Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్నలను భరించలేని, ప్రశ్నలను సహించలేని పాలనలో ఉన్నాం మనమిప్పుడు. ప్రభుత్వం ఏం చేసినా, తమ పార్టీ కార్యకర్తలు ఏం చేసినా ఈ దేశంలో ఎవ్వరూ ప్రశ్నించరాదన్న అలిఖిత శాసనం చేసి కూర్చున్నారు కేంద్ర పాలకులు. ఇందుకు తాజా సాక్ష్యం హక్కుల కార్యకర్త, సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరాజైసింగ్ ఇంటిపై, ఆమె భర్త కార్యాలయాలపై సీబీఐ దాడులు. ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్ దేశంలోనే ప్రసిద్ధి చెందిన హక్కుల కార్యకర్తలు. పలు ప్రజాహిత వ్యాజ్యాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించడం వల్లనే వారిపై దాడులకు తెగబడ్డారన్నది వాస్తవం. వీరిద్దరూ విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించా రన్న ఆరోపణలపై సీబీఐ ఈ దాడులను నిర్వహించింది.
2009 నుంచి 2014 మధ్య కాలంలో విదేశీ పర్యటనలకు హౌం మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా వెళ్లారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. అప్పట్లో జైసింగ్ అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థల నిధులతో జైసింగ్, ఆమె భర్త విదేశీపర్యటనప్పటి ఆధారాలు ఏవైనా దొరుకుతాయేమోనని సీబీఐ వారి నివాసంలోను, కార్యాలయంలోనూ దాడులు చేసింది. అయితే తానేమీ చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదని, అదనపు సొలిసిటర్ జనరల్ పదవి ప్రభుత్వోద్యోగం కిందికి రాదని, ఆ పదవిలో ఉన్నవారు విదేశీ నిధులు తీసుకోకూడదన్న నిబంధన ఏదీ లేదన్నది ఆమె వాదన. ఇక, ఆనంద్ గ్రోవర్ నిర్వహిస్తున్న స్వచ్ఛంధ సంస్థ విదేశీ విరాళాలను దుర్వినియోగపరుస్తున్నట్టు 2010లోనే కేంద్ర హౌంశాఖ దృష్టికి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. మరి, 2010లో తమ దృష్టికి వస్తే ఇన్నాళ్ళూ ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. ఇప్పుడే ఎందుకు దాడులు చేశారన్న దానికీ సమాధానం లేదు. మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తీస్తా సెతల్వాద్ నివాసం, కార్యాలయంపై ఇదేవిధంగా సీబీఐ దాడులు చేసింది. ఆమె కూడా హక్కులకోసం పోరాడుతున్న న్యాయవాది. ఎన్నో కేసుల్లో బాధితుల తరపున ఆమె వాదించారు. వారికి న్యాయం జరిగేందుకు తోడ్పడ్డారు. ముఖ్యంగా, గుజరాత్ అల్లర్లలో 14మంది సజీవ దహనమైన బెస్ట్ బేకరీ కేసులో బాధితుల తరఫున ఎంతో కష్టపడి ఆధారాలు సేకరించి వాదించారు. దీంతో ఆమెమీద కక్షబూని విదేశీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించి కోర్టు చుట్టూ తిప్పారు. ఇందిరా జైసింగ్ కూడా ఇటీవల వాదించిన కేసుల్లో లింగ వివక్షకు సంబంధించిన కేసు ప్రధానమైనది. అలాగే ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొరుపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో జైసింగ్ బాధితురాలి తరపున వాదించారు.
సమాజంలోని అణగారిన వర్గాలు, బాధితుల తరఫున ప్రశ్నిస్తున్న, పోరాడుతున్న మహిళలను వేధించడం, హతమార్చడం ఇటీవలి కాలంలో అధికమైపోయింది. గౌరీలంకేశ్, ఇందిరాజైసింగ్, తీస్తా సెతల్వాద్లే ఇందుకు ఉదాహరణలు. హంతకులను, అల్లరి మూకలనూ ప్రోత్సహించి, అండదండలు అందించి ప్రజలకోసం ప్రశ్నిస్తున్న వారిని వెంటాడడం, వేధించడం, హతమార్చడంతోనే సరిపెట్టుకోకుండా సీబీఐ లాంటి సంస్థలను ప్రయోగించడం ఇటీవలి కాలంలోనే మనం చూస్తున్నాం. ప్రజలకోసం తమ గొంతు వినిపించే వారిని మానసికంగా దెబ్బతీయడం, అలాగే మరొకరు అందుకు సాహసించకుండా భయానక వాతావరణం సృష్టించడం ఈ దాడులు, హత్యల లక్ష్యం. ఇందుకు ప్రభుత్వరంగ శాఖలు సహకరించడం దారుణం.
గురువారం ఉదయం దాడులు మొదలైనప్పటినుంచీ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఎచూరి ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల వెనుక పాలకుల దురుద్దేశం కచ్చితంగా ఉన్నదని స్పష్టం చేశారు. దాడుల విషయం తెలిసిన వెంటనే వివిధ రంగాలకు చెందిన 150మంది ప్రముఖులు దాడులను ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇందిరా జైసింగ్ నివాసంపై దాడిని సుమోటోగా పరిగణించి జాతీయ మానవహక్కుల కమిషన్ విచారణ చేయాలని పలువురు న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలూ డిమాండ్ చేశారు. హక్కుల కార్యకర్తలపై దాడులు, హత్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నా పాలకులలో మాత్రం చలనం లేదు. గౌరీ లంకేశ్ను దారుణంగా హత్యచేసిన హంతకులకు ఇంతవరకూ శిక్షపడలేదు.
హక్కుల కార్యకర్తలను వేధించేందుకు పాలకులు విదేశీ విరాళాలను ఒక సాకుగా వాడుకుంటున్నారు. హక్కులకోసం పనిచేసేవారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాశ్రేయోభిలాషులు ఆర్థిక అండదండలు అందించడం సహజం. ఈ విషయంలో బీజేపీ తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం అందిన తరువాత మరోలా ప్రవర్తిస్తోంది. యూపీఏ హయాంలో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలపై దర్యాప్తు కోసం రోజుల తరబడి పార్లమెంటును స్తంభింపచేసిన బీజేపీ, ఇప్పుడు వేల కోట్ల పన్నులు ఎగవేసిన తమవారిని మాత్రం సురక్షితంగా విదేశాలకు సాగనంపుతూ, కార్యక్రమాల ఖర్చులకోసం సహాయం అందుకుంటున్న, పేద బాధితులకోసం కృషిచేస్తున్నవారిని మాత్రం రాచిరంపాన పెడుతున్నారు. నిబ్బరంగా నిలబడటం, సమైక్యంగా ఎదుర్కోవడమే ఇప్పటి కర్తవ్యం.