Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో వైవాహిక బంధమంత సున్నితమైనది మరొకటి లేదు. వైవాహిక బంధంపై తీర్పు ఇచ్చేటపుడు దాని పర్యవసానాలపై అనేక కోణాలలో ఆలోచించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తప్పు దొర్లినా మూడు తరాల జీవితాలు బాధితులుగా మారిపోతాయి. ఇంతటి విలువైన సున్నిత విషయాన్నీ యిప్పుడు కమలనాథులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు. 'లైంగిక సమానత్వం కోసం, న్యాయం కోసం' అంటూ ముస్లిం మతంలోని 'ట్రిపుల్ తలాక్' విధానాన్ని నిషేధించే పేరున సమాజంలోని వివిధ వర్గాల మధ్య దూరాన్ని, అపనమ్మకాన్నీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
విపక్షాల తీవ్ర నిరసనల మధ్య గురువారంనాడు లోక్సభలో ఆమోదం పొందిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం 'ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. దీనికింద ఒక ముస్లిం పురుషునికి అత్యధికంగా మూడేండ్ల జైలుశిక్ష విధించవచ్చు. అంతే కాకుండా ఆ శిక్షా కాలంలో భర్త బాధితురాలికి భరణం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ముస్లిం మహిళల పాలిట వరంగా కమలనాథులు ఆకాశానికి ఎత్తుతున్న ఈ చట్టం ఆచరణలో ఆ మహిళలను మరింతగా కష్టాల కొలిమిలోకి నెడుతుంది తప్ప ఆ కష్టాల నుంచి కాపాడే పరిస్థితి లేదు. అసలు, అనుక్షణం ముస్లింలపై దండెత్తే కమలనాథులకు, ఆ మతం పేరెత్తితేనే మండిపడి, వారిని ఒక శత్రువులుగా చూసే కమలనాథులకు ఉన్నట్టుండి ముస్లిం మహిళలపై ఇంత ప్రేమ పుట్టుకు రావడమే వైపరీత్యం. ముస్లిం మహిళలను ఆకర్షించి రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు, హిందూ- ముస్లింల మధ్య సామాజికంగా ఒక విభజన సృష్టించేందుకూ బీజేపీ పాలకులు పన్నిన పన్నాగమన్నది సత్యం. 'ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్' నిందితుడైన పురుషునికి మూడేండ్ల జైలుశిక్ష విధించేందుకు వీలు కల్పించడం, శిక్షా కాలంలో బాధితురాలికి భర్త భరణం చెల్లించాలనడంలోనే కుట్ర కోణం దాగి ఉంది. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి భరణమెలా చెల్లిస్తాడు? కనీసం నూటికి తొంభైమంది ఆ ఆర్థిక వెసలుబాటు ఉండదు గాక ఉండదు. మరి అప్పుడు ఆ బాధితురాలి పరిస్థితి ఏమిటి? వారి బిడ్డల భవిష్యత్ మాటేమిటి? అంతిమంగా ఈ బిల్లు ముస్లిం మహిళలకు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? వాస్తవానికి, 'ట్రిపుల్ తలాక్' బాధితురాలు తమ వైవాహిక బంధాన్ని కాపాడుకునేందుకే కోర్టుకు పోతుంది. తమ బిడ్డలు తండ్రి లేనివారు కారాదని, వారి భవిష్యత్కు ఒక భద్రత ఉండాలని, తానూ భర్తతో కలిసి ఉండాలని మాత్రమే కోర్టుకు వెళుతుంది తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ విడిపోవాలని మాత్రం కాదు. ఇప్పుడు ఈ చట్టం వల్ల ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త నేరస్తునిగా జైలుకెళితే ఆమె పరిస్థితి ఏమవుతుంది? బిడ్డల భవిష్యత్ ఏమవుతుంది? భర్త నేరస్తునిగా జైలులో ఉంటే ఆమె సామాజిక రక్షణ సంగతేమిటి? ఆమె ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఇవేమీ పరిశీలించ కుండా అనాలోచితంగా ఇంతటి తీవ్రమైన చట్టాన్ని తీసుకొస్తే మరింత సంక్షోభం తలెత్తుతుందే తప్ప బాధితురాలికి, ఆ కుటుంబానికీ న్యాయమెలా జరుగుతుంది?
వివాహ బంధం క్రిమినల్ సమస్య కాదు. సామాజిక సమస్య. సివిల్ సమస్య. ఏ మతంలోనూ వివాహ బంధం క్రిమినల్ సమస్యగా లేదు. ఏ మత పెద్దలు, యిప్పటివరకూ ఏ ప్రభుత్వాలూ వివాహ బంధాన్ని క్రిమినల్ సమస్యగా భావించలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేవలం ముస్లిం మతంలోనే వివాహబంధాన్ని క్రిమినల్ సమస్యగా చూస్తోంది. ఎందుకంటే, బీజేపీకి ముస్లింలు అంటే గిట్టదు గనుక. కాబట్టి ముస్లిం మహిళలను ఉద్ధరించే పేరుతో ఆ మతంలోని స్త్రీ పురుషులు యిరువురికీ కీడు చేస్తుంది.
ఒక మతంలో ఉన్న సామాజిక సమస్యలను ఇతర మతస్తులు పరిష్కరించ లేరు. రాజ్యం అస్సలు పరిష్కరించలేదు. దండన మాత్రమే తెలిసిన రాజ్యం, అందునా అన్య మతాలను శత్రువులుగా భావించే సిద్ధాంతం కలిగిన నేతల ఏలిక తాము తీసుకొచ్చే చట్టాల ద్వారా సమస్యను మరింతగా పెంచుతుందే తప్ప పరిష్కరించలేదు. అన్ని మతాలలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతి మతంలోనూ కొందరు సంస్కర్తలు పుట్టుకొచ్చి, అనేక కష్టనష్టాలకు ఓర్చి, మూఢులను దారికి తెచ్చి ఆయా మతాలలో సంస్కరణలు తీసుకువచ్చారు. బాల్య వివాహం, సతీసహగమనం నాడు హిందూమతాన్ని పట్టి పీడించిన తీవ్ర సమస్యలు. ఈ సమస్యల్ని పరిష్కరించింది చట్టాలూ పాలకులూ కాదు. హిందూ మతానికే చెందిన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, మహాత్మా జ్యోతిరావు ఫూలే లాంటి సంస్కర్తలు. ప్రభుత్వాలూ కోర్టులూ ఆ సంస్కర్తలకు సహకరిచడం ద్వారానే సమస్య పరిష్కారవుతుంది తప్ప, పరిష్కార బాధ్యత తమ చేతుల్లోకి తీసుకుంటే మొదటికే మోసమొస్తుంది. దేశంలోని ఒక మతంలో పాతుకుపోయి ఉన్న సమస్య పరిష్కారం పేరుతో ఆ మతస్తులను టార్గెట్ చేసి, ఆ మతంలోని వైరుధ్యాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడాన్నీ ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన, ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది.