Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మిక మార్కెట్లో తమ యిష్టానుసారం మార్పులు చేసుకునే అవకాశం ఉండాలన్నది నయా ఉదారవాదుల ప్రధాన డిమాండ్. కార్మికులను యిష్టానుసారం నియమించుకోవడానికి, తొలగించడానికి యజమానులకు, కంపెనీలకు సంపూర్ణ హక్కులు ఉండాలనేది వారి కోరిక. ఇటువంటి అవకాశం లేకపోతే దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోవన్న వారి వాదనలకు ఎటువంటి ఆధారాలు లేవు. అయినా, కార్పొరేట్ల కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం అదే దారిలో నడుస్తున్నది. అత్యధిక మెజార్టీతో రెండోసారి అధికార పీఠాన్ని అధిష్టించిన మోడీ ప్రభుత్వం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. సంఫ్ు పరివారానికి, కార్పొరేట్ శక్తుల అనుయాయులకు మంత్రివర్గంలో పెద్దపీట వేసిన మోడీ సర్కార్.. ఆ పద్ధతుల్లోనే వరుసపెట్టి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. అందులో భాగమే కార్మిక చట్టాల సవరణ. కార్మికులకు, ఉద్యోగులకు యిప్పటివరకూ ఎంతోకొంత రక్షణగా నిలిచిన 44చట్టాలను మోడీ సర్కార్ బలహీనం చేయాలనుకుంటోంది. వీటిస్థానంలో నాలుగు కోడ్ బిల్లుల్ని తెరపైకి తెచ్చింది. వేతనాలు, పరిశ్రమల భద్రత, సంక్షేమం, సామాజిక భద్రత-పరిశ్రమ సంబంధాల పేరుతో నాలుగు కోడ్ బిల్లుల్ని రూపొందించింది. కార్మిక, ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపాకే చట్టాల సవరణపై ముందుకెళతామని నమ్మబలికిన మోడీ సర్కార్ పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే బిల్లుల ఆమోదానికి ఆరాటపడుతున్నది. 'కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ బిల్, 2019', 'కోడ్ ఆన్ వేజెస్ బిల్, 2019'లను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టింది. ఈ బిల్లుల ద్వారా యజమానులకు మితిమీరిన స్వేచ్ఛ లభించనుంది. వీటి ప్రకారం కార్మికులు తమ హక్కుల కోసం, వేతనాల కోసం పోరాటం చేసే శక్తిసామర్థ్యాలు తగ్గిపోతాయి. ఇది కార్మికులకూ, కార్మిక సంఘాల వంటి అన్ని రకాల సంస్థలకూ డెత్ వారెంట్లాంటిదే.
ఇప్పటి చట్టాలు కూడా కార్మికుల పక్షాన ఉన్నవి కావు. యాజమాన్యాలకు మద్దతునిచ్చేవే ఎక్కువ. అయితే చట్టాల్లో మార్పులు ఎవరికోసం చేస్తున్నారన్నది ప్రశ్న. తొలగించినా, సదుపాయాలను ఇవ్వకున్నా గట్టిగా ప్రశ్నించే వీల్లేకుండా కార్మికులను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని యజమానులు కోరుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకునే వీల్లేకుండా పూర్తిగా అడ్డాకూలీలుగా మార్చేయాలనే దుష్ట ఆలోచన. సంఘాలు పెట్టుకునే వీలు కూడా ఉండకూడదు. కార్మికశక్తిని బలహీన పరచడానికి, సంఘాల్ని దెబ్బకొట్టేందుకూ చట్టాల్ని మారిస్తే, అది సంస్కరణ ఎలా అవుతుంది? మోడీ సర్కార్-2 అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కార్మిక సంస్కరణలపై బలంగా ముందుకెళ్లడానికి కారణం ఎన్నికల్లో తమ గెలుపునకు అన్ని విధాలా సహకరించిన కార్పొరేట్ల రుణం తీర్చుకోవడానికేనని తెలుస్తూనే ఉన్నది. ఈ నిర్ణయం వల్ల విదేశీ పెట్టుబడిదారులు సంతోషపడతారని నిటి ఆయోగ్ వైస్ చైర్మెన్ చెప్పారు. 46 ప్రభుత్వరంగ సంస్థల్ని పూర్తిగా మూసివేయడమో, లేదా ప్రయివేటీకరించడమో చేయడం తప్పనిసరి అని అన్నారంటేనే కేంద్రం ఉద్దేశ్యం అర్థమవుతున్నది. ఇలాంటి సంస్కరణలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కార్మికశక్తి కోసం చట్టాల్లో మార్పులు చేపట్టకుండా యాజమాన్యాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. 'ఇండిస్టియల్ రిలేషన్ కోడ్' ప్రతిపాదిత బిల్లు కార్పొరేట్లకూ, బడా పెట్టుబడిదారులకూ వరం. ఈ బిల్లు చట్టంగా మారితే, ఉద్యోగుల్ని, కార్మికుల్ని ఇష్టమున్నట్టు తీసుకోవచ్చు, తీసేయవచ్చు. అంటే, హక్కులపై పోరాడే అవకాశాల్ని కత్తిరించి... కార్మికుల రెక్కల్ని విరిచేయడమే. సాధారణ సెలవు, ఆర్జిత సెలవుల నిర్వచనాల్లోనూ మార్పు జరుగుతోంది. ఈఎస్ఐ, ఈపీఎఫ్లను ఇతర కేంద్ర పథకాలతో కలిపేయాలని, కార్మికుల సంక్షేమనిధిని ప్రయివేటీకరించాలని 'కోడ్ ఆన్ వేజెస్ బిల్లు-2019' బిల్లులో పేర్కొనడం ప్రమాదకరం.
మార్క్స్ వ్యాఖ్యానించినట్టు ఇది పెట్టుబడిదారీ విధానం మౌలిక లక్ష్యం. ఇది కార్మికులను సమాజంలో అత్యంత నిరుపేద వర్గాల స్థాయికి దిగజార్చడమే. కనీస స్వేచ్ఛ కూడా లేకుండా చేయడమే. దీంతోనే పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి వల్లెవేసే సిద్ధాంతాల డొల్లతనం స్పష్టమైంది. ప్రస్తుతం ప్రతిపాదించిన కార్మిక చట్టాల సవరణల ద్వారా దేశమంతా స్పెషల్ ఎకనామిక్ జోన్గా తయారవడమన్నది వాస్తవం. అసంఘటిత రంగంలోనూ, సాఫ్ట్వేర్ తదితర చోట్ల కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. వ్యవసాయ కూలీలకు వ్యవసాయ ఆధారిత పనులు చేసుకునే వారికి ఇప్పుడున్న చట్టాలతో ఉపయోగమే లేదు. ఇటువంటి వారికి కొత్త కార్మిక చట్టాలు తెచ్చి సహాయ పడాల్సింది పోయి, ఉన్న కార్మిక చట్టాలను సవరించి యజమానులకు మరింత వెసులుబాటు కల్పించడం దారుణం. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసే రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలను శ్రామికులు నిలదీయాలి. ప్రభుత్వరంగ సంస్థల్ని రక్షించుకోవడంతో పాటు తమ హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా కార్మికులు ఐక్యంగా కదలడమే మార్గం.