది చీలిక అవుతుంది గానీ ఫిరాయింపు కాదని చట్టంలో ఓ మినహాయింపు చేర్చారు.. ఈ ఒక్క లొసుగును ఉపయోగించుకుని గోడ దూకిన రాజకీయుల ఉదంతాలనేకం చూశాం. ఈ లొసుగును పూడ్చే ప్రయత్నమంటూ 2003లో వాజ్పేయి ప్రభుత్వం ఓ సవరణ తెస్తే సంతోషించాం. సవరించిన చట్టం ప్రకారం ఈసారి మూడింట రెండొంతుల మంది పార్టీ మారాలని నిర్ణయించుకోవాలి. అయినా అంతమాత్రం చేతనే అది చీలిక కాదు. ఆ చీలిక ఆ పార్టీలో కూడా రావాలి. అప్పుడు మాత్రమే విలీనాలకు అవకాశముంటుందని చట్టం చెబుతుంది. కానీ అదికూడా పట్టించుకోకుండా విలీనాలు జరిగిపోతున్నాయి. అయితే ఈసారి కూడా ఓ అవకాశం అట్టిపెట్టుకునే ఈ సవరణ తేవడం గమనార్హం! అదేమిటంటే అది ఫిరాయింపా లేక చీలికా అన్నది నిర్ణయించాల్సిన సభాపతికి, ఆ నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలనే గడువేమీ నిర్ణయించకపోవడం! సభాపతి నిర్ణయం వెలువడకుండా జోక్యం చేసుకునే అవకాశం మన న్యాయవ్యవస్థకూ లేకపోవడం..!! దీంతో అధికారపార్టీలకు విధేయులుగా ఉండే సభాపతులు సభ గడువు తీరే వరకూ ఏ నిర్ణయాలు తీసుకోని ఉదాంతాలనూ మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఫిరాయింపు నేతలనేకులు ఏ చట్టం ప్రకారమైతే అనర్హులో అదే చట్టంలో లొసుగుల ఆధారంగా అర్హులుగా చలామణీ అవుతుండటం వైచిత్రి..!
ఈ పూర్వరంగంలో చూసినప్పుడు ఏ చట్టమైనా ఏలినవారి అవసరాల కోసమే గానీ ప్రజాస్వామ్య పరిరక్షణకు మాత్రం కాదన్నది అనుభవాలు చెపుతున్న సత్యం. ప్రస్తుతం రాజ్యాధికారానికి రాజకీయ తంత్రమే సాధనం తప్ప ప్రజాభిప్రాయమూ, ప్రభుత్వ విధానాలు ఎంతమాత్రమూ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీకి, ఇప్పుడీ ఫిరాయింపులే ప్రధాన అస్త్రాలయిపోతున్నాయి. గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అది అధికారం దక్కించుకున్న తీరు, ఇప్పుడు వరుసగా చోటు చేసుకుంటున్న ఫిరాయింపులూ వాటి వెనుక పురమాయింపులూ చూస్తుంటే... ఎన్నికలూ, చట్టాలూ ఒట్టిమాటలుగానే మిగిలిపోనున్నాయని స్పష్టమవుతోంది! ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ఉనికే లేకుండా చేయాలన్న ఈ ఫిరాయింపుల కుతంత్రం విచారకరం. దీనిని ప్రశ్నించే నైతికత కోల్పోయిన పలు రాజకీయ పార్టీల దీనస్థితి విషాదకరం. కానీ ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైన ప్రజలు మాత్రం తమ ప్రశ్నించే హక్కునూ బాధ్యతనూ ఎప్పటికీ కోల్పోరన్న నిజాన్ని ఏలికలు గుర్తుపెట్టుకోవాలి. అంతిమ నిర్ణేతలు ప్రజలే అన్న సత్యాన్ని విస్మరిస్తే ఎంతటివారికైనా గుణపాఠం తప్పదు.