Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలో ఈ పది రోజుల్లో ప్రజాసమూహాలపై మూడు కాల్పుల ఘటనలు జరిగాయి. కాలిఫోర్నియాలోని గిల్రారు ఘటనలో కాల్పులకు తెగబడిన వ్యక్తితోపాటు నలుగురు చనిపోయారు. పదిహేనుమందికి గాయాలయినాయి. ఒహాయో రాష్ట్రంలోని డేటన్ సంఘటనలో సాయుధుడిసహా పదిమంది చనిపోయారు. పదహారుమంది గాయపడ్డారు. అలాగే టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసోలో జరిగిన కాల్పుల్లో ఇరవైమంది మరణించారు. 26మంది గాయపడ్డారు. ఉన్మాదులు యిలా విచక్షణారహితంగా కాల్పులు జరపటం అమెరికన్ల నిత్యజీవితంలో భాగమైపోయింది. అమెరికాకు వలసొచ్చిన వారిపైనా, మైనారిటీ జాతులపైనా హింసకు పాల్పడమని ట్రంప్ రెచ్చగొట్టిన తరువాతే గిల్రారు, ఎల్ పాసో హత్యాకాండలు జరిగాయి. తాను జరిపిన కాల్పులతో ట్రంప్కు సంబంధం లేదని ఎల్ పాసోలో నిందితుడు పాట్రిక్ క్రుసియస్ ఇంటర్నెట్లో ప్రకటించినప్పటికీ తనతోపాటు ఇతర ఫాసిస్టు శక్తులకు ప్రభుత్వ మద్దతు ఉందని అతనికి తెలుసు.
నిరసనకారులపై జరిగే హింసను సమర్థిస్తానని 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రకటించాడు. అనుమానితులను అరెస్టు చేసినప్పుడు పోలీసులు అతిగా మర్యాద యివ్వొద్దని ఆయన సూచించాడు. అమెరికాకు వలసగా వచ్చినవారిని చట్టవిరుద్దంగా నిర్బంధించి కోర్టు ధిక్కారానికి పాల్పడిన షెరీఫ్ జో అర్పాయోకి ట్రంప్ అధ్యక్షుడి హౌదాలో క్షమాబిక్ష పెట్టాడు. కేవలం రెండు నెలల క్రితం ఒక ప్రచార సభలో ట్రంప్ ఇలా ప్రశ్నించాడు.. సరిహద్దులో శరణార్థులుగా వలస రావటానికి సిద్ధంగా ఉన్న వారిని ఏం చేయాలి? అందుకు ట్రంప్ మద్దతుదారుల ప్రతిస్పందన ఇలావుంది.. కాల్చిపారేయండి! గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ప్రజలను హింసకు పాల్పడమని రెచ్చగొడుతున్నాడు. బాల్టీమోర్ నగరం నేరమయమైందని, అదో ఎలుకల కుహరమని, అక్కడ మనిషన్నవాడు నివసించడని ట్రంప్ అన్నాడు. ఇలా రెచ్చగొట్టటం వల్ల యిప్పటికే అస్థిరంగా ఉన్న రాజకీయ పరిస్థితి మరింతగా దిగజారుతుందని, హింస చెలరేగుతుందని ట్రంప్కి, అతని సలహాదారులకు తెలుసు. అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడే 'లా అండ్ ఆర్డర్'ను రక్షించే పేరుతో నిరంకుశాధికారాలను కైవసం చేసుకోవచ్చనే ఎత్తుగడను అమెరికా అధ్యక్షుడు అనుసరిస్తున్నాడు.
క్రుసియస్ తన లక్ష్యాలను ఒక మ్యానిఫెస్టోగా ఇంటర్నెట్లో ప్రకటించాడు. న్యూజీలాండ్లోని క్రైస్ట్చర్చిలో రెండు మసీదులలో 51మందిని చంపిన టెర్రరిస్టును కీర్తించటంతో అతను తన ఆ మ్యానిఫెస్టోను ప్రారంభించాడు. తన దాడి లాటిన్ అమెరికా నుంచి వలసొచ్చి టెక్సాస్ను ఆక్రమించినవారిపైనేనని అతను ప్రకటించాడు. తన దేశాన్ని సాంస్కృతిక దాడి నుంచి రక్షించటానికి, తన జాతి స్థానాన్ని మరొక జాతి ఆక్రమించటానికి వ్యతిరేకంగా తాను ఈ దాడికి పాల్పడినట్టు అతను పేర్కొన్నాడు. ఎల్ పాసో హంతకుడు మరింత జాతి విద్వేషిగాను, వలసొచ్చిన వారిపట్ల పచ్చి వ్యతిరేకిగానూ ఉన్నాడు. అమెరికాలో ఫాసిస్టు ధోరణి జాతి వ్యతిరేకత రూపంలోను, వలస వచ్చినవారికి వ్యతిరేత రూపంలోనూ ఉంది. నిరుద్యోగం, తక్కువస్థాయి వేతనాలు, విద్యార్థుల అప్పుల భారం, దిగజారిన కార్మికుల జీవన ప్రమాణాలు, తదితర సామాజిక సమస్యలను కార్పొరేట్ల కుట్రగా ఈ హంతకుడు అభివర్ణించాడు. అధిక వేతనాలు పొందుతున్న అమెరికా కార్మికుల స్థానంలో తక్కువ వేతనాలకు దొరికే విదేశీ శ్రామికులను నింపాలనే కార్పొరేట్ కుట్ర దీనిలో దాగుందని అతను అన్నాడు. పెట్టుబడిదారీ సమాజంలోని సామాజిక అంతరాలకు జాతీయవాదం ముసుగు తగిలించే ఫాసిస్టు స్వభావంలో భాగంగానే ఈ విశ్లేషణ ఉంది.
అమెరికాలో ఇటువంటి జాతి వివక్షతో కూడిన రాజకీయాలు ప్రజామోదం పొందటంలో డెమొక్రటిక్ పార్టీ పోషించిన పాత్రను విస్మరించలేం. చారిత్రకంగా జాతి వివక్షపై జరిగే పోరాటం దాని చట్ట వ్యతిరేకతను ఎండగడుతుంది. సామాజిక విశ్లేషణ చేయటానికి జాతి అనే సంవర్గం అంత ప్రయోజనకారి కాదు. దీని అశాస్త్రీయత లక్షలాది మిశ్రమ జాతి కుటుంబాలు ఏర్పడిన నేటి ఆధునిక స్థితిలో మరింతగా ప్రస్పుటమవుతోంది. అయినప్పటికీ డెమొక్రటిక్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఫాసిస్టుల మాదిరిగానే సమాజం విభిన్నమైన 'తెల్ల', 'నల్ల' జాతి ప్రజలతో కూడి ఉన్నదని చెబుతారు.
అమెరికాలో నిరాయుధులైన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరపటం సర్వసాధారణమైంది. అమెరికా సమాజం గత 30ఏండ్లలో ముఖ్యంగా 2001లో జరిగిన 9-11దాడి తరువాత విపరీతంగా హింస, మిలిటరీకరణలకులోనైంది. పర్యవసానంగా ఇటువంటి హింసా ప్రవృత్తి పెచ్చరిల్లుతోంది. ఈ హింసా ప్రవృత్తి నేటి అభివృద్ధి నిరోధక రాజకీయాలతో మమేకమైంది. పర్యవసానంగా అమెరికా సమాజం ఒక నిర్వీర్యమైన సమాజంగా మారింది.
జాతి ప్రాతిపదికన చేసే రాజకీయాలకు నిజమైన ప్రత్యర్థిగా వర్గ ప్రాతిపదికన చేసే రాజకీయాలుంటాయి. సమాజంలో సంపదను సృష్టించే కష్టజీవులందరినీ ఐక్యంచేసి ఆ సంపదను దోచుకునే పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, సోషలిజం స్థాపనే లక్ష్యంగా పోరాటాలు కొనసాగినప్పుడే అమెరికా ప్రజలు ఫాసిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు.