Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నీతులు రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి'' ఈ దేశాన్ని, ప్రాణప్రదమైన మనుషుల్ని రక్షించుకోవాలని దేవరకొండ బాలగంగాధర తిలక్ దాదాపు ఆరు దశాబ్దాల కిందటనే తపించారు. ''మాకు నటనలు వద్దు మా చుట్టూ కటకటాలు వద్దు'' అని కూడా అన్నారాయన. కానీ ఇవాళ ఎల్లెడలా మనుషులు కనిపించీ కనిపించని సంకెళ్ళ నడుమ బందీలయ్యారు. ఒకవైపున ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల గురించి మాట్లాడుతున్నారు. మరోవైపున ధనమదాంధుల బలిమి కోసం జనాన్ని ఏమార్చే మంత్రాంగంలో పాలకులు నిమగమయ్యారు. తాము చెప్పిందే వేదమని, తమ మాటే శాసనమనే అహంకారం ప్రదర్శిస్తున్నారు. వంచన, నయవంచనలతో పగ్గాలని చేపట్టిన వారి విశృంఖలాధికారం పెట్రేగి పోతున్న వైనం నిత్యం చూడక తప్పనిస్థితిలోకి పాలితులు నెట్టబడ్డారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టం, నీతి, న్యాయం అనే మాటలు సారాన్ని కోల్పోయి బావురుమనే హృదయ విదారక దృశ్యం ముందు మాటలు మూగవోతున్నాయి. గొంతు పెగల్చి మాట్లాడగలిగేవారు సైతం నిశ్చేష్టులయ్యారు. మెజారిటీ స్వామ్యం అంతిమంగా మూకస్వామ్యంగా పరిణమించి సకలజనుల హక్కుల మీద ఉక్కుపాదం మోపే బీభత్స సన్నివేశం తెరముందు నగంగా నర్తిస్తున్నది. రాజ్యాంగం పేరిట ఎన్నికయి ఆ రాజ్యాంగాన్ని హాస్యాస్పదం చేసే విపరిణామాల పరంపర ముందు విలువలు జీవం కోల్పోతున్నాయి.
మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అనేమాట అలంకారానికే పరిమితమై ప్రజాస్వామ్యతేజం మసకబారుతున్నది. ఫిరాయింపుల పర్వం మీద ఎన్ని చట్టాలు తెచ్చినా నీతిమాలిన రాజకీయాల ముందు విలువ కోల్పోతున్నాయి. రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు ఉండరనేది ఒక నానుడి. కానీ ఒక నీతి ఉండదా? విలువలు ఉండవా? ఉండక్కర్లేదా? అని విస్తుపోతున్న స్థితిని చూస్తున్నాం. కానీ విలువలు లేకపోవడమే విలువగా భావించే ధోరణిని ప్రేరేపిస్తున్నారు. దశాబ్దాలుగా కొన్ని విలువలకు కట్టుబడిన వారి క్రమశిక్షణని, నిజాయితీని సైతం తప్పు పట్టే ద్వంద్వవిలువలకు ద్వారాలు తెరచిన సంక్లిష్ట సందర్భం నెలకొన్నది. విలువలు లేకపోవడం కాదు, విలువల రాహిత్యమే జీవనధోరణిగా ఆమోదం పొందడమే అతిభయానక స్థితి.
రాజకీయాల్లోనే కాదు సమాజంలోని సకల జీవన రంగాల్లో విలువలని త్రోసిరాజనే రీతికి అంగీకారం లభించడం అతి పెద్ద ప్రమాదం. ఏ విలువలూ అక్కర్లేదనుకునే ధోరణి ప్రబలిన తర్వాత మంచీచెడుల చర్చ ఉండదు. విజయం కోసం ఏ విలువలనైనా పణంగా పెట్టవచ్చని అంగీకరిస్తే ఎవరు ఏం చేసినా ప్రశ్నించే హక్కు ఉండదు. అలాగే బతకనేర్వడం పేరిట నీతి చట్రాల్ని, చట్టాల్ని పక్కకు నెట్టడాన్ని అంగీకరిస్తే ఈ సమాజం ఇలా మనుగడ సాగించగలదా?
నిజానికి సమాజంలో అత్యధికులు న్యాయం పక్షాన, నీతి పక్షాన నిలబడతారు. రెక్కలకష్టం చేసుకు బతికేవారు అన్యాయం పక్షాన నిలబడరు. కానీ వారిని ఏమార్చడం ద్వారా తమ వైపు తిప్పుకునే ప్రతీపశక్తులది పైచేయి అయినప్పుడు సమాజం అల్లకల్లోలమవుతుంది. సకల చట్టాలు, నీతివర్తనలు చెల్లాచెదురయిపోతాయి. అసమానతలు రాజ్యమేలి బీభత్సం నెలకొంటుంది. ఈ బీభత్సానికి ప్రతిఘటన అనివార్యం. అయితే ఆ లోపున సమాజానికి జరిగే నష్టం అపారం, అనూహ్యం, అతి హింసాత్మకం. సరిగ్గా ఇవాళ మనం ఇలాంటి స్థితికి దగ్గరలో ఉన్నామన్నది వాస్తవం.
ఈ నిజం చెప్పడం కూడా నేరమయినందునే మీడియాని, సోషల్ మీడియాని కాషాయదళం నియంత్రిస్తున్నది. తమని సమ్మతించని వారిని సజీవదహనం చేసిన దుర్మార్గుల్ని నిరాడంబరులుగా సమాజం ముందు నిలబెడుతున్నది. అబద్ధాల ఊరేగింపు అత్యాడంబరంగా కొనసాగుతుంటే నిజం ఒకపక్కకు ఒద్దికగా నిలబడి పోయే దృశ్యం వర్తమాన వైచిత్రి.
ఈ దేశం మాకేమిచ్చిందని అడగడం లేదు, ఈ దేశంలో మనగలిగే పరిస్థితులు లేవా అని కోట్లాదిమంది భీతి చెందడం ఏ స్వాతంత్య్ర ప్రతిఫలం? జనం ఏం తినాలో, ఏం మాట్లాడాలో, ఏం చదవాలో కూడా మరెవరో శాసించే దుస్థితి ఏ ప్రజాస్వామ్య ఫలశ్రుతి? ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర దేశంలో మెదడువాపు జబ్బుతో పిల్లలు ప్రాణాలు కోల్పోవడం ఈ దేశ వైజ్ఞానిక ప్రగతికి నిదర్శనమా? ఈ ప్రశ్నలు అడగకబోతే బావుండనే మన చుట్టూ డిజిటల్ మీడియా ఒక భ్రమా వలయాన్ని నిర్మించింది. మన జబ్బులకు మందుల్లేకపోతేనేం, కోహ్లీ కప్పు సాధిస్తాడో లేదోనని రంది పడమంటుంది మీడియా. ఇంట్లోంచి బయటికెళ్ళిన పదోతరగతి అమ్మాయి క్షేమంగా ఇంటికొస్తుందో లేదో తెలియదు. కానీ 'కబీర్సింగ్' వంద కోట్ల క్లబ్బులో చేరినందుకు ఆనందపడ మంటారు మార్కెట్ బేహారులు. విలువలేమైపోతేనేం మనం 5జీ టెక్నాలజీలోకి ప్రవేశిస్తున్నామని, చంద్రుని మీద అడుగు పెడుతున్నామని సంబరపడమంటారు నీతిమాలిన నేతలు.
సామ దాన బేధ దండోపాయాలతో జనాన్ని నియంత్రించాలనే కుటిల రాజనీతి అత్యాధునిక సమాజంలోనూ అమలు కావడమే అసలు విషాదం. అందుకే విలువలు గురించి తామే మాట్లాడి, ఆ విలువల్ని తామే కాలరాసి, విలువలు లేకపోవడమే విలువగా ప్రచారం చేసే ధోరణిని పాదుకొల్పడం నయవంచక, నరహంతక పాలకవర్గాల సరికొత్త నీతి. దీన్ని ధిక్కరించే చైతన్యాన్ని, ఆలోచనాధారని ప్రోది చేయడం అవసరం. అందుకే నీతులు రెండు నాల్కల సాచే పెద్దమనుషుల మాటనీ, చేతనీ ప్రతిఘటించే శక్తులలో భాగమవుదాం. స్వేచ్ఛకు నిజమైన అర్థాన్ని స్ఫురింపజేసే క్రియాశీలతని సంతరించుకుందాం.