Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికే కేరళ రాష్ట్రం ఒక తలమానికం. కేంద్రం నుంచి అనుకున్నంత సహకారం అందకున్నా ప్రకృతి ప్రళయం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినా వాటిని తట్టుకుని అభివృద్ధిపథంలో కేరళ దూసుకుపోతున్నది. ఇది ఆ రాష్ట్రప్రభుత్వం చెప్పుకుంటున్న డాంబికాలు కాదు. కేంద్రప్రభుత్వ సంస్థలు చెబుతున్నమాటే. మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిటి ఆయోగ్ నివేదికల్లోనూ కేరళే ముందు వరుసలో ఉంది. 2017-18లో ఆరోగ్యరంగంలో కేరళ 74.01 స్కోర్తో మెరుగైన పనితీరు ప్రదర్శించి మొదటి స్థానంలో నిలిచిందని నిటి ఆయోగ్ వెల్లడించింది. తెలంగాణ పదో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అట్టడుగున ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం విడుదలైన ఆరోగ్యసూచీలోనూ కేరళే ప్రథమస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకుపోవడం వల్లే ఇంతటి ప్రగతి సాధ్యమైంది.
నవజాత శిశు మరణాలు, శిశు మరణాలు, సంతాన సాఫల్యత రేటు, వ్యాధి నిరోధకత, క్షయవ్యాధి, మౌలిక సదుపాయాలు, హెచ్ఐవీని అరికట్టడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి 23అంశాల ప్రాతిపదికన నిటి ఆయోగ్ ఆరోగ్య సూచీ రూపొందించింది. చాలా రాష్ట్రాలు మెరుగైన స్కోరు సాధించినా కనీసం 80 వరకూ ఉంటేనే ఆరోగ్యరంగంలో అన్నివిధాలా పటిష్టంగా ఉన్నట్టు అని ఆ సంస్థ హెచ్చరించినా కేరళ ప్రభుత్వం స్వాగతించింది. ప్రసూతి మరణాల రేటును 2020నాటికి 30గాను, 2030నాటికి 20గా నమోదు చేసి స్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం ఆ రాష్ట్రం విశిష్టత. ఎంతటి అనారోగ్య సమస్య ఎదురైనా ఆర్థికపరమైన చిక్కుల్లో పడకుండా దాన్నుంచి పౌరులు బయటపడగలిగే స్థితి ఏర్పరచాలన్నదే సార్వత్రిక ఆరోగ్య సదుపాయం సారాంశం. కానీ నిటిఆయోగ్ ఆరోగ్య సూచీని చూస్తే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆ దిశగా బుడిబుడి అడుగులైనా పడుతున్నాయా అన్న సందేహం కలుగక మానదు.
2015 నుంచి ఆరోగ్య సూచీని విడుదల చేస్తున్నా వాటిని గమనంలోకి తీసుకుని ముందుకుపోతున్న రాష్ట్రాలు తక్కువే. 2015-16లో ప్రతి 1000కి 41గా ఉన్న పిల్లల మరణాల సంఖ్యను 2019 నాటికి 28కి తగ్గించాలని, 2013-14లో ప్రతి లక్ష జననాలకు 167గా ఉన్న ప్రసూతి మరణాల సంఖ్యను 2018-20 నాటికి వందకు తగ్గించాలనీ 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలనే లక్ష్యాల్ని నిర్దేశించుకున్నా ఆ దిశగా కృషి చేస్తున్నదెక్కడ. ఆరోగ్యరంగం పట్ల మోడీ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. భారత దేశం ఆర్థికాభివృద్ధి రేటు కొత్త పుంతలు తొక్కుతోందని గొప్పలు పోతున్న కేంద్ర సర్కార్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నదెక్కడీ ఇటీవల బీహార్లో 150మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధికి బలయ్యారు. రెండేండ్లక్రితం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో 600మంది పిల్లలు మెదడువాపు వ్యాధితోనే కన్నుమూశారు. ఇంత జరుగుతున్నా పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. తెలంగాణ రాష్ట్రంలోనూ గతేడాది పలువురు చిన్నపిల్లలు చనిపోయారు. కానీ నిఫా వ్యాధి ప్రచారంతో జనం అల్లాడుతుంటే ఒకటికి మించి మరణాల సంఖ్య పెరగకుండా ముందస్తు చర్యలతో కేరళ ప్రభుత్వం జాగ్రత్త పడింది. సకాలంలో వైద్య సదుపాయం అందించగలిగితే జాతీయస్థాయిలో సంభవించే మరణాల్లో కనీసం మూడోవంతు నిరోధించడం సాధ్యమేనని నిరుడు జాతీయ శాంపిల్ సర్వే వెల్లడించింది.
దేశ ప్రజల ఆర్థిక సామాజిక ప్రగతికి, ఒక జాతి అన్ని కోణాల్లోనూ అభివృద్ధి చెందడానికి విద్యతో పాటు వైద్యరంగమేనని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, మన దేశంలో ఈ రెండు అంశాలే అత్యంత నిర్లక్షానికి గురవుతుండటం బాధాకరం. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.02 శాతాన్ని మాత్రమే ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్నామంటే ఆ రంగంలో ప్రగతి ఎంత అధ్వాన్నంగా ఉందనడానికి నిటి ఆయోగ్ లెక్కలే నిదర్శనం. మోడీ ప్రభుత్వం మొదటి ఐదేండ్లపాలనలో ఆరోగ్యరంగానికి నిధులు కేటాయించింది శూన్యం. ఆయుష్మాన్ భారత్ ఒక్కటే ఆరోగ్యానికి దివ్యమైన ఔషధంగా ప్రచారం చేసుకుంటున్నది. కార్పొరేట్ ఆస్పత్రుల మేలు కోసం తప్ప ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడింది శూన్యం. తెలంగాణ, ఏపీల్లో ఉన్న ఆరోగ్యశ్రీదీ అదే దారి. వృద్ధిరేటు గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రప్రభుత్వం బరువు తక్కువగా వున్న పిల్లలు ఎక్కువగా మన దేశంలోనే ఎందుకున్నారో చెప్పగలదా? ఈ విషయంలో మన దేశం చాలా ఆఫ్రికన్ దేశాలలో కన్నా హీనంగా వున్నది. చాలా దేశాలు ప్రజారోగ్యానికి ఐదు నుంచి 9.2శాతం వరకూ ఖర్చు చేస్తున్నాయి. ఇక్కడ ప్రతిభావంతులైన వైద్యులకు కొదవ లేదు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డాక్టర్లూ ఉన్నారు. కానీ, ప్రజలకు చౌకగా వైద్య సేవలందించాలనే సంకల్పమే లోపిస్తున్నది. కనుక కేటాయింపుల్ని మరింత పెంచి దేశంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం తక్షణ కర్తవ్యమని పాలకులు గుర్తించాలి. 'అందరికీ ఆరోగ్యం' నినాదాన్ని సాకారం చేయాలంటే ఆరోగ్య వ్యవస్థను మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేసే విధానాలను విడనాడాలి.