Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భావోద్వేగాలతో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా మరో దుస్సాహసానికి తెరలేపింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజా, పర్యావరణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు మొదలెట్టింది. రెండు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో యురేనియం తవ్వకాల కోసం కేంద్ర అటవీ పర్యావరణ మండలి సూత్రప్రాయ ఆమోదం తెలపడమే యిందుకు సాక్ష్యం. యురేనియంతో విద్యుత్ను ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తున్నది.
యురేనియం ప్రకృతి సహజ సిద్ధంగా భూమి పొరల్లోని రాళ్లు, మట్టి, నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. భూమిలో ఉన్నంతవరకు దీంతో ఎలాంటి సమస్యా ఉండదు. ఒకసారి భూమిలో నుంచి బయటకు రాగానే, యురేనియం మొదట గాలితో చర్య జరిపి ఆక్సైడ్గా విడిపోతుంది. అప్పుడు దానికి అణుధార్మికశక్తి ఏర్పడుతుంది. దీనికి అణుభారం కూడా ఎక్కువే. దీని సాంద్రత సీసం కంటే 75శాతం అధికంగా ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్లతో చర్య జరిగినప్పుడు అత్యధిక ఉష్ణోగ్రతలను విడుదల చేస్తుంది. అణ్వాయుధాలలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఇంధనం యూ-235 తక్కువలో తక్కువగా ఏడు కిలోల యురేనియంతో ఒక అణుబాంబును తయారు చేయవచ్చు. యురేనియం(యూ-238) నుంచి జనించే ప్లుటోనియం అనే రూపం(పీయూ-239) అత్యంత ప్రమాదకరమైంది. తన ప్రతి రసాయనిక చర్యలో యురేనియం బీటా, గామా కిరణాలను వెదజల్లుతుంది. అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషులు, జంతువుల శరీరాల్లోకి చేరి ఎముకల్లో స్థిరపడుతుంది. తద్వారా రకరకాల క్యాన్సర్ వ్యాధులతో ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుంది.
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన పులుల అభయారణ్యంగా పేరుపొందిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు నల్లమల అడవుల్లో ఉంది. తాజా యురేనియం ప్రాజెక్టును అక్కడే చేపట్టాలని కేంద్రం ఆలోచన. దాదాపు ఏడు జిల్లాలకు ఈ ప్రాజెక్టు వల్ల ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో నివిసిస్తున్న చెంచులు, ఆదివాసీలు, సాధారణ ప్రజలతోపాటు వృక్షాలు, పక్షులతోపాటు 1500రకాల జంతువులు నాశనమవుతాయని అంటున్నారు. లక్షలాదిమంది ప్రజల జీవితాలు గాల్లో దీపమవుతాయని ఆందోళన చెందుతున్నారు. 1952లో కెనడాలోని ఓంటారియో, 1979లో అమెరికాలోని త్రీమైల్ ఐలాండ్ యురేనియం తవ్వకాల గనిలో జరిగిన ప్రమాదం మూలంగా ఎదురైన సమస్యలు అన్నీ, యిన్నీ కావు. ఆ గనిని మూసేసి గత 40 ఏండ్లు దాటినా, నేటి అక్కడి భూగర్భజలాలు విషతుల్యంగానే ఉన్నాయి. తాగడం సంగతి పక్కనబెడితే, కనీసం బట్టలు ఉతకడానికి కూడా అమెరికా ప్రభుత్వం అనుమతించడం లేదు. దీనిని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు మనదేశంలోని జార్ఖండ్లోని జాదూగూడ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకం మూలంగా పర్యావరణం పూర్తిగా దెబ్బతిన్నది. అక్కడ వేలాదిమందికి ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర చర్మవ్యాధులు తీవ్రంగా ప్రబలాయి. ఇప్పుడక్కడ పుట్టే పిల్లలు జన్యుసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీంతో యురేనియం ఎంత విషతుల్యమో అర్థం చేసుకోవచ్చు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో స్వేచ్ఛగా జీవిస్తున్న ప్రజలను తరలించేందుకు, పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసేందుకు పూనుకోవడం గమనార్హం.
యురేనియం తవ్వకాల గురించి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, ప్రజల జీవికను విధ్వంసం చేసే ఈ ప్రాజెక్టును ఆదిలోనే అడ్డుకోవాల్సిన బాధ్యత యిటు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వానిది కాగా, అటు ఏపీలోని వైసీపీ సర్కారుది కూడా. రాష్ట్రంలోని నల్లగొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి, అలాగే ఏపీలోని ప్రకాశం, గుంటూరు, కర్నూల్, కడప జిల్లాల్లో నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. నల్లమలలో భారీగా యురేనియం నిల్వలు ఉన్నాయని, యివి నాణ్యమైనవని భారత ప్రభుత్వ రంగ సంస్థ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్(ఏఎండీ) అంచనా. దీని కోసం 20,509 ఎకరాల్లోని అటవీ ప్రాంతంలో సర్వే చేయడంతోపాటు భూమిలో బోర్వెల్స్ తవ్వేందుకు భారత ప్రభుత్వానికి ఏఎండీ లేఖ రాసింది. యురేనియం నిక్షేపాల అన్వేషణకు అనుమతి కావాలని అడిగినట్టు సమాచారం. 83 చదరపు కిలోమీటర్ల పరిధిలోని తవ్వకాలు చేయాలని ఆ సంస్థ భావిస్తున్నది. అందుకోసం 4000 బోర్లు వేయాలనుకుంటున్నది. ఒకవేళ ఈ ప్రాజెక్టు పనులు గానీ మొదలైతే, తెలంగాణలోని సగం జిల్లాలు ప్రభావితమవుతాయని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల నడుమ గలగలా పారే కృష్ణమ్మ సైతం చరిత్ర పుటల్లోకి వెళ్లిపోనుంది. అందుకే ఈ ప్రాజెక్టు పట్ల అభయారణ్యం భయపడుతున్నది. అడవులు, వృక్షజాతులు, చెంచులు, ఆదివాసీల జీవనాన్ని విధ్వంసం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రక్రియను మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.