Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేదవాడి విమాన ప్రయాణంగా భావించే రైల్వేలు ప్రయివేటుపరం కాబోతున్నాయి. రైల్వే నిర్వహణను పూర్తిగా ప్రయివేటుకు అప్పగించేందుకు కేంద్రం దారులు వేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చాలా స్పష్టంగా చెప్పారు. రాబోవు పదేండ్లలో రైల్వేల కోసం దాదాపు రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయనీ, ఇందుకు పబ్లిక్ ప్రయివేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో వీటిని సేకరిస్తామని మంత్రి చెప్పడమే నిదర్శనం. సంబంధిత శాఖామంత్రి పీయూష్ గోయల్ కూడా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇతర ప్రాజెక్టులు, తదితర అంశాల్లో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు ప్రయివేటురంగం సేవలు తీసుకోవాల్సిన అవసరసం ఏర్పడిందని లోక్సభలో తమ ప్రభుత్వ విధానాన్ని తెలియజేశారు. అంటే, రైలు మార్గాల విస్తరణ, ఆధునికీకరణ కార్యకలాపాల్లో ప్రయివేటుకు హద్దుల్లేని అవకాశాన్ని కల్పిస్తారన్న మాట. ఇప్పటికే దక్షిణమధ్య రైల్వేలో అతి ముఖ్యమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించింది. ప్లాట్ఫాం టికెట్ల విక్రయం, పారిశుధ్య నిర్వహణ, సరుకుల రవాణా ప్రయివేటు సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయి. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే రెండు ముఖ్యమైన రైళ్లనూ కేంద్రం ప్రయివేటుకు అప్పగించింది. ఖర్చులు తగ్గించుకునే పేరుతో నిర్వహణ భారం నుంచి తప్పుకోవడం ప్రయివేటుకు అప్పగించినట్టు కాదని మంత్రి చెప్పుకోవడం విడ్డూరం. ప్రభుత్వం కాకుండా ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే చార్జీలూ అదే స్థాయిలో పెరుగుతాయి. భవిష్యత్లో సామాన్యుడు రైలులో ప్రయాణించడం కష్టంతో కూడుకున్నదే అవుతుంది.
రైల్వేలలో ప్రయివేటును ప్రోత్సహించాలన్న ఆలోచన కేంద్రం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. మోడీ అధికారంలోకి వచ్చినపుడే రైల్వేలో సంస్కరణల అమలుకోసం నియమించిన వివేక్ దేవ్రారు కమిటీ 2015లోనే కేంద్రానికి సిఫారసులు చేసింది. అత్యాధునికమైన బోగీలతో, స్టార్ హౌటళ్ల స్థాయి సౌకర్యాలతో గంటకు 200 కిలోమీటర్లకు మించిన వేగంతో ప్రయాణికులకు వినూత్న అనుభవాన్ని కలుగజేసే ప్రయివేటు రైళ్లను అనుమతించాలన్న కమిటీ సిఫారసును బడ్జెట్లో అమలు చేసింది. కాంగ్రెస్పార్టీ హయాంలోనూ రైల్వేల ప్రయివేటీకరణ అంశం ముందుకొచ్చినా కార్మికసంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గింది. రెండోసారి పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ అన్ని రంగాలలో ప్రయివేటీకరణను వేగవంతం చేయడం తెలిసిందే. ప్రభుత్వరంగంలోని రైళ్లను ఆధునీకరించకుండా వాటిని పూర్తిగా ప్రయివేటువారి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం అందులో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తును అంధకారం చేయడం ఎంతవరకు సమంజసం? చార్జీలను నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా ప్రయివేటు యాజమాన్యాలకు ఇస్తే పేదవాడు ఏ వాహనాన్ని ఆశ్రయించాలి. బొగ్గు, ఎరువులు, ఇనుపఖనిజం, సిమెంట్ వంటివి రైల్వేద్వారానే రవాణా అవుతున్నాయి. లాభాల కోసం పరుగులు తీసే ప్రయివేటురంగం చేతుల్లో రైల్వేరంగం ఉంటే వాటి ధరలు మరింత పెరుగుతాయి. ఆ భారం పడేది సామాన్య ప్రజలపైనే! ప్రయివేటుకు చోటు పెరిగిన కొద్దీ పేదలు ప్రయాణం చేసే రైళ్లు నడపడం లాభసాటి కాదన్న అభిప్రాయం మరింత ముందుకు వచ్చే ప్రమాదం ఉంది. అలా అయితే ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తున్న చందంగానే భవిష్యత్తులో పబ్లిక్ రైళ్లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని ద్వారా ఏ ఆశయంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వేశాఖను అభివృద్ధి చేశారో అది పూర్తిగా దెబ్బ తింటుంది. 5ట్రిలియన్ (రూ.350 లక్షల కోట్లు) డాలర్ల సంపద గల దేశంగా భారత్ను అవతరింప చేస్తామని లక్ష్యం పెట్టుకున్నప్పుడు..దాని ఫలితం సాధారణ ప్రజలందరి జీవితాల్లో ప్రతిఫలించేలా చూడాలి తప్ప కొంతమందికే పరిమితం చేస్తామంటే ఎలా?
భారతీయ రైల్వేలకు ఘనచరిత్ర ఉన్నది. 1853లో తమ అవసరాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం రైల్వేవ్యవస్థను ప్రారంభించింది. యూరప్లో రైళ్లులేని సమయంలో ఇక్కడ ఉండటం గర్వకారణం. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఇండియన్ రైల్వే కోట్లాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. అత్యంత చౌకైన, సౌకర్యవంతమైన రైల్వేవ్యవస్థను నడపలేక నష్టాలు సాకుచూపి ప్రయివేటుకు అప్పగించే మోడీ ప్రభుత్వ ఆలోచన దుర్మార్గం. చైనాలో రైల్వే వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నది. ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా చర్యలు తీసుకుంటుంది తప్ప ప్రయివేటుకు ఇవ్వాలన్న ఆలోచన లేదు. 30ఏండ్లక్రితం మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్లో రైల్వేలను ప్రయివేటీకరించారు. దానికి వ్యతిరేకంగా ఆ దేశంలో నిరసనలు జరుగుతున్నాయి. రైల్వేల అభివృద్ధికి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి తప్ప.. వైఫల్యాలకు సర్వరోగి నివారిణిగా ప్రయివేటికరించడం సరికాదన్నది మోడీ ప్రభుత్వం గుర్తించాలి.