Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారిబియన్ సముద్రంలో ఈశాన్య భాగాన గల ఒక దీవుల సమూహమే పోర్టోరికో. స్పానిష్ వలసగా ఉన్న పోర్టోరికో 1898లో జరిగిన స్పానిష్-అమెరికన్ యుద్ధం తరువాత అమెరికా ఆధీనంలోకి వచ్చింది. 1917 నుంచి పోర్టోరికో ప్రజలు అమెరికా పౌరులయ్యారు. అలా పోర్టోరికో అమెరికా పాలనలో ఉన్నప్పటికీ అమెరికా రాజ్యాంగం ప్రకారం అది అమెరికా భూభాగం కాదు. అందుకే దీన్ని ఆంగ్లంలో 'అన్ ఇన్కార్పొరేటెడ్' అమెరికా భూభాగం అని పిలుస్తున్నారు.
ఆకస్మికంగా ఈ భూభాగంలో నివసించే ప్రజలు ప్రపంచ వార్తల్లోకి ఎక్కారు. సోమవారంనాడు దాదాపు 10లక్షలమంది పోర్టోరికో ప్రజలు తమ రాజధాని శాన్ జుయాన్ వీధుల్లోకి వచ్చారు. పోర్టోరికోలో నివసిస్తున్న 32లక్షల జనాభాలో 30శాతానికి పైగా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ స్థాయి నిరసన ప్రదర్శన అమెరికా పాలక వర్గాలలో భయాందోళనలను రేకెత్తిస్తోంది. రెండు వారాల క్రితం పోర్టోరికన్ సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే సంస్థ గవర్నర్కు, ఆయన సలహాదారులకు మధ్య కొనసాగిన మెస్సేజ్ల పరంపరను 900పేజీల పుస్తకంగా ప్రచురించింది. కార్మికులపట్ల, యువతపట్ల పాలకవర్గం ఎంత నీచమైన ఆలోచనలను కలిగివున్నదో ఈ మెస్సేజ్లు సజీవ సాక్ష్యం. మీడియా యాజమాన్యాలను ధిక్కరించి జర్నలిస్టులు ఈ మెస్సేజ్లను ప్రచురించిన ఘటనకు విప్లవకర అంతఃస్సూచనలున్నాయి.
గవర్నర్ రికార్డో రోస్సెల్లో, ఆయన సలహాదారుల మధ్య పరస్పరం పంపుకున్న మెస్సేజ్లలో నిరసన తెలుపుతున్న విద్యార్థుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారి నిరసన ప్రదర్శనలపై ఉక్కుపాదం మోపాలని వ్యూహరచన చేశారు. కార్పొరేట్ మీడియానుపయోగించి స్వతంత్ర జర్నలిస్టుల గొంతు నొక్కే మార్గాల గురించి చర్చించారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటానికి రహస్యంగా ఫేక్ వీడియోలను తయారు చేసి, పంపిణీ చేయాలని నిర్ణయించారు. పోలీసు వ్యవస్థలో తేదలచిన సంస్కరణలను ఆపాలని అనుకున్నారు. పేద ప్రజలపట్ల అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2017లో హర్రికేన్ మరియా ఉప్పెన పోర్టోరికోని సర్వనాశనం చేసిన తరువాత అమెరికా ప్రభుత్వం అనేకమంది కార్మికులు చనిపోయివుంటారని భావించింది. దీనికి సంబంధించిన మెస్సేజ్ ప్రజలను తీవ్రంగా రెచ్చగొట్టేలా ఉంది: 'మనం ఈ విషయం గురించి మాట్లాడుతున్నాం. కాకులు తినటానికి మన దగ్గర శవాలు ఏమీలేవా?' అని గవర్నర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న సోబ్రినో వేగా అన్నాడు. ఈ వాక్యం లక్షలాది పోర్టోరికో ప్రజల హృదయాలను రగిల్చింది. అనేక దశాబ్దాలుగా అణచివేతకు గురైన పోర్టోరికో సమాజం యావత్తూ కోపాగ్నితో రగిలిపోయింది. వెంటనే గవర్నర్ రాజీనామా చేయాలనే డిమాండ్తో లక్షలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేయటం మొదలెట్టారు.
మెస్సేజస్ను ఒక పుస్తకంగా ప్రచురించిన తరువాత ప్రజల ప్రతిస్పందనలో గల కార్మికవర్గ స్వభావాన్ని మరుగుపర్చటం కోసం దానిని వర్ణ, అస్తిత్వ సమస్యలపై ప్రజల ప్రతిస్పందనగా చిత్రించటానికి డెమొక్రటిక్ పార్టీ, దాని అనుకూల మీడియా ప్రయత్నించాయి. నిజానికి పోర్టోరికో ప్రజల కోపాగ్నికి కారణం అమెరికా సామ్రాజ్యవాద వలస దోపిడీ పర్యవసానంగా సృష్టించిన దారుణమైన పేదరికం. పోర్టోరికోని కోలుకోలేనంతగా దెబ్బతీసిన, 5000మంది మరణానికి కారణమైన మరియా, ఇర్మా ఉప్పెనల తరువాత అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలు అక్కడి ప్రజలను గాలికి వదిలేశాయి. 10000 పాఠశాలలు, వంతెనలు, రోడ్లు, ఇతర ప్రజాసౌకర్యాలు ఈ ఉప్పెనల ప్రభావం వల్ల ధ్వంసమయ్యాయి. ఈ ఉప్పెనలు పోర్టోరికోని ముంచెత్తిన తరువాత చనిపోయినవారి సంఖ్యను ఫెడరల్, స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు తెలియనివ్వలేదు. తగిన సహాయం అందించే ప్రయత్నం కూడా చేెయలేదు. అంతేకాకుండా మితవ్యయ విధానాలను అమలుచేసి సంక్షేమ పథకాలకు, విద్యకు కేటాయించే నిధులలో భారీగా కోతపెట్టారు. పరిస్థితి ఇలావుంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు 'పోర్టోరికోకు మేము చేయగలిగినంత చేశాం' అని ట్రంప్ ప్రకటించాడు.
వరుసగా సంక్షోభాలను ఎదుర్కొంటున్న అమెరికా పాలకవర్గాలు ఎలాగైనా పోర్టోరికో నిరసనలను ఆపాలని చూస్తున్నాయి. పోర్టోరికో ప్రజలు ఎదుర్కొంటున్న అసమానతలు, దారిద్య్రం, నిరుద్యోగం వంటి సమస్యలను అమెరికా సమాజం కూడా ఎదుర్కొంటున్నది. పోర్టోరికోలో చెలరేగిన సమ్మెలు, నిరసనలు అమెరికా సమాజానికి కూడా చేరితే తాము ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత తీవ్రమవుతుందని అమెరికా పాలక వర్గాలు భయపడుతున్నాయి. అందుకే పోర్టోరికో ప్రజలు ట్రంప్ని తీవ్రంగా ద్వేషిస్తున్నారు. అయితే నిరసన ప్రదర్శనలను అణచివేస్తున్నందుకు ఆయన ప్రత్యర్థి పార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీ బాధ్యత వహించాల్సి వుంటుంది. ఎందుకంటే పోర్టోరికో గవర్నర్ రోస్సెల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందినవాడు.
పోర్టోరికోలో చెలరేగిన ప్రజాపోరాటం అంతర్జాతీయంగా తీవ్రమవుతున్న ప్రజా నిరసనల పరంపరలో భాగమే. నయా ఉదారవాద ప్రపంచీకరణ కారణంగా విస్తృతమైన అసమానతలకు, అవినీతికి, ప్రజాస్వామిక హక్కులపై దాడులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు అంతర్జాతీయ అంతఃస్సూచికలు ఉంటాయి. అంతిమంగా ఈ సమస్యలన్నింటినీ ఉద్భవింపజేసే పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటంపైనే వీటి పరిష్కారం ఉంటుందనే చైతన్యాన్ని పెంపొందించటమే నేటి కర్తవ్యం.