Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్వేషమే దేశభక్తిగా చలామణి అవుతున్న కాలాన్ని మనం చూస్తున్నాం! 17వ పార్లమెంట్ ప్రమాణ స్వీకారాల సాక్షిగా పెచ్చరిల్లిన ఈ పరిణామం ఇప్పుడు ఈ దేశ ఐక్యతకే సవాలుగా మారింది. పార్లమెంటులో ఎంపీల ప్రమాణస్వీకారం సమయంలో కూడా బీజేపీ ఎంపీలు 'జైశ్రీరామ్' నినాదాలిచ్చారు. ప్రమాణస్వీకారానికీ, ఈ నినాదానికీ సంబంధం ఏమిటీ? ఇప్పుడిది వారి అనుచరగణాలనూ ఆవహించి ప్రజల జీవన మరణ సమస్యగా పరిణమిస్తోంది. కొత్త సర్కారు కొలువుదీరి మూడు నెలలన్నా కాలేదు, లెక్కకు మించిన మూకదాడులు దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మీసం పెంచారనో, గుర్రం ఎక్కారనో, ఆవులను తరలిస్తున్నారనో ఏదో ఒక వంకతో ఏదో ఒక మూల రోజూ అగ్గిరాజుకుంటూనే ఉంది. కేవలం జైశ్రీరామ్ అని నినదించని కారణంగానే మనుషుల ఉసురుతీస్తున్న ఈ ఉన్మాదం ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతున్నది?
'జో న బోలే జైశ్రీరామ్... బేెజ్దో ఉస్కో కబరిస్థాన్..'' ఇదీ ఇప్పుడు దేశమంతటా వైరల్ అవుతున్న పాట. జై శ్రీరామ్ అని నినదించని వారిని స్మశానానికి పంపించాలని హెచ్చరిస్తూ విడుదలై, సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతూ ఈ భయానక వర్తమానానికి అద్దం పడుతోంది ఈ విద్వేషగీతం. యూపీలోని చందౌలీలో ఓ పదిహేనేండ్ల ముస్లిం బాలుడికి నిర్ధాక్షిణ్యంగా నిప్పంటించిన ఘటన ఈ విద్వేష గీతం ప్రభావానికో తాజా నిదర్శనం. 'జైశ్రీరామ్' పేరుతో మైనారిటీలు, దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మీడియాతో మాట్లాడుతున్న ఓ ముస్లిం ఎమ్మెల్యేను, జార్ఖండ్ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర బీజేపీ మంత్రి మీడియా ముందే ''బోలో జైశ్రీరామ్'' అని ఒత్తిడి చేసిన ఉదంతం ఈ ఉన్మాదానికి మరో తాజా ఉదాహరణ. ఇదే రాష్ట్రంలో ఇదే కారణంతో తబ్రేజ్ అన్సారీని కొట్టి చంపిన ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకోవడం.. అమాత్యులు మొదలు వారి అనుచరుల వరకూ సాగిస్తున్న అమానవీయ ఘటనలకు ఓ మచ్చుతునక. అమేథీలో రిటైర్డ్ ఆర్మీ అధికారి అమానుల్లా ఇదే మూకదాడులకు బలైపోవడం ఆగని వీరి అకృత్యాల పరంపరకు ఓ అనవాలు. ఇవన్నీ కేవలం ఈ రెండు మూడు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న తాజా ఘటనలు మాత్రమే! దళితులు, మైనారిటీలే లక్ష్యంగా సాగుతున్న ఈ మూకదాడులు అంతకంతకూ అధికమవుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్న నిప్పులాంటి నిజాలు..!
ఈ మూకదాడులను ఆపండి అని 49మంది భారతీయ సినీ దిగ్గజాలు ప్రధానమంత్రికి విన్నవిస్తూ లేఖ రాశారు. బహువిధమైన, సుసంపన్నమైన ఈ దేశ సంస్కృతినీ, ''భిన్నత్వంలో ఏకత్వం'' అని గొప్పగా చెప్పుకునే భారతీయ తాత్విక పునాదినీ చిన్నాభిన్నం చేస్తున్న ఈ పరిణామాలను ప్రశ్నించడం, పరిష్కారాన్ని కోరడమే వారి నేరమైపోయింది. అమర్త్యసేన్కు ఎదురైన బెదిరింపులు, వేధింపులే వీరికీ మొదలయ్యాయి. కొందరయితే వారిపై కేసులకే సిద్ధపడుతున్నారు. వారి లేఖకు సమాధానం చెప్పలేక కొన్ని ప్రతిలేఖలూ సకిలిస్తున్నాయి. అఖిలభారత హిందూ మహాసభ సభ్యులైతే వీరిని నిరసిస్తూ, మూకదాడులను సమర్థిస్తూ ఏకంగా రక్తంతోటే నూటొక్క లేఖలు సంధించారు. కానీ స్పందించాల్సిన ప్రధాని మాత్రం మూకదాడులను ఉపేక్షించిన చందంగానే ఈ లేఖదాడుల పట్ల కూడా ఉదాసీనతనే ప్రదర్శించడం వారి ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తోంది. కానీ ఈ పరిస్థితుల మధ్యే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించడం విశేషం. మూకదాడుల పట్ల ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేయడం వారికి చెంపపెట్టు. వాటి నియంత్రణకు తామిచ్చిన మార్గదర్శకాలను ఏమేరకు అమలు చేశారో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్కు కూడా నోటీసులు జారీ చేయడం సమస్య తీవ్రతను ఎత్తి చూపుతోంది. కానీ కోర్టులన్నా, వాటి తీర్పులన్నా లెక్కలేని అప్రజాస్వామికవాదులకు ఇది తలకెక్కుతుందా? అందుకే ఏలినవారు దీనిని తేలికగా కొట్టిపారేస్తుంటే వారి అనుచరులూ ఆశ్రితులూ చెలరేగుతున్నారు. ఇది వర్తమానాన్ని మరింత దృశ్యమానం చేస్తోంది!
నిజానికి అసంఖ్యాకులైన హిందువులకు ఆరాధ్యుడైన రాముని పేర జరుగుతున్న ఈ దుర్మార్గం సాధారణ హిందువుల విశ్వాసాలకే విరుద్ధం. ప్రపంచంలో ఏ మతమైనా చెప్పేది సర్వ మానవ సమతా భావమే. కాబట్టి నిజమైన రామభక్తులూ, హిందూమత విశ్వాసకులెవరూ ఈ ఘాతుకాలకు పూనుకోరు. అందుకే సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునే రామతత్వానికీ ఈ జైశ్రీరామ్ నినాదానికీ ఏ రకమైన సాపత్యమూ సంబంధమూ లేదు. ఇవి ఏ హేతువాదులో చెపుతున్న మాటలు కావు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, నిఖార్సయిన హిందూమత విశ్వాసి, వారణాసిలో ప్రఖ్యాత సంకట్మోచన్ దేవాలయ మహాపంత్ విశ్వంభరనాథ్ చెపుతున్న వాక్కులు. ఇది కేవలం రాముని పేర, మతంపేర ఈ దేశంలో తమ అధికారాన్ని సుస్థిరమూ శాశ్వతమూ చేసుకోవాలని చూస్తున్న ఆధిపత్య వర్గాల కుట్ర మాత్రమే. ఇదంతా రాజకీయ అనురక్తే కాని రామభక్తి కానేకాదు. నిరుద్యోగం, ధరలూ, కుల వివక్ష, మహిళల మీద లైంగికదాడులను పరిష్కరించటంలో విఫలమైన బీజేపీ పాలకులు ప్రజల దృష్టి మరలించేందుకే 'జైశ్రీరామ్' నినాదాన్ని ముందుకు తెస్తున్నారు. ఇది గుర్తించనంత కాలం ఈ ఉన్మాదానికి దళితులూ, ముస్లింలే కాదు, మెజారిటీ హిందువులూ బలవుతూనే ఉంటారు..! గుర్తించాల్సిన సత్యం ఇదే.