Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరణార్థులపై జరుగుతున్న అకృత్యాల పరంపరను ఆపటానికి పెట్టుబడిదారీ వ్యవస్థపై చేసే పోరాటాలను మరింతగా తీవ్రతరం చేయటమొక్కటే ప్రత్యామ్నాయం అని చెప్పక తప్పదు. సంపన్న దేశాలు శరణార్థులకు వ్యతిరేకంగా తీసుకునే చర్యల వల్ల లక్షలాదిమంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. గురువారంనాడు దాదాపు 300మంది శరణార్థులతో ఇటలీవైపు పయనిస్తున్న నౌక మధ్యదరా సముద్రంలోని లిబియా తీర జలాలలో మునిగిపోయింది. ఆ దుస్సంఘటనలో మునిగిపోతున్న వారిలో 140మందిని మత్స్యకారులు రక్షించారు. మిగిలిన వారు చనిపోయి ఉంటారు.
తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని ప్రాణాలతో బతికి బయటపడిన వారిని ఓదార్చటం అక్కడున్నవాళ్ళకు దుస్సాధ్య మయింది. తన ఏడేండ్ల కొడుకును కోల్పోయిన శరణార్థి సబా యూసుఫ్ 'నా దేశమైన సూడాన్కు పోయి అక్కడే చావటం మినహా నాకేమీ అక్కరలేదు' అన్నాడు. అలాగే ప్రాణాలతో బయటపడిన ఒక ఎరిట్రియన్ శరణార్థి తాము జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్నామనీ, తమకు తక్షణ సహాయం అవసరమనీ అతను అంతర్జాతీయ సహాయాన్ని అర్థించాడు.
ఆ పడవ మునక సంఘటనలో ప్రాణాలతో బతికి బయటపడిన శరణార్థులు యిప్పటికీ ప్రమాదకర పరిస్థితులలో ఉన్నారు. లిబియా తీరంలో చిక్కుకున్న శరణార్థులను నిర్బంధ శిబిరాలలో ఉంచుతున్నారు. 2011లో నాటో దళాలు లిబియా ప్రభుత్వాన్ని, సైన్యాన్ని సర్వనాశనం చేసిన తరువాత ఆ దేశంలో చెప్పుకోదగిన ప్రభుత్వం గానీ, రక్షణ దళాలు గానీ లేవు. అటువంటి పరిస్థితులలో ఈ శిబిరాల నిర్వహణకు 'లిబియా కోస్ట్ గార్డ్' అనే సైన్యాన్ని యూరోపియన్ యూనియన్ నిర్మించాల్సి వచ్చింది. ఈ నిర్బంధ శిబిరాలలో శరణార్థులు దాడులకు, బలత్కారాలకు, బలవంతపు చావులకు గురవుతున్నారు. ఇటువంటి రాక్షస చర్యలను ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల గ్రూపులు, ప్రధాన మీడియా సంస్థలు పదేపదే బహిర్గతం చేశాయి. ఎలాగోలా ఈ శిబిరాలలో తట్టుకుని బతికిన వారు నాటో యుద్ధం తరువాత లిబియాలో చెలరేగిన అంతర్యుద్ధంలో బలవుతున్నారు. జులై ఆరంభంలో లిబియా రాజధాని ట్రిపోలిలో ఇటలీ మద్దతుగల అధికారిక లిబియా ప్రభుత్వంపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్, ఈజిప్షియన్ నియంత అబదెల్ ఫట్టాల మద్దతు గల సైనిక దళాధినేత ఖాలీఫా హఫ్తర్కు చెందిన యుద్ధ విమానం ఒక శరణార్థి శిబిరంపై బాంబు దాడి చేసినప్పుడు అనేకమంది చనిపోయారు.
2016నుంచి మధ్యదరా సముద్రంలో మునిగి చనిపోయిన శరణార్థుల సంఖ్య 14000దాటింది. దీనికి యూరోపియన్ యూనియన్, పెట్టుబడిదారీ వ్యవస్థ బాధ్యత వహించవలసి ఉంటుంది. పొర్టోరికోలో ఉవ్వెత్తున లేచిన ప్రజా నిరసనలు, అమెరికాలో ఉపాధ్యాయుల సమ్మెలు, ఫ్రాన్స్లో 'యెల్లో వెస్ట్' నిరసనలు, యూరోపియన్ యూనియన్ మితవ్యయ చర్యలకు వ్యతిరేకంగా పోర్చుగల్, పోలెండ్, జర్మనీ దేశాలలో జరిగిన సమ్మెలవంటి వర్గ పోరాటాలు ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న స్థితిలో కార్మికవర్గంలో చీలిక తేవటానికి పెట్టుబడిదారీ వర్గం శరణార్థులకు వ్యతిరేకంగా జాతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతోంది. అదే సమయంలో యావత్ కార్మికవర్గాన్ని అణచేయటానికి అదొక పోలీసు రాజ్యాన్ని నిర్మిస్తోంది.
సంపన్నుల సంపద మరింతగా పెంచటానికి సామ్రాజ్యవాద దేశాలు మితవ్యయ చర్యలకు పాల్పడుతూ తమ సైనిక పాఠవాన్ని పెంచుకోవటం కోసం లక్షల కోట్లను వ్యయం చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ దేశాలలోని ప్రభుత్వాలు, అన్నిరకాల బూర్జువా పార్టీలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం శరణార్థులని చెబుతున్నాయి. అమెరికాలో అధికార పత్రాలు లేకుండా నివసిస్తున్న లక్షలాది ప్రజలను దేశం నుంచి బహిష్కరించటానికి ఒక నిర్బంధ శిబిరాల నెట్వర్క్ను అధ్యక్షుడు ట్రంప్ నిర్మించాడు. అమెరికావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా ఆ దేశానికి వలసవచ్చిన పేద ప్రజలను పసిపిల్లలతో సహా నిర్బంధ శిబిరాలలో కుక్కుతున్నారు. ఈ నిర్బంధ శిబిరాల నిర్మాణానికి కావలసిన నిధులను అందజేయటానికి డెమొక్రటిక్ పార్టీ మద్దతు పలికింది.
లిబియా తీరంలో నౌక మునిగిన ఘటనలో పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రాణాలు కోల్పోవటంపట్ల ఐరోపా అంతా అట్టుడికింది. దీనికంతకీ యూరోపియన్ యూనియన్ బాధ్యత వహించవలసి ఉంటుంది 2015లో 'ఆపరేషన్ ట్రిటన్' కింద మధ్యదరా సముద్రంలో శరణార్థుల భద్రతకు సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేయటమే కాకుండా వారిని నిర్బంధించటానికి యుద్ధనౌకలను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఇటలీ, గ్రీస్ నుంచి టర్కీ, లిబియా, నైజర్లదాకా ఒక నిర్బంధ శిబిరాల నెట్వర్క్ను పెద్దఎత్తున నిర్మించారు. కనీస సౌకర్యాలులేని ఈ నిర్బంధ శిబిరాలలో మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు చెందిన లక్షలాది శరణార్థులను నిర్బంధించారు.
పోలీసు రాజ్య నిర్మాణం, నిరంతరం రాజ్యహింసకు పాల్పడటం పాలక వర్గాలు ఫాసిజం బాట పట్టాయనడానికి ప్రతీకలుగా ఉంటాయి. అంతర్జాతీయంగా కార్మికవర్గ సమీకరణతో సమాజం సోషలిస్టుగా పరివర్తన చెందటంపైనే మానవాళి కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గం నియంతృత్వం నుంచి విముక్తి అవుతుందనే అవగాహన మాత్రమే ప్రజలను ముందుకు నడిపించగలదు.