Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని పార్టీలకు కొన్ని సమస్యలు నిత్యం మండుతూనే ఉండాలి. అవి చల్లారకూడదు. ఆ రాజకీయ మంటలలోంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకుంటాయి ఆ పార్టీలు. కాశ్మీర్ విషయంలో కమలనాథులదీ ఇదే తీరు. ఇందుకు హౌం మంత్రి అమిత్షా శుక్రవారం నాటి పార్లమెంటు ప్రసంగమే సాక్షి. కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా తమ పార్టీ అభిప్రాయా లను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అధికార పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే అక్కడ ఎన్నికలను వాయిదా వేస్తున్నదని ప్రతిపక్షాలు విమర్శించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కాశ్మీర్లో 132సార్లు రాష్ట్రపతి పాలన విధిస్తే, అందులో 93సార్లు కాంగ్రెస్ హయాంలోనే విధించడం జరిగిందని తమ చర్యను ఆయన సమర్థించుకున్నారు. అలాగే, అత్యంత ప్రధానమైన ఆర్టికల్370 తాత్కాలికమైనదేనని విస్పష్టంగా ప్రకటించి, తాము ఆర్టికల్ 370ని కచ్చితంగా రద్దు చేస్తామని తమ అంతర్గత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాశ్మీర్కు ఆర్టికల్ 370 గుండెయాక లాంటిది. స్వాతంత్య్రా నంతరం జమ్ము కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావడానికి మార్గం సుగమం చేసింది ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 లేకుంటే జమ్ము కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేది కాదు. ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేయడమంటే వేర్పాటువాదులకు కొత్త ఊపిరిపోసి, దేశ సమగ్రతను దెబ్బతీయడం తప్ప మరొకటి కాదు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఆర్టికల్ 370ని ఖాతరు చేయలేదు. దాని మౌలిక సారాంశానికి భిన్నంగా అనేకసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1954లో నాటి రాష్ట్రపతి ఆదేశంతో అమలులోకి వచ్చిన ఆర్టికల్ 370 ఆచరణలో నీరుకారిపోవడం కూడా కాశ్మీరీయుల ఆందోళనలకు ఒక ప్రధాన కారణం. జమ్మూ కాశ్మీరీయులు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం కాకుండా రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నంత కాలం ఆర్టికల్ 370కి అర్థమే ఉండదు. ఇప్పుడు రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించడం వారి ఆందోళనలకు ఆజ్యం పోస్తుంది తప్ప చల్లార్చదు. రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు రెండు రోజుల పాటు అమిత్ షా కాశ్మీర్లో పర్యటించారు. కాశ్మీర్లోని ఒకర్వాలాల్, గుజ్జర్ తదితర హిందూ కులాల నాయకులతో మంతనాలు జరిపారు. హిందువుల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలలో హిందూ ఓటు బ్యాంక్ను సంఘటితం చేసేందుకే ఈ మంతనాలన్నది జగద్విదితం. ఒకవైపు బహిరంగంగా హిందూ నాయకులతో మంతనాలు జరిగిపిన షా, మరోవైపు కొందరు వేర్పాటువాద నాయకులతో రహస్య మంతనాలకు నేతృత్వం వహించారు. మొత్తంమీద, కాశ్మీర్లోని హిందువులు, ఎన్నికలకు తాము సిద్ధం చేసిన వేర్పాటు వాదులతో కూడిన ఓటుబ్యాంక్తో కాశ్మీర్లో బీజేపీ సొంతంగా గద్దెనెక్కేందుకు పావులు కదుపుతున్నారు. తాము సొంతంగా గద్దెనెక్కిన తరువాత ఆర్టికల్ 370 రద్దుతోపాటు, జమ్ము కాశ్మీర్ మూలాలున్న వారికి మాత్రమే రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేసే హక్కును కలిగించే 35-ఏ అధికరణను రద్దు చేయాలన్న పథక రచన చేస్తున్నారు.
కాశ్మీర్లో బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద రాజకీయాల కారణంగా గత ఐదేండ్ల మోడీ పాలనలో హింస విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మత ప్రాతిపదికన హిందూ ఓటుబ్యాంక్ను సృష్టించుకునేందుకు, ముస్లింలను చీల్చేందుకూ చేస్తున్న తీవ్ర ప్రయత్నాల ఫలితంగా హింసాకాండ మరింతగా విజృంభిస్తుంది. ఈ వాతావరణం దేశం నుంచి కాశ్మీర్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న వేర్పాటువాదులు పెద్ద ఎత్తున దాడులకు తెగబడడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది జరగాలనే కమలనాథులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాశ్మీర్లో హిందువులపై దాడులు జరిగితే ఆ దాడులను హిందువులను రెచ్చగొట్టి దేశవ్యాప్తంగా హిందూ ఓటుబ్యాంకును పటిష్టం చేసుకోవచ్చన్నది వారి ఎత్తుగడ. తద్వారా కాశ్మీరీయులతోపాటు మొత్తం దేశ ప్రజలు మరింత కల్లోలంలో కూరుకుపోవడం తప్ప దేశ ప్రజలకు, వారు నిత్యం జపించే హిందువులకూ వొరిగేదేమీ లేదు. అయినా, దేశ సరిహద్దుల గురించి తప్ప దేశ ప్రజల గురించి కమలనాథులు ఎప్పుడు ఆలోచించారనీ!?
కమలనాథులకు దేశ సరిహద్దులు, అంతకన్నా దేశంపై ఆధిపత్యం ముఖ్యం. కాబట్టి వారు అన్నార్తులకన్నా సరిహద్దులకే ఎక్కువ విలువిస్తారు. అన్నం మీద కన్నా సరిద్దులను కాపాడే ఆయుధాల మీదే అధికంగా ఖర్చు చేస్తారు. అందుకే, అధిక ధరలను దించడం ద్వారా ప్రజలందరినీ ఆకలినుంచి రక్షిస్తామని కాకుండా, సరిహద్దు భద్రతలను పెంచడం ద్వారా ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడడమే తమ ప్రథమ ధ్యేయమని అమిత్ షా పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు.
తమ అధికారం కోసం, ఆధిపత్యం కోసం సంఘ్పరివార్ శక్తులు ఎంతకైనా తెగిస్తాయి. మతాల పేరుతో మనుషుల మధ్య యుధ్ధం సృష్టించి స్వమతస్తుల శవాలను ఎరవేసి, పరమతస్తుల ప్రాణాలు హరించి తాము అనుకున్నది సాధిస్తాయి. అధికారమెలాగూ వారి కబంధ హస్తాలలో చిక్కుకు పోయింది, తామన్నా చిక్కుబడకుండా ఉండడమే ఇప్పుడీ దేశ ప్రజలు చేయాల్సిన పని!