Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరువుతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. ఒకవైపు వర్షాభావం వెక్కిరిస్తున్నది. మరోవైపు పంటల సాగు తగ్గింది. ప్రజాసమస్యల పరిష్కారం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. కరువు రాజ్యమేలుతున్న నేపథ్యంలో ప్రజలకు అష్టకష్టాలు తప్పడం లేదు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్టుగా ఉంది కేసీఆర్ ప్రభుత్వ తీరు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 589 మండలాల్లో కరువు జడలు విప్పుతుంటే, తనకేమీ సంబంధం లేనట్టు ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. అంతేకాదు, యాగాల పేర తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని భూస్థాపితం చేస్తున్నది. వ్యక్తిగత సెంటిమెంట్లను ప్రజల మీద రుద్దడం ఒకటైతే, ప్రభుత్వ వ్యవస్థల్ని అందుకు వినియోగించడం విస్మయం కలిగించే పరిణామం. యాదాద్రిలో నిర్వహించాలనుకుంటున్న కుండ యాగం గురించి చిన్నజీయర్స్వామితో రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల్ని ఉన్నతాధికారులతో గత రెండు నెలల్లో ఒక్క గంటయినా మాట్లాడకపోవడం, సమీక్షంచకపోవడం గమనార్హం. దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజలూ రాష్ట్రం బాగోగుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏపాటిదో. అహర్నిశలు రాజకీయాలను శాసించే చర్యలు మినహా మరే ఇతర ప్రజాప్రయోజనాలు ప్రభుత్వానికి పట్టడం లేదు.
1997 నుంచి 2015 వరకు యాగాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత 2015, డిసెంబరు 23 నుంచి 27 వరకు ఎర్రవెల్లిలోని సీఎం సొంత ఫామ్హౌజ్లో శత చండీయాగం చేపట్టారు. మొత్తం క్యాబినెట్, ఉన్నతాధికారు లను అక్కడికి తరలించారు. రాష్ట్రంలోని మొత్తం 23శాశ్వత కరువు జిల్లాలున్నాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) చెబుతుంటే, మరోవైపు సీఎం యాగాలు పేర విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు, ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. 32శాతం లోటు వర్షపాతంలో పంటల సాగు విస్తీర్ణం సగానికి సగం పడిపోయిన నేపథ్యంలో అటువైపుగా సర్కారు ఆలోచనలు లేకపోవడం దారుణం. ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహించడం, స్వల్పకాలిక పంటలవైపు రైతులను సన్నద్ధం చేయడం గులాబీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. కరువు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాలను కాపాడుకునే శాస్త్రీయ విధానాలను భారత వ్యవసాయ పరిశోధన విభాగాలు విఫలమయ్యాయి. వీటిని పరిపుష్టం చేయడంలోనూ, రైతులకు అందుబాటులోకి తేవడంలోనూ కేంద్రం విఫలం కావడంతో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అటు బీజేపీ సర్కారు, యిటు కారు ప్రభుత్వం కరువుతోపాటు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిరుపేదలకు అన్యాయం చేస్తున్నాయి. చట్టసభల్లో అక్రమ పద్ధతుల ద్వారా టీఆర్ఎస్, బీజేపీలు సీట్లను పెంచుకునీ ప్రభుత్వాలను పడగొట్టి రాజకీయ వ్యభిచారానికి ఒడిగట్టాయి. రాజ్యాంగం ప్రాతిపదికన రూపొందించిన చట్టాలను తుంగలో తొక్కడం, ప్రతిపక్ష ప్రభుత్వాలనీ కూలగొట్టడంలో బీజేపీ తీరికలేకండా ఉంటే, యాగాలూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వలపన్నీ తన గుంపులో కలుపేసుకునే పనిలో గులాబీ పార్టీ తలమునకలైంది. కరువు నెలకొన్న నేపథ్యంలో దేశ ఆహారభద్రతకు కీలకమైన వరి, చెరకు తదితర పంటల దిగుబడి తగ్గనుందనేది కఠోర సత్యం. బియ్యం మార్కెట్ను శాసించే చైనా, భారత్, థారులాండ్ తదితర దేశాల్లో యిప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. అతివృష్టి, అనావృష్టి ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. బీహార్, తెలంగాణ, కర్నాటక తదితర ప్రాంతాల్లో వర్షాల్లేక తీవ్ర కరువు ఏర్పడింది. 2014-15లో కరువు మూలంగా రూ.4500కోట్ల నష్టం జరిగితే, కేంద్రం మాత్రం రూ.791కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఒక్కసారి మినహా రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు నివేదికలను కేంద్రానికి పంపడంలో శ్రద్ధచూపలేదు. అసలు పట్టించుకోనేలేదు. భూగర్భజలాలు పడిపోయి ఎస్సారెస్సీ, సింగూరు, నిజాంసాగర్, జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఖరీఫ్కు నీరందక పంటలు ఎండిపోయాయి. ఇంతటి తీవ్ర పరిస్థితుల మధ్య, ప్రజలు నలిగిపోతుంటే పాలక ప్రభుత్వాలు రాజకీయాలను కలుషితం చేసే దుష్టచర్యలపై దృష్టిపెట్టాయి. రైతులు కాడి వదిలేస్తున్నారు. మహిళలూ యువతా ఉపాధి కష్టాలను, నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయినా చీమకుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరం. చిన్నదేశమైనా థారులాండ్ కరువును ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన తనదైన శైలిలో క్లౌడ్సీడింగ్కు చర్యలు చేపట్టింది. విమానాల ద్వారా నీటిని తరలించే ప్రయత్నాలను ప్రారంభించింది. కాగా మన దేశంలోగానీ, రాష్ట్రంలోని అలాంటి ప్రత్యామ్నాయ చర్యలుగానీ, ప్రయత్నాలుగానీ మచ్చుకు కూడా కనిపించకపోవడం పరిపాలనా రాహిత్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. అసలు కరువును గుర్తించే పరిస్థితుల్లో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వాలు లేకపోవడం అంటే ఓటేసిన ప్రజలను నిర్లక్ష్యం చేయడమే.