Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్లో కుమ్ములాటలు ముదురుతున్నాయి. అంతా సవ్యంగా ఉందనుకున్న పరిస్థితి నుంచి, అంతటా కీచులాటలే అనే దుస్థితికి కారు పార్టీ చేరింది. సొంత పార్టీ నేతలే చెమటలు పట్టిస్తున్నారు. ఎక్కువగా మంత్రులు, ఎమ్మెల్యేలూ ఎమ్మెల్సీల్లో ఇప్పటికే నాయకత్వం పట్ల అసంతృప్తి ఉందన్నది నిర్వివాదాంశం. తాజాగా సభ్యత్వ నమోదు నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య చోటుచేసుకుంటున్న అభిప్రాయ బేధాలు బహిర్గతమవుతున్నాయి. కొందరు పదవులు రాలేదనే కారణంగా, ప్రగతిభవన్కు, సీఎం కేసీఆర్కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు దూరమవుతుండగా మరికొందరు పార్టీలో నియంతృత్వం పెరిగిందంటూ టీఆర్ఎస్కు గుడ్బై చెబుతున్నారు. సొంత పార్టీవారితో పాటు తాజాగా ఫిరాయింఫులను ప్రోత్సహించడం ద్వారా గులాబీ గుమ్మిని నింపేశారు కేసీఆర్. ఇప్పుడు వారంతా ఆ పార్టీలో కక్కలేక, మింగలేక సతమతమవుతున్నారు. ఏదో ఉద్ధరిద్దామని, ప్రజల కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలంతా కారులో గాలాడక ఊపిరినే కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారనే రాజకీయ నిపుణుల విశ్లేషణ ఉండనే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకైతే రాజకీయంగా తాము బతికున్నామా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పదవులూ నిధులూ సొంత అవసరాల కోసం టీఆర్ఎస్లో చేరిన సదరు ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కప్పలతక్కెడగా మారిన కారు పార్టీ, ప్రతిపక్షం ఉనికిలేకుండా చేయడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నది. ఈ తరుణంలో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కారుకి తొమ్మిది సీట్లిచ్చి నేలకు దించారు. అధినేత బిడ్డనే ఓడించారు. అంతేగాక ఆ పార్టీలో కూడా రోజురోజుకు అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
ప్రజాతీర్పును అగౌరవపరిచి కారెక్కిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో స్థానిక ప్రజల నుంచి చీవాట్లు, తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్న దయనీయ స్థితి. పార్టీ బలోపేతం పేర అడ్డదారుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తనదారిలోకి తెచ్చుకున్న కేసీఆర్, వారి ఆశలను నెరవేర్చడంలో ఆలస్యం చేస్తున్నారనే అసంతృప్తి గూడుకట్టుకుని ఉందనేది అందరికీ తెలిసిన సంగతే. తద్వారా చేరినవారితో పాటు అప్పటికే పార్టీలో ఉన్న టీఆర్ఎస్ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు. మంత్రులు ఉన్నా పేరుకే.. ప్రగతిభవన్లోకి వారికి నేరుగా 'నో' ఎంట్రీ. శాసనసభ్యులు కూడా వెళ్లి కలవడం దుర్లభం. ఇందుకు తాజా సాక్ష్యాలు అనేకం. రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్కు రాజీనామా పరిణామం గమనార్హం. పార్టీలో జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోతున్నాననీ, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యేతోపాటు ఒక మంత్రి మూలంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాననీ ఆయన ప్రకటించిన విషయం తెలుసు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, మాజీ మంత్రి, తాజాగా ఎమ్మెల్సీ అయిన పట్నం మహేందర్రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎవరికివారే యమునాతీరులా నడుస్తున్నది. ఇక్కడ కుమ్ములాటలు నిత్యకృత్యమయ్యాయని రోజూ పత్రికలు రాస్తూనే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే విష్ణుమోహన్రెడ్డికి విభేదాలు తీవ్రమయ్యాయి. జిల్లా పరిషత్ల విభజన నేపథ్యంలో అధికారుల బదిలీ ఇందుకు కారణమైంది. తనకు చెప్పకుండా జెడ్పీ సీఈవోని మారుస్తారా అంటూ ఏకంగా ఆయన తన గన్మెన్లను ప్రభుత్వానికి తిరిగి పంపేశారు. పంచాయితీ కేటీఆర్ దగ్గరకు చేరింది. చివరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మూడుసార్లు జీవోలను సవరించాల్సి వచ్చింది. రెండు వారాల క్రితం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వరుస ఎన్నికల మూలంగా అభివృద్ధి కుంటుపడుతున్నదంటూ మాజీ మంత్రి జోగు రామన్న ప్రస్తావించగా, కేసీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేపట్టి కొనసాగిస్తున్న రాజకీయ పునరేకీకరణ కారణంగా పార్టీలో ముసలం ఇప్పటికే పుట్టిందన్న వ్యాఖ్యానాలు సీనియర్ నేతల నుంచే వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, పార్టీపై పట్టు పెంచుకున్న హరీశ్రావును దూరం పెట్టిన కేసీఆర్పై మంత్రులూ, ఎమ్మల్యేలూ ఒకింత గుర్రుగా, మరింత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవేమనని రాజకీయ విశ్లేషకుల అభిభాషణ. కాకపోతే బయటకు చెప్పే ధైర్యం లేకనే గుంభనంగా ఉంటున్న పరిస్థితి. మంత్రిపదవి ఇవ్వకపోవడంతో హరీశ్రావు అనుచరులు పార్టీ అధినేత పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమైతే, రోజు రోజుకూ హరీశ్కు ఇటు పార్టీలో, అటు ప్రజల్లో సానుభూతి పెరుగుతున్న సంగతి అధినేతకు మింగుడుపడని స్థితి. నాలుగు లోక్సభ స్థానాలు కోల్పోయిన టీఆర్ఎస్ నేతలకు బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరో రెండేండ్లల్లో టీఆర్ఎస్లో చిచ్చు వస్తుందనీ, కేసీఆర్ అక్రమ ఆస్తులూ పరిపాలనా పరమైన అవకతవకలపైనా కేంద్రం నిఘా పెట్టిందనీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించడం చర్చనీయాంశమవుతున్నది.