Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో అరవై శాతానికిపైన ప్రజలు ఆధారపడిన వ్యవసాయరంగాన్ని మోడీ సర్కారు బడ్జెట్లో తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వ్యవసాయం ఇంజిన్ వంటిదని, ఆ రంగం వృద్ధికి, రైతుల ఆదాయం పెరిగేలా అన్నివిధాలా పనిచేస్తామని 2014 ఎన్నికల సమయంలో చెప్పిన మోడీ.. మొన్నటి ఐదేండ్ల పాలనలోనూ, రెండోసారి అధికారంలో కొచ్చిన తర్వాత కూడా ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం. ఇటీవలి బడ్జెట్లోనూ కొత్తదనం ఏమీ లేదు. అయితే.., వ్యవసాయాన్ని విస్మరించి జీడీపీ వృద్ధిరేటును 8శాతం వద్ద సుస్థిరంగా నిలబెట్టడం ఎలా సాధ్యమవుతుంది? అన్నది ప్రశ్న. వ్యవసాయాన్ని బాగుచేయకుండా జీడీపీ గ్రాఫ్ను అమాంతం పెంచుతామనడం పెద్ద మోసమే. ఏడాదికి సగటున 12వేల మంది రైతులు బతుకీడ్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. విత్తనాలు, ఎరువులు తదితర ఉత్పాదకాల ఖర్చులు పెరుగుతున్నాయని మొత్తుకుంటున్నారు. బ్యాంక్ రుణాలు అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన కేంద్రం.. వారికోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్లను వర్తింపజేస్తామని ప్రకటించడం అవమానించడమే. మోడీ సర్కారు బడ్జెట్లో రైతులకు రిక్తహస్తం చూపింది.
గతం కంటే ఈసారి వ్యవసాయానికి బడ్జెట్లో ఎక్కువ నిధులిచ్చామని కేంద్రం చంకలు గుద్దుకుంటున్నది. రూ.లక్షా 30 వేల కోట్లు కేటాయించినట్టు చూపినా.. ఆ నిధులలో అధికమొత్తం ప్రభుత్వ పథకాలకే. వ్యవసాయరంగానికి వాస్తవ కేటాయింపులు రూ.20 వేల కోట్లు మాత్రమే. మిగతావి అత్యధికంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.75 వేల కోట్లు. అందులోనూ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూపిన నిధులే తప్ప ప్రస్తుతం అదనంగా పెంచింది లేదు. మళ్లీ అధికారంలోకొచ్చాక స్కీమ్ను రైతులందరికీ వర్తింప చేస్తామన్న మోడీ.. బడ్జెట్లో మాత్రం ఆ మేరకు కేటాయింపులు పెంచలేదు. ఇదీ రైతులపై మోడీ సర్కారుకు ఉన్న శ్రద్ధ. మోడీ సర్కార్ గొప్పలు పోతున్నట్టుగా కిసాన్ సమ్మాన్ నిధి పరిష్కారమైతే రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నట్టు? ఇలాంటి పథకాలే తెలంగాణ, ఏపీలోనూ ఇస్తున్నా రైతులు చనిపోతూనే ఉన్నారు. అన్నదాతలు పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉచిత సలహాలు ఇచ్చారు. బడ్జెట్ పరిశీలించినప్పుడు.. అన్ని రంగాలలో మాదిరి వ్యవసాయంలోనూ ప్రత్యక్ష బాధ్యత నుంచి తప్పుకుని కార్పొరేట్ల ఇష్టారాజ్యంగా మార్చడానికి దారి ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతున్నది.
సర్కారు ఆశించినట్టు ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే వ్యవసాయవృద్ధిరేటు 14.5శాతం నమోదు కావాలి. బాగా వర్షాలు కురిసిన ఏడాదిలోనే వ్యవసాయ వృద్ధిరేటు రెండు శాతం వద్ద ఊగిసలాడింది. రెండేండ్ల నుంచీ దేశంలో చాలా ప్రాంతాల్లో కరువు నెలకొంది. రైతు అడుగుతున్న డిమాండ్లను నెరవేర్చకుండా ఏడు శాతం ఎనిమిది శాతం వద్ధి ఎలా సాధ్యమో ప్రభుత్వం చెప్పాలి. ఇప్పటికీ వంటనూనె, పంచదార, పప్పుధాన్యాల వంటి పంటలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 1990లో దేశం స్వయం సమృద్ధిగా ఉంటే.. యిప్పటికీ దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తున్నది. పంటల దిగుబడీ తగ్గుతూ వస్తున్నది. ఇదేనా బీజేపీ చెబుతున్న జాతీయత?
రైతు పండించిన పంటకు శాస్త్రీయపద్ధతిలో ధర స్థిరీకరించాలి. ఉత్పత్తిధర మీద 50శాతం అదనంగా రేటును ఇవ్వాలి. ఒకటే పద్ధతి గాకుండా రాష్ట్రాలవారీగా ధర నిర్ణయిస్తే రైతుకు మేలు జరుగుతుంది. బడ్జెట్కు ముందు ఖరీఫ్ సీజన్ కోసం 14 పంటలకు కేంద్రం మద్దతుధరలు ప్రకటించింది. వరికి రూ.1,750 నుంచీ రూ.1,815కు కేవలం రూ.65 అంటే 3.7శాతం మాత్రమే పెంచింది. సర్కారు ప్రకటించిన ఆ మద్దతు ధరలకైనా రైతుల నుంచీ పంటలను కొనే దిక్కు కూడా లేదు. ఎఫ్సీఐ, నాఫెడ్ తదితర ప్రభుత్వ సంస్థలు నయా ఉదారవాద విధానాలతో నిర్వీర్యమయ్యాయి. ప్రయివేటు వ్యాపారి చెప్పిన ధరకే రైతు పంటను తెగనమ్ముకోవలసి వస్తోంది. న్యాయమైన ధర రాకపోతే అదే జీవనాధారంగా గల రైతులు, కౌలురైతులు వ్యవసాయ కార్మికుల బతుకు గడిచేదెలా? బ్యాంకు రుణాలివ్వడంలో రైతులకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఏటా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాల్లో ప్రణాళికలు ఘనంగా ఉంటున్నా ఆచరణలోకి వచ్చేసరికి రైతుకు దక్కుతున్నది అరకొర సాయమే, కంటితుడుపు చర్యలతో కర్షకుల కష్టాలను తీర్చలేమన్నది పాలకులకు తెలియందేమీ కాదు. కాకపోతే ఎన్నికల్లో గెలుపొందేందుకు పథకాల పేరిట ఆశచూపి, ఆ తర్వాత మోసపుచ్చడం మామూలైంది. ధరలను స్థిరీకరించడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం జీరో బడ్జెట్ విధానంలో వ్యవసాయం చేయాలని ఆర్థికమంత్రి సూచించడమంటే రైతును కోలుకోలేని దెబ్బకొట్టడమే. నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో వ్యవసాయం కుదుట పడదన్నది వాస్తవం. శ్రమతో సంపద సృష్టిస్తున్న కార్మిక, కర్షక జనావళిని కష్టపెట్టే బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ, ఐక్య ఉద్యమం సాగాలి.