Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ ఆదాయంలో కార్మికుల వాటా గణనీయంగా తగ్గిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇటీవల విడుదలచేసిన ఒక నివేదికలో పేర్కొంది. పెట్టుబడికి, ఉన్నత ఆదాయాలు గలవారికి సంపద ఒక పద్ధతి ప్రకారం పునఃపంపిణీ అవుతోందన్న వాస్తవం ఆ నివేదికలో పొందు పరచబడింది. అంతర్జాతీయంగా జాతీయ ఆదాయంలో 2004లో 53.7శాతంగా వున్న కార్మికుల వాటా 2017 సంవత్సరంకల్లా 48.6శాతానికి పడిపోయింది. అయితే మొత్తంమీద కార్మికుల నుంచి పెట్టుబడికి సంపద పునఃపంపిణీ జరగడటమనేది ఈ దృశ్యంలో ఒక పార్శ్వం మాత్రమే. సామాజిక అసమానతలు పెరుగు తున్న తీరును గుర్తించటం ఈ నివేదికలోని అత్యంత ముఖ్యమైన విషయం. సంపద మధ్యస్థ ఆదాయం గల కార్మికుల నుంచి అత్యంత సంపన్నులకు ప్రవహింప జేయబడుతోంది. ఇలా మధ్యస్థ ఆదాయం గలవారు మొత్తం కార్మికులలో 60శాతం దాకా ఉంటారు. 2004లో మొత్తం వేతనాలలో 44.8శాతంగా వున్న వీరి వాటా 2017 సంవత్సరంకల్లా 43శాతానికి పడిపోయింది. సాపేక్షంగా చూసినప్పుడు మొత్తం ఆదాయంలో ఉన్నత స్థాయి కార్మికుల వాటా పెరిగితే మధ్య, కింది స్థాయిల లోని కార్మికుల వాటా తగ్గిందని ఈ నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఈ ధోరణి ప్రబలంగా ఉంది. 2004-2017 మధ్యకాలంలో జరిగిన ఆదాయ పంపిణీ కారణంగా పై తరగతులకు పెద్దఎత్తున లాభం చేకూరగా, మధ్య, కింది తరగతులు గణనీయంగా నష్టపోయాయి. ఈ ధోరణి అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాలలో కనపడుతుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచాన్ని మొత్తంగా చూసినప్పుడు మొత్తం వేతనాలలో పై 10శాతానికి 48.9శాతం అందుతుండగా, ఆ తరువాతి 10శాతానికి 20.1శాతం అందుతున్నాయి. మిగిలిన 80శాతం కార్మికులకు అందుతున్న ఆదాయం 31.0శాతం మాత్రమే. అట్టడుగునవున్న 20శాతం మందికి మొత్తం వేతన ఆదాయంలో కేవలం 1శాతం మాత్రమే అందుతుందని ఈ నివేదిక వెల్లడించింది. అంటే ప్రపంచంలో మెజారిటీ కార్మికులు చాలా తక్కువ స్థాయి వేతనాలతో జీవితాలను గడుపుతున్నారని అర్థం. చాలామందికి ఉద్యోగంవున్నా అది బతకటానికి సరిపడా ఆదాయాన్ని ఇచ్చేదిగా ఉండదు. కార్మికులలో సగంమంది సగటు వేతనం నెలకు 198డాలర్లు (13-14000రూపాయల మధ్య) మాత్రమే.
అనేక కారకాలవల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో కార్ల్ మార్క్స్ చెప్పిన 'ఒక ధృవంవద్ద సంపద పోగుపడు తుంటే మరొక ధృవంవద్ద దారిద్య్రం, నిరాశా నిస్పృహలు పోగుపడతాయి' అనే విషయాన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డాటా ధృవీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ద్రవ్య పెట్టుబడిదారీ సంస్థలు అమలు చేసిన నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలవల్ల ఈ తర్కం మరింతగా వాస్తవ రూపం ధరించింది. షేర్ల ధరలు పెరగటానికి, ఫైనాన్షియల్ ఆస్తుల విలువ పెరగటానికి ద్రవ్య వ్యవస్థలోకి లక్షల కోట్ల డాలర్లను ప్రవహింపజేసినందున సంపద పై వర్గాలకు చేరింది. ద్రవ్య వ్యవస్థలోని సట్టా (స్పెక్యులేటివ్) కార్యకలాపా లలో పై 10శాతం పాల్గొన్న పర్యవసానంగానే వారి వేతనాలు అనూహ్యంగా పెరిగాయి. అదే కాలంలో సంపన్నులకు సానుకూలం గావున్న ఈ ఆదాయ పునఃపంపిణీని బలోపేతం చేయటానికి వారిపై వేసే పన్నులను ప్రభుత్వాలు తగ్గిస్తూ వస్తున్నాయి.
అయితే ఈ ప్రక్రియ సజావుగా సాగటానికి కార్మికుల వ్యతిరేకతను అణచివేయటంలో బూర్జువా ఉదారవాద రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు సహకరించాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నివేదికలో పేర్కొన్నట్టు ప్రపంచ వ్యాప్తంగా నిజ వేతనాలు కోతకు గురవుతుంటే కార్మికుల వ్యతిరేకతను అణచటంలో సంస్కరణవాద కార్మిక సంఘాలు కూడా తమ పాత్రను పోషించాయి. గత మూడు దశాబ్దాల ఉత్పత్తి, పెట్టుబడుల ప్రపంచీకరణలో నిజ వేతనాలలో కోతలను సహించటం, కార్మికులను మరింత దోపిడీకి గురయ్యేవిధంగా పని పరిస్థితులను మార్చటంవంటి చర్యలతో ఈ కార్మిక సంఘాలు 'తమ' పెట్టుబడిదారీ వర్గం 'అంతర్జాతీయ పోటీ'లో నిలదొక్కు కునేందుకు చేయగలి గిందంతా చేశాయి. పర్యవసానంగా పెట్టుబడి ఆదేశాలను అమలుచేసే ఏజన్సీలుగా ఈ సంస్కరణవాద కార్మిక సంఘాలు మారాయి.
అయితే ఒక నూతన కారకం రంగంలోకి ప్రవేశించింది. నయా ఉదారవాద శకంలో కొనసాగుతున్న పాలకవర్గాల క్రూర దోపిడీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున లేచిన అమెరికాలో ఉపాధ్యాయుల సమ్మెలు, ఫ్రాన్స్లో 'యెల్లో వెస్ట్' ఉద్యమం, మెక్సికోలో మెరుపు సమ్మెలు, వేతన ఘనీభవనకు వ్యతిరేకంగా అనేక ఐరోపా దేశాలలో సమ్మెలు, ఉత్తర ఆఫ్రికాలో ప్రజా నిరసనలు వర్గపోరాటాన్ని తీవ్రతరం చేశాయి. ప్రారంభ దశలోవున్న ఈ ఉద్యమాలు తమతమ స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఒక శాస్త్రీయ అవగాహనను ఏర్పరచుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు దోపిడీ, అసమానతలతోపాటు అన్ని రకాల సామాజిక సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి సంక్షుభిత పెట్టుబడిదారీ వ్యవస్థను సశాస్త్రీయంగా అవగాహన చేసుకుని దాని ప్రాతిపదికగా ఈ ఉద్యమాలు తమ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అప్పుడే నిజ వేతనాలపై పాలక వర్గం చేస్తున్న దాడులను ప్రతిఘటించే వీలు కలుగుతుంది.