Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. తద్వారా ఖరీఫ్ సాగు చతికిలపడింది. సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు కావస్తున్నా, ఇప్పటికీ పంటల సాగు విస్తీర్ణం పెరగలేదు. వర్షాభావంతో వేసిన విత్తనాలు భూముల్లోనే మాడిపోయాయి. మొలకెత్తిన జాడేలేదు. ప్రత్యామ్నాయ పంటలవైపు అడుగులేయాల్సిన సమయంలో ఇటు వ్యవసాయ శాఖ, అటు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. రాష్ట్రంలో 1.83 కోట్ల ఎకరాల విస్తీర్ణానికిగాను, ఇప్పటికీ 42.75 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలేశారు. అంటే దాదాపు 65 లక్షల ఎకరాల్లో విత్తుపడకపోవడం దురదృష్టం. ఇందులో 24.11 లక్షల ఎకరాల్లో వరిసాగు కావాల్సి ఉండగా, 1.46 లక్షల ఎకరాలకే పరిమితం కావడం ఆందోళనకు గురిచేసేదే. దీనికి కారణం కరువు. రాష్ట్రంలో కరువు, కాటకాలు ప్రస్తుతం విలయతాండవం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూలేనివిధంగా జూన్, జులై నెలల్లో వర్షాలు పూర్తిస్థాయిలో మొఖం చాటేశాయి. నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటమే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులకు కారణమని వ్యవసాయ ప్రణాళిక ప్రకటించింది. జూన్ ఒకటి నుంచి ఈనెల 12వరకు కురవాల్సిన వర్షపాతం 213.1 మిల్లీమీటర్లు కాగా, 146 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. 31 శాతం లోటు. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొందని అధికారిక సమాచారం. మరో 23 మండలాల్లో అతి తక్కువగా వానలు పడ్డాయి. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని 230 మండలాల్లో శాశ్వత కరువు నెలకొందని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) కేంద్రానికి నివేధించింది. కరువుతో రాష్ట్రమంతా అల్లాడుతుంటే, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. కరువు పరిస్థితులపై సీఎం చంద్రశేఖర్రావు సమీక్షే చేయలేదు. పాసుపుస్తకాల కోసం దాదాపు తొమ్మిది లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. 18 లక్షల మందికి రెండో విఢత రైతుబంధు రానేలేదు. రుణమాఫీ నిధుల జాడేలేదు. పేద రైతులను, వ్యవసాయకూలీలను, ఆయా తరగతులను ఆదుకోవాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వానికేమీ పట్టడం లేదు. అప్రధాన పథకాలు. పనులకు భారీగా నిధులు ఇస్తున్నది. యుద్ధప్రాతిపదికన ఆదేశాలిస్తూ నమ్మి రెండోసారీ ఓటేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువత, మహిళలు, యువజన, విద్యార్థులను మోసం చేస్తున్నది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి కరువుఛాయలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో ఒక్కసారి మాత్రమే కరువు గురించి పట్టించుకున్న ఈ ప్రభుత్వం, ఆ తర్వాత మరిచిపోయింది. సాధారణంగా ప్రతియేటా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సైతం రాబట్టలేకపోయింది. కరువు నివేదికలను పంపడంలోనూ విఫలమైంది. తద్వారా రాష్ట్ర ప్రజల యోగక్షేమాలు తనకక్కర్లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పినట్టయింది. మరోవైపు వర్షాకాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పెట్టి ప్రజాసమస్యలు చర్చించడం తప్పనిసరి. కానీ, దాని గురించి కాకుండా ఏవో కొంపలు మునిగిపోతున్నట్టు ఆఘమేఘాల మీద మున్సిపల్ చట్టం ఆమోదం కోసం మాత్రమే రెండు రోజులు అసెంబ్లీ, మండలి పెట్టి చేతులుదులుపుకునే కార్యక్రమానికి ఒడిగట్టింది. నిజానికి ప్రజలు కోరుకోని కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాల కోసం గులాబీ సర్కారు వందల కోట్ల నిధులను ఫలహారంలా ఖర్చుపెట్టేందుకు సమాయత్తమవుతున్నది. కాగా, కరువు పరిస్థితులను అంచనా వేసి ఇటు రైతులను, అటు వ్యవసాయ కార్మికులు, ఇతరుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన ప్రభుత్వం, కనీసం ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం.. గర్హనీయం. ప్రకృతి వైఫరీత్యాల భారినుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ సంగతి కేసీఆర్ సర్కారుకు తెలియనిదా? మరెందుకింత నిర్లక్ష్యం..అలక్ష్యం. సాధారణ పరిస్థితుల్లోనే ప్రతి సంవత్సరం 600మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న భౌతిక కఠిన వాస్తవాన్ని ఎలా విస్మరిస్తారు? ఇది సర్కారు కండ్ల ముందున్న నగసత్యం కాదా? ఈ కరువు నేపథ్యంలో ఆత్మహత్యల తీవ్రత ఏ మేరకు ఉంటుందోననే ఆందోళన అందరిలోనూ కనిపిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్య లను ఎజెండా చేసి అసెంబ్లీలో చర్చించడానికి బదులు, అప్రధాన పనులకు ప్రాధాన్యమిస్తున్నది. గడీల్లాంటి భవనాల కోసం హడావుడి చేస్తున్న గులాబీ సర్కారు... కరువు, రైతులు, యువజన, విద్యార్థి, మహిళల సమస్యలను చర్చించేందుకు ససేమిరా అంటున్నది. ఈనేపథ్యంలో ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు మేల్కొనాల్సిన తరుణం ఆసన్నమైంది. పేదల సమస్యలను పరిష్కరించడం కోసం అసెంబ్లీని పెట్టకుండా, భవనాల కోసం, చట్టం అమోదం కోసం చేస్తున్న ఆరాటం అంతా ఇంతా కాదు. పాలనలో ప్రతిపక్షాలను భాగస్వాముల్నీ చేయకుండా, వాటి ఉనికినే దెబ్బతీస్తూ రాజకీయాలను కలుషితం చేయడం ఎంతమాత్రం సహించరానిది.. క్షమించరానిది. ప్రభుత్వాలున్నది ప్రజలకోసమే తప్ప, రాజకీయాల కోసం కాదన్నది టీఆర్ఎస్ గుర్తించాలి. రాజకీయం రాజ్యంలోని ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేయాలి తప్ప, స్వార్థ ప్రయోజనాల కోసం కాదని గులాబీ అధినేత గుర్తెరగాలి.