Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటక ప్రభుత్వం సంక్షోభంలో పడింది అనడం కంటే అది ఏర్పడినప్పటినుంచీ సంక్షోభంలోనే కొనసాగుతోంది అనడం సబబు. గత ఏడాదిన్నర కాలంగా ఈ 'కర్నాటకం' అనేక మలుపులు తిరుగుతూ సాగుతోంది. ఇప్పుడు సంకీర్ణ భాగస్వాములైన కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి 13మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ 'నాటకం' మరో కొత్త మలుపు తిరిగింది. కాకపోతే ప్రతి మలుపులోనూ అన్ని పార్టీల వారికీ రాజకీయ ప్రయోజనాలు, అధికార యావే తప్ప ప్రజా ప్రయోజనాలే కనిపించకపోవడం విచారకరం.
బీజేపీ అధికారంలోకి రాకుండా నిలవరించటం కోసం కేవలం 37సీట్లు మాత్రమే ఉన్న జనతాదళ్(ఎస్) నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెసు అంగీకరించక తప్పలేదు. నిజానికి జనతాదళ్ (సెక్యులర్)లో 'సెక్యులర్' అనేది పేరులోనే తప్ప ఆచరణలో అవకాశవాదమే ఎక్కువ. అది అధికారం కోసం ఎవరితో అంటకాగడానికైనా సిద్ధమేనని అనేకసార్లు నిరూపించుకుంది. ఈ సంగతి బాగా తెలిసిన కాంగ్రెస్ కర్నాటకలో బీజేపీనీ, 'కాంగ్రెస్ ముక్తభారత్' అన్న దాని ఉద్దేశ్యాన్ని నిలువరించేందుకు అనివార్యంగా జేడీ(ఎస్)కు నేతృత్వం అప్పగించి ఆ ప్రభుత్వంలో చేరింది. అధికారం మీద ఆశే తప్ప తన అతి స్వల్పమైన సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, నడపడం సాధ్యమా, ఇది నైతికమా అనైతికమా అన్న ధ్యాసేలేని జేడీ(ఎస్) పీఠమెక్కింది! అప్పటికి ఒప్పుకున్నప్పటికీ, కాంగ్రెసుకు మాత్రం ఇది మింగుడుపడటం లేదు. అది మొదలు సంకీర్ణ పార్టీల ఆధిపత్య కీచులాటలకు తోడు, దానిని అవకాశంగా తీసుకుని అందలమెక్కాలన్న కమలనాథుల కుటిల యత్నాలతో ఆది నుంచీ ఆ ప్రభుత్వం 'దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు' అన్న చందంగానే మనుగడ సాగిస్తోంది.
విశేషమేమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మొదట బీజేపీకే అవకాశమిచ్చారు. కానీ సభావిశ్వాసాన్ని పొందడం కోసం ఆ పార్టీ వేసిన ఎత్తులన్నీ చిత్తుకావడంతో ఆ ప్రభుత్వం తప్పుకోక తప్పలేదు. అయినా ఆశ చావని బీజేపీ 'ఆపరేషన్ లోటస్' పేరుతో అనేక విఫల ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. ఈ మొత్తం ప్రహసనంలో వీరు వారనే తేడాలేకుండా అందరివీ అవకాశవాద రాజకీయాలే..! అడుగడుగునా అనైతిక పోకడలే..!! ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఎన్నికవడమే గాక, కర్నాటకలో దాదాపు అన్ని సీట్లు గెలుచుకోవడంతో కమలనాథుల అధికారవాంఛ పరాకాష్టకు చేరిందేమో.. తాజాగా ''ఆపరేషన్ లోటస్ 4.0''కు తెర లేపారు.
అయితే ఇప్పటికే అనేక 'ఆపరేషన్ లోటస్'లు విఫలమై ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదన్న అప్రతిష్టను మూటగట్టుకున్న బీజేపీ.. ఇప్పుడీ 'ఆపరేషన్ లోటస్ 4.0'లో తన వ్యూహాలకు కొత్తరంగు పులుముతోంది. నేరుగా ఫిరాయింపులకు పాల్పడకుండా, శాసనసభలో తమ మెజారిటీ నిరూపణకు అనుకూలంగా అంకగణితాన్ని తారుమారు చేయజూస్తోంది! రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224 కాగా మెజారిటీకి కావల్సింది 113. బీజేపీ 105 సీట్లతో మెజారిటీకి 13 సీట్ల దూరంలో ఉంది. కాబట్టి ఫిరాయింపులకు బదులుగా ఎదుటి పక్షంలో రాజీనామాలను ప్రోత్సహించడం ద్వారా తమకున్న సంఖ్యాబలంతోనే అందలమెక్కాలన్నది బీజేపీ పన్నాగం. ప్రస్తుతం కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి 13మంది రాజీనామాలు చేయడంతో మెజారిటీ నిరూపణకు కావాల్సిన సంఖ్యాబలం 106కు తగ్గింది. అంటే కమలనాథులు మ్యాజిక్ ఫిగర్కు కేవలం ఒక్క సీటు దూరానికి చేరుకున్నారు. మరో పదిహేనుమందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈసారి కుమారస్వామి ప్రభుత్వ పతనం ఖాయమన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే ''ఆపరేషన్ లోటస్ 4.0'' సారాంశమని కాంగ్రెస్ ఆరోపిస్తున్నా... కాదు కాదు ఈ రాజీనామాలు ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని బీజేపీ వాదిస్తున్నా.. అసలు సంగతేమిటో బహిరంగ రహస్యమే..!
పాలకపక్ష సభ్యులతో రాజీనామాలు చేయించి, తర్వాత ప్రభుత్వాన్ని మైనారిటీలో పడేసి, ఆపైన విశ్వాస పరీక్షలో ఓడించి, తాము అధికార పీఠమెక్కి, ఆ తరువాత రాజీనామాలు చేసిన వారిని తిరిగి ఎన్నిక గావించడమే కమలనాథుల తాజా వ్యూహం..! ఇది ఫిరాయింపు రాజకీయాలకు కొత్తరంగు పులమడమే. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే.. ప్రజాస్వామ్యానికి గోతులు తీయడమే.. 60వ దశకంలో తన అవసరార్థం కాంగ్రెస్ ప్రారంభించిన ఈ ఫిరాయింపుల పర్వం ఇప్పుడు బీజేపీ సారథ్యంలో కొత్తరంగులు అద్దుకుంటుంటే మధ్యలో వీటి నివారణకంటూ తెచ్చుకున్న ''ఫిరాయింపుల నిరోధక చట్టం'' నివ్వెరపోతోంది. అధికారానికి రాజకీయ అవినీతే రాచమార్గమవుతోంటే ప్రజాతీర్పు చిన్నబోతోంది. ఈ కుర్చీలాటలో వామపక్షాలు మినహా అన్ని పార్టీలదీ అధికార దాహమే..! అందరివీ పదవీ వ్యామోహాలే తప్ప పాలన, ప్రజాసంక్షేమం గురించిన పట్టింపే లేదు. ఈ ఫిరాయింపుల జాడ్యం ఇలాగే కొనసాగితే ఇది కర్నాటకకో, ప్రత్యర్థి ప్రభుత్వాలను కూలదోయడానికో మాత్రమే పరిమితం కాదు. దేశంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనే నిరంకుశ పోకడలకూ, బీజేపీ కోరుకుంటున్న ఏకపార్టీ పాలనకూ దారితీస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని గర్వంగా చెప్పుకుంటున్నాం. దానిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలదే!