Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నలుగురు డెమొక్రటిక్ కాంగ్రెస్ మహిళా ప్రతినిధులపై ఆదివారంనాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత పాశవికంగా దాడిచేశాడు. రషీదా త్లైబ్, అలెగ్జాండ్రియా అకాషియో కోర్టెజ్, ఇల్హాన్ ఒమర్, అయన్నా ప్రెస్లే 'ఇజ్రాయిల్, అమెరికాలకు వ్యతిరేకులు, టెర్రరిస్టులకు అనుకూలురు'. వీళ్లంతా 'కమ్యూనిస్టులు'. 'మా దేశాన్ని మీరు ద్వేషిస్తుంటే లేక మీకు ఇక్కడ సంతోషంగా లేకుంటే మీరు ఈ దేశం నుంచి వెళ్లిపోవచ్చు!'. ఇదీ ట్రంప్ చేసిన దాడి తీరు. ఈ నలుగురు మహిళలూ అమెరికా పౌరులు. 'నేరమయమైన దేశాలనుంచి వలస వచ్చిన వీళ్లు తమ దేశాలకు వెళ్ళిపోవాలి'. 'మేమెన్నడూ సోషలిస్టు లేక కమ్యూనిస్టు దేశం కాము' అని ట్రంప్ నిస్సిగ్గుగా ప్రకటించాడు.
విధానపరమైన, చట్టపరమైన, రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే ట్రంప్ ఇటువంటి వివాదాస్పదమైన ప్రకటనలు చేస్తున్నాడని న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకీయంలో రాసింది. ఇదే విషయాన్ని దాడికి గురయిన నలుగురు మహిళలు కూడా సోమవారంనాడు నిర్వహించిన తమ పత్రికా సమావేశంలో చెప్పారు. అయితే సోమవారంనాడు ట్రంప్ నిర్వహించిన పత్రికా సమావేశంలో ఫోటోగ్రాఫర్లు ఆయన రాసుకున్న నోట్స్ను ఫొటో తియ్యగలిగారు. ఆ నోట్స్లో 'వీళ్లు అమెరికాని ద్వేషిస్తున్నారు', 'వీళ్లు అమెరికాని సోషలిస్టు దేశంగా మార్చాలనుకుంటున్నారు' అనే వాక్యాలున్నాయి. ముందుగా తయారుచేసుకున్న నోట్స్ ఆధారంగానే ఈ నలుగురు మహిళలకు 'అల్ ఖైదా అంటే ప్రేమ' అని, వీళ్లు 'యూదులను ద్వేషిస్తారని' ట్రంప్ ప్రకటించాడు.
తన ట్వీట్స్తో 'శ్వేత జాతి దురహంకారులు' సంబరాలు చేసుకోవటం పట్ల మీరు ఆందోళన చెందుతున్నారా? అని ఒక విలేకరి అడిగినప్పుడు 'నేను దాన్ని పట్టించుకోను. నాతో ఏకీభవించేవాళ్లు చాలామంది ఉన్నారు' అని ట్రంప్ అన్నాడు. అమెరికాకు వలస వచ్చినవారిపై జులుం సాగించే వ్యూహాన్ని రూపొందించిన స్టీఫెన్ మిల్లర్ వంటి ఫాసిస్టు మేధావులు అల్లిన రాజకీయ వ్యూహాన్నే ట్రంప్ అనుసరిస్తున్నాడు. ఆ నలుగురు కాంగ్రెస్ ప్రతినిధులపై చేస్తున్న దాడి చాలా నిలకడగా ఉంది. అలాగే ఫాసిస్టు, మితవాద ఉద్యమాలలో సమిష్టిగా ఉండే ఇతివృత్తాల పునఃచ్చరణ పదేపదే జరుగుతోంది. తన పాలనను విమర్శిస్తున్న వాళ్ళను టెర్రరిజానికి మద్దతుదారులని ట్రంప్ విమర్శిస్తున్నాడు. వాక్ స్వాతంత్య్రాన్ని, విమర్శనా చింతనను అపరాధీకరించటం జరుగుతోంది. తన ప్రత్యర్థులు అత్యంత ప్రమాదకారులనీ, వీళ్లు దేశాన్ని ద్వేషిస్తున్నారనీ, తన ప్రభుత్వ విధానాలను విమర్శించటం దేశ ద్రోహంతో సమానమని ట్రంప్ అనునిత్యం ప్రకటనలను విడుదల చేస్తున్నాడు. సామ్యవాదం విదేశీ భావజాలమనీ, అవి అమెరికా ప్రజలకు వ్యతిరేకమని అమెరికా అధ్యక్షుడు ప్రచారం చేస్తున్నాడు. ఈ భావాలను కార్ల్ స్కిమిట్వంటి నాజీ సిద్ధాంత కర్తలు అభివృద్ధి చేశారు. నాజీల నియంతృత్వాన్ని సమర్థించేందుకు ఉద్దేశింపబడిన 'అసామాన్య రాజ్యం' అనే భావన అభివృద్ధి చేసింది ఈయనే. అమెరికాలో 'సంతోషంగా లేకపోతే', అమెరికాను 'సోషలిస్టు దేశంగా చూడాలనుకుంటే' మీరు దేశాన్ని వీడండి అనే హెచ్చరిక వెనుక స్వచ్ఛందంగా అలా చేయకపోతే బలవంతంగానైనా వీళ్లను నిర్బంధించటం సమంజసమే అనే అంతఃస్సూచన ఉంది. ట్రంప్ ప్రకటనల వ్యూహాత్మక స్వభావం అవి విడుదల చేసిన సందర్భంలో ఉంది. వలసవచ్చిన ప్రజలను పిల్లలతోసహా అత్యంత అపరిశుభ్ర శిబిరాలలో నిర్బంధించటానికి వ్యతిరేకంగా చేసిన విమర్శను 'వామపక్ష తీవ్రవాదం' అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. పది లక్షిత నగరాలలో గణనీయమైన సంఖ్యలోగల లక్షలాది వలస కార్మికులు దాడులకు భయపడుతూ బతుకుతున్నారు.
2020లో అమెరికాలో జరగనున్న జనగణనలో 'మీరు పౌరులా?' అనే ప్రశ్న తొలగించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని పట్టించుకోనని గత వారం ట్రంప్ బెదిరించాడు. అలాగే సోమవారంనాడు మధ్య అమెరికా వాసులకు అమెరికాలో ఆశ్రయం పొందే అర్హత లేదని ఫెడరల్ ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం. ఇవి కాకుండా అంతకుముందే అమెరికా-మెక్సికో సరిహద్దులో వేలాది సాయుధ సైనికులను మోహరించటం జరిగింది. అంతేకాకుండా రక్షణ నిధులను ఉపయోగించి అమెరికా-మెక్సికో సరిహద్దుపై మెక్సికో, ఇతర దేశాల ప్రజలు అమెరికాలో ప్రవేశించకుండా ఒక గోడ కట్టాలనే ఉద్దేశంతో అమెరికా పార్లమెంటయిన కాంగ్రెస్ అడ్డం రాకుండా ట్రంప్ అత్యయిక స్థితి ప్రకటించాడు.
ట్రంప్, ఆయన సలహాదారులు అమెరికాలోని ఫాసిస్టు శక్తులను కలుపుకుని ఒక రాజ్యాంగేతర ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీలోని ఒక విభాగం ట్రంప్ చర్యలతో ఏకీభవిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం నిరంతరం సంక్షోభంలో కూరుకు పోయి ఉంటుంది. అమెరికాలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, కార్మికుల పోరాటాలను చూసి ట్రంప్ ప్రభుత్వం భయపడుతోంది. అమెరికా అధ్యక్షుడి ఫాసిస్టు ప్రేలాపనలు ఆయన మనసులో పుట్టినవి కావు. అవి అమెరికా సామ్రాజ్యవాద వ్యవస్థను నడిపే పెట్టుబడిదారీ వర్గ ఆలోచనలు. కాబట్టి ఫాసిజంపై పోరాటం చేయాలంటే దాని మూలాలున్న పెట్టుబడిదారీ వ్యవస్థపై పోరాడవలసి ఉంటుంది.