Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవితో సహజసిద్ధంగా ముడిపడి ఉన్న గిరిజన జీవనోపాధిపై దెబ్బకొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వికృత క్రీడకు పూనుకున్నది. ఏజెన్సీ ప్రాంతాల్లో అలజడి సృష్టించి జులుం చెలాయిస్తోంది. అక్కడ నివసించే అడవి బిడ్డలపై హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నాం, టైగర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నామంటూ సర్కారు చేస్తున్న హడావుడి, నిజానికి గిరిజనులను తరిమేయ డానికేనని, సార్సాల, ఖమ్మం ఘటనలు రుజువు చేస్తున్నాయి. పిల్లాపాపలతో కళకళలాడాల్సిన గిరిజన గూడేల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లు తప్పుడు సంకేతాలను పంపుతున్నాయి. తుపాకులతో మిలటరీ బలగాలు చేస్తున్న గస్తీ, అడవుల్లో అశాంతి సృష్టిస్తున్నాయి. సర్కారే నేరుగా పోడు సాగుదారులకు పట్టాలివ్వకుండా అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కుతున్నది. షెడ్యూల్డ్ ఏరియాలో 1/70 చట్టాన్ని అమలుచేసి గిరిజనుల భూముల అన్యాక్రాంతాన్ని అరికట్టే బాధ్యత నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కకు తప్పుకున్నది.
పోడు సాగుదారులను గ్రామసభల ద్వారా గుర్తించి పట్టాలివ్వాలని అటవీచట్టం చెబుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13లక్షల ఎకరాల్లో సాగుపట్టాల కోసం 2లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, కేవలం 99వేల మందికి మాత్రమే 3లక్షల ఎకరాలపై హక్కు పత్రాలిచ్చి చేతులు దులుపుకున్నది. ఇప్పటికే సరిహద్దు భూవివాదాల మూలంగా వేలాది ఎకరాల పట్టాసాగు భూములు, పోడుసాగు భూముల కేసులు ఏండ్లతరబడి కోర్టుల్లో మూలుగుతున్నాయి. దీనికితోడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మూలంగా వందలాది గిరిజన గూడేలు అటవీశాఖ పరిధిలోకి వెళ్లాయి. గూడేలను ఖాళీ చేయాలని నిత్యం ఆదివాసీలను, గిరిజనులను వేధిస్తూనే ఉన్నారు. గిరిజనులపై ఫారెస్ట్రేంజ్ అధికారుల దాడుల విషయంలో రెవెన్యూ అధికారులు, సివిల్ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తున్నది. కొమురంభీం- ఆసీఫాబాద్ జిల్లా సార్సాల ఘటన యథాలాపంగా జరిగిన సంఘటనేమీ కాదు. రాజకీయ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల భూవివాదాల సమస్య పరిష్కరించాల్సిన తక్షణావసరం కనిపిస్తున్నది. కానీ ఆ బాధ్యత నుంచి సర్కారు తప్పుకుంటున్నది. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి పెండింగ్ కేసుల అంతు తేల్చాలి. టైగర్ జోన్ల పేరుతో ఆదిలాబాద్జిల్లా జిన్నారం ప్రాంతంలోని ఏడు మండలాల్లో 42 గూడేలను, మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలోని 11గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం నోటిఫై చేయడం గమనార్హం. ప్రాజెక్టులు, కంపెనీలు, ఓపెన్కాస్ట్ గనుల తవ్వకాల పేరుతో బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు లక్షలాది ఎకరాల అటవీభూములను కట్టబెట్టడానికి టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద అటవీభూమిని తీసుకుని, ప్రత్యామ్నాయంగా సార్సాల గ్రామంలో 220 ఎకరాలను అటవీశాఖకు ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొంటూ గత 40, 50 ఏండ్లుగా సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్న రైతుల భూములను ఫారెస్ట్ అధికారులు, పోలీసుల అండతో గత జూన్ 30న ఆక్రమణకు పూనుకున్నారు. ఆ భూములను రైతులు సాగుచేసుకుంటున్నారనే సంగతి తెలిసినప్పటికీ, పోలీసులను వెంటతీసుకుని అటవీశాఖ అధికారులు చెట్లునాటే ప్రక్రియకు పూనుకోవడం సహించరానిది. రిజర్వ్ ఫారెస్ట్లోని అడవులను కొంతమంది అటవీశాఖ అధికారుల సహకారంతో స్మగ్లర్లు చెట్లు నరుకుతున్నా, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆసీఫాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లోని 50వేల ఎకరాల భూ సమస్యను ఏండ్లుగా పెండింగ్ పెట్టింది. సర్కారు భూమి, ఫారెస్ట్ భూమిగా మారాలంటే అటవీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానాలను తూచ తప్పకుండా అమలుచేయడం, దాన్నే తుది నిర్ణయంగా భావించడం, ప్రభుత్వ జోక్యాన్ని నిరోధించడం, జాతీయ అవసరాలరీత్యా గవర్నర్ పరిధిలో భూముల్ని వినియోగించే అధికారం లేకపోవడం తదితర విషయాలను అటవీ చట్టం సెక్షన్ 4 నుంచి 15వరకు తెలియజేస్తున్నాయి. ఈ సంగతులు ఇటు అటవీశాఖకు, అటు ప్రభుత్వానికి తెలియనివా? చట్టాన్ని ధిక్కరిస్తూ, గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నాలు చేయడం ప్రభుత్వమే చట్టాల ఉల్లంఘనకు పాల్పడటమే. ఒకవైపు గిరిజనులపై నిర్బంధాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తున్నది. మరోవైపు వాస్తవాలను పరిశీలించేందుకు బుధవారం సార్సాలకు వెళ్లిన వామపక్ష పార్టీల నేతలను అక్కడికి వెళ్లకుండానే అరెస్ట్ చేయడం గిరిజనులను ఒంటరి పాటు చేయడానికే. అంతేగాక పోలీస్ బలగాలతో ఆ గ్రామంలో మరునాడు మొక్కలను నాటించడం ప్రభుత్వ దమననీతికి తార్కాణం. ఖమ్మం ఏజెన్సీలో గిరిజనులను అడవుల్లోకి వెళ్లకుండా గుంతలను తవ్విస్తుండగా అడ్డుపడ్డ స్థానికులపై పీడీ చట్టం ప్రయోగించడం ప్రభుత్వ నియంతృత్వ చర్యకు తాజా సాక్ష్యం. సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలకు అర్థం ఇదేనా.. అని వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.