Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్ ఉన్నావ్లో 19ఏండ్ల బాలికపై లైంగికదాడి సంఘటన దేశ చరిత్రలో అత్యంత హేయమైన, దుర్మార్గమైన నేరంగా నిలిచిపోతుంది. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ 2017 జూన్ 17న ఆ బాలికపై లైంగికదాడి చేసాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి అతడు లైంగిక దాడి చేస్తుంటే తలుపు వెలుపల కాపలా కాసింది శశిసింగ్ అనే మహిళా శిరోమణి. ఉన్నావ్ జిల్లా లోనే అత్యంత బలవంతుడైన సింగార్పై న్యాయపోరాటానికి సిద్ధ పడింది ఆ బాలిక. ఇది ఎంతో ప్రమాదమని, తనతో పాటు, తన కుటుంబ సభ్యులు, సాక్షులూ హత మయ్యే అవకాశం ఉన్నదని తెలిసినా ఆ దుర్మార్గుడికి శిక్షపడేం తవరకూ తన న్యాయపోరాటం ఆపనని ముందుకే వెళ్లింది.
మొదట పోలీసులు సెంగార్పై కేసు నమోదు చేసేందుకే అంగీకరించలేదు. ' మీరు ఫిర్యాదు చేసిన అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద కేసూగీసూ అనకండి. మీ జీవితాలని, మా ఉద్యోగాలనీ ప్రమాదంలో పడవేయకండి' అని హితవు పలికారు. దీంతో ఆ యువతి జూలై 31, 2018న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు తన తల్లితో కలిసి ఆత్మహత్యకు విఫల యత్నం చేసారు.
ఈ సంఘటనతో ఈ దుర్మార్గం ప్రపంచమంతా తెలిసిపోవడంతో యోగి ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకుంది. సీబీఐ సెంగార్ను అరెస్టు చేయడంతో ఆ దుర్మార్గుడు గత 9 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. తాను జైల్లో ఉన్నా, కేసులో ప్రధాన సాక్షులు, న్యాయవాదులను అంతమొందించి తాను బయట పడాలని కుట్రలు పన్నుతున్నాడు. ఈ కుట్రల్లో భాగమే గత ఆదివారం రాయబరేలీలో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఒక లారీ ఢకొీట్టడం. ఈ హత్యాయత్నంలో ఇద్దరు ఆమె దగ్గరి బంధువులు మరణించగా, ఆమె, ఆమె లాయరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇప్పటికే బాధితురాలి తండ్రి పోలీస కస్టడీలోనే చనిపోయాడు. మరొక సాక్షిని కూడా సెంగార్ బలితీసుకోగా, ఆమె బాబాయిపైన అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. న్యాయపోరాటంలో యిప్పటికే ఆ బాధితురాలు, తన తండ్రిని, బంధువులను మానవత్వంతో సాక్ష్యం చెప్పేందుకు ముందుకొచ్చిన సాక్షినీ కోల్పోయింది. కేసు నమోదయినప్పటి నుంచీ బాధితురాలికి భయం కరమైన బెదిరింపులు వస్తు న్నాయి. కేసు వాపస్ తీసుకోకపోతే నిన్ను, నీ బంధువులను, సహకరించే వారినీ చంపేస్తామని బహిరంగంగా, ఆమె ఎదుటే హెచ్చరిస్తూ వస్తున్నారు సెంగార్ అనుచరులు. ఈ బెదిరింపులు లెక్కచేయక, ఎలాగైనా న్యాయపోరాటం ఆపకూడదన్న లక్ష్యంతో బాధితురాలు తన చిన్నాన్న ఇంటికి ఢిల్లీకి చేరుకుంది. అయినా వేధింపులూ బెదిరింపులూ ఆగలేదు. వీటికి పరాకాష్ఠ కారును లారీతో ఢకొీట్టిన ఘోర ఉదంతం.
బాధితురాలి విషయంలో పోలీసులు, బీజేపీ నాయకులూ ప్రవర్తివంచిన తీరు అత్యంత హేయం. ఈ సంఘటనపై దేశమంతా దుమ్మెత్తి పోస్తున్నా, స్థానిక పార్లమెంట్ సభ్యుడు సాక్షి మహరాజ్ స్వయంగా జైలుకెళ్లి ఆ దుర్మార్గుడిని పరామర్శించి, తనను ఎంపీగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపి వచ్చారు. తన నియోజకవర్గానికే చెందిన బాధితురాలిని మాత్రం కనీసం కన్నెత్తి చూడకుండా, కాషాయం కట్టిన తనకు ఏమాత్రం మానవ లక్షణాలు లేవని నిరూపించుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దేశానికే ఆదర్శమని ప్రకటించి మురిసిపోతున్నారు. పాలకుల తీరు ఇలా ఉండగా పోలీసుల వ్యవహారం మరింత దారుణం. ఇంత ఘోరకలి జరుగుతున్నా, ఆమెకు కేటాయించిన సెక్యూరిటీ ఏమైందని మీడియా ప్రశ్నిస్తే అందుకు సమాధానం చెప్పకుండా, '.. చూస్తుంటే ఈ ప్రమాదం ఓవర్స్పీడ్ వల్ల జరిగిందని అనిపిస్తోంద'ని సెలవిచ్చారు. ఈ డీజీపీనే గతంలో నింది తుడైన ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తే.. ' గౌరవనీయ ఎమ్మెల్యే గారిపై ఇప్పుడు వచ్చింది ఆరోపణలే కదా..!' అని బదులిచ్చారు. కోర్టులతో పనిలేకుండా, నిందితులకు డీజేపీనే క్లీన్ చిట్ యిచ్చేస్తారు. ఒక దుర్మార్గమైన నేరస్తుడిని ' గౌరవనీయ', 'గారు ' అని పబ్లిక్గా సంభోదించి తన స్వామిభక్తి చాటుకున్నాడు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని భావించిన సెంగార్ తనపై కేసు నమోదయిన తరువాత కూడా ఒకసారి సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు, మరోసారి డీజీపీ కార్యాలయం ముందూ చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చారు. 'వచ్చింది ఆరోపణలే కదా.. నేను పారిపోలేదుగా..' అంటూ మీడియాతో వెటకారమాడారు.
రాష్ట్ర పోలీసుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా తనకు అన్యాయమే తప్ప న్యాయం జరగదని తెలుసుకున్న బాధితు రాలు 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తనకు న్యాయం చేయాలని కోరుతూ లేఖ రాసింది. న్యాయ వ్యవస్థలోని అలసత్వం వల్ల ఆమెపై హత్యాయత్నం జరిగేం తవరకూ ఆ లేఖ సీజేకి అందలేదు. బాధితురాలిపై జరిగిన హత్యా యత్నం గురించి తెలుసుకున్న ప్రధాన న్యాయమూర్తి గురువారం తీవ్రంగా స్పందిస్తూ ''ఒక 19ఏండ్ల అమ్మాయిని లైంగికదాడి చేశారు. ఆమె తండ్రి పోలీసు కస్టడీలో చనిపోయాడు. ఆమెతో పాటు మేనత్తలు ప్రయాణిస్తున్న కారును ఢకొీట్టి హత్య చేసే ప్రయత్నం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇంతకీ ఈ దేశంలో ఏం జరుగుతోంది?'' అంటూ సీజే ఘాటుగా ప్రశ్నించారు. అవును! అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది!? ఇప్పుడు ప్రజలే తేల్చుకోవాలి.