Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) యువ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఉన్నఫళంగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నప్పటికీ.. ఆర్బీఐలో మితిమీరుతున్న మోడీ సర్కారు జోక్యాన్ని సహించలేకనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్నది వాస్తవం. ఆరునెలల ముందుగానే వచ్చే నెల జూలై 23న పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఆచార్య ప్రకటించడం ఒక రకంగా ఆర్బీఐ లాంటి స్వతంత్ర సంస్థల్లో ప్రశ్నించే గొంతుక మూగబోవడమే. రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించి తనకు తిరుగుండదని భావిస్తున్న కాషాయ సర్కార్ ఈ రూపంలో ఆచార్య దెబ్బ కొడతారని ఊహించి ఉండదు. ఆర్బీఐ నుంచి కేంద్రానికి నిధులు బదలాయించేందుకు బిలాల్ కమిటీ నివేదిక ఇవ్వబోతున్న తరుణంలో ఆచార్య తప్పుకోవడం ఒకరకంగా కేంద్రాన్ని షాక్కు గురిచేసే అంశం. ఇప్పటివరకు ఆర్థిక వ్యవస్థలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసిన కీలక వ్యక్తుల జాబితాలో ఆచార్య కూడా చేరిపోయారు. భవిష్యత్తులో మరికొందరు చేరినా ఆశ్యర్చపోనక్కర్లేదు. 2014లో ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్బీఐ నుంచి రఘరామ్ రాజన్, ఉర్జిత్ పటేల్ నిష్క్రమించారు. నిటి అయోగ్లో పనిచేసిన అరవింద్ పనారియా, ఆర్థిక ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, ప్రధాని ఆర్థికమండలిలో తాత్కాలిక సభ్యుడు సుర్జీత్ భల్లా తప్పుకున్నారు. పదవుల కోసం ఎంతోమంది కుర్చీలు పట్టుకుని వేలాడుతున్న ఈ రోజుల్లో ఆర్నెల్ల నుంచీ ఏడాదిపాటు గడువుండగానే ఇంతమంది ఆర్థికవేత్తలు బయటకుపోవడం సర్వీసు నుంచి వైదొలగడం మామూలు విషయం కాదు.
ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం 9లక్షల కోట్ల మిగులు నిధుల్లో 3లక్షల కోట్లను తమకు బదలాయించుకోవాలని కేంద్రం ఆర్బీఐని ఎప్పటినుంచో కోరుతోంది. ఇదే విషయమై అప్పట్లో ప్రభుత్వానికి ఆర్బీఐ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. బ్యాంకులపై నియంత్రణ, మార్కెట్లో రూపాయి విలువ వంటి పలు అంశాలపై విభేదాలు రచ్చకెక్కాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవినీతి చోటుచేసుకోవడంతో ఆ నెపాన్ని కేంద్రం ఆర్బీఐపై మోపింది. ఆర్థిక మోసాన్ని(నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ) ఆర్బీఐ అడ్డుకోలేకపోయిందని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆరోపించారు. ఇందుకు సమాధానంగా ఆర్బీఐ అప్పటి గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన అభిప్రాయాన్ని గట్టిగానే చెప్పారు. ఉర్జిత్కు ఆచార్య బాసటగా నిలిచారు. ఆర్బీఐపై సెక్షన్ 7 ప్రయోగించడానికి సిద్ధపడినప్పుడు ఏ మాత్రం భయపడకుండా గతేడాది అక్టోబర్ 26న విరాల్ ఆచార్య ఓ సమావేశంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్ర బ్యాంకు స్వతంత్రపై ప్రభుత్వ జోక్యం తగదనీ, అలా చేస్తే ఆ సర్కారు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టేనని పరోక్షంగా మోడీ సర్కారుకు చురకలంటించారు. కేంద్ర బ్యాంకు స్వతంత్రను గౌరవించకుంటే.. ఆర్థికమార్కెట్ ఆక్రోశానికి గురికాక తప్పదని వ్యాఖ్యలు చేసి చుక్కలు చూపించారు. ఇక అప్పుడే గవర్నర్లపై మోడీ సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగింది. తన మనుషులను ఆర్బీఐ బోర్డుల్లోకి చేర్చి మంటపెట్టాలని చూసింది. కానీ, ఆచార్య ప్రసంగంతో ఆర్బీఐ, కేంద్రం మధ్య అంతరం తీవ్రమైందన్న విషయం బహిర్గతం కావడంతో మోడీ సర్కార్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు. గత నవంబర్లో జరిగిన ఆర్బీఐ బోర్డు మీటింగ్లో ఇద్దరిపైనా వేటు పడుతుందని భావించినా కేంద్రం వెనక్కుతగ్గింది. తన పంతాన్ని బిమల్ జలాన్ కమిటీతో నెగ్గించుకోవాలని చూసింది. చివరికి డిసెంబర్లో ఉర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలను చూపుతూ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీకి నమ్మినబంటుగా ఉన్న శక్తికాంత్దాస్ను గవర్నర్గా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఆయన ఆర్ఎస్ఎస్ అనుకూలురు. ఆయన ఆధ్వర్యంలో ఆడిందే ఆట పాడిందే పాటగా కేంద్ర ప్రభుత్వం తన పనులను ఒక్కొక్కటీ చేసుకుంటూ వచ్చింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కంటే మరింత బలహీనం పరచడానికే మోడీ సర్కార్-2 పాలన మొగ్గు చూపింది. విరాల్ కూడా అభ్యుదయ వాది కాదు. మౌలికంగా ప్రపంచబ్యాంకును సమర్థించినవారే. అలాంటి విరాల్ కూడా కేంద్రం మీద తిరగబడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? రాజీనామా చేసిన మిగతా వారిదీ అదే పరిస్థితి. ఆర్థికవ్యవస్థ బలోపేతానికి మోడీ సర్కార్ చర్యలు తీసుకోక పోగా, ఆర్బీఐ నిధులపై కన్నేయడం వల్లే ఈ తిరుగుబాటుకు కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మిగులు నిధులను ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆశతో ఉన్న మోడీకి ఆచార్య రాజీనామా కొంతవరకు మింగుడుపడని అంశమే. జూన్లో ఇవ్వాల్సిన జలాల్ కమిటీ నివేదిక మరికొద్దిరోజులు వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాతనైనా నివేదికకు ఆమోద ముద్ర వేయించుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి బాధ్యత వహించి లెంపలేసుకోవాల్సిన మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వు బ్యాంకు నిధులపై కన్నేయడం దుర్మార్గం. దానిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.