Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ ఆర్థికవ్యవస్థ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలనూ కమ్మేస్తున్నది. ఎన్నడూ లేనంతగా ఆటోమొబైల్ రంగం మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. ఉత్పత్తి పడిపోయి కంపెనీలు షట్డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితికి వచ్చాయి. ఆటోమొబైల్ రంగంలో రారాజుగా నిలిచిన టాటా మోటార్స్ 15రోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు షట్డౌన్ ప్రకటించడమంటే సంక్షోభం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతున్నది. మరో 12పెద్ద కంపెనీలూ అదే దారిలో ఉన్నాయి. 30కంపెనీలను పూర్తిగా మూసేందుకు యాజమాన్యాలు సిద్ధమవు తున్నాయి. ఇక చిన్న కంపెనీలు సరేసరి. డీలర్లు కూడా షట్టర్లు మూసేసు కుంటున్నారన్నది సమాచారం. ఫలితంగా గడిచిన ఆరునెలల్లో మూడున్నర లక్షల మంది ఉద్యోగులు కొలువుల్ని కోల్పోయారు. దీనికంతటికీ కేంద్రప్రభుత్వ విధానాలే కారణమని ఆర్థిక విశ్లేషకులు నెత్తీనోరూ కొట్టుకుని చెబుతున్నా వినేందుకు మోడీ సర్కార్ ఎక్కడ సిద్ధమైందీ? వ్యవస్థలను నాశనం చేసే పనిలో బిజీగా ఉన్న బీజేపీ ప్రభుత్వం.. వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహి అనే ముద్ర వేసేందుకు మాత్రం వెనుకాడటం లేదు. ఆర్థికరంగంలోనూ ఆ ఛాయలు చొరబడ్డాయి. పైగా కంపెనీల నష్టాలకు ప్రభుత్వానిదే తప్పని ఎలా చిత్రీకరిస్తా రని బెదిరింపులకు దిగుతున్నది. సమస్య వచ్చినా, నష్టాలొచ్చినా పరిష్కరించేందుకు దివాళా చట్టాన్ని ఉపయోగించుకోవాలని మంత్రులు ప్రకటించడం సిగ్గుచేటు. అంటే తమకు మద్దతిచ్చిన వారందరినీ ఏదోరకంగా ఆదుకుంటామని చెప్పడమంటే లోబరచుకోవడమే కదా! చివరికి ఆటోమొబైల్ కంపెనీలు.. ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి అడుక్కోవాల్సిన దుస్థితి రావడం ఘోరం.
దేశ ఆర్థికరంగంలో ఈ రకమైన ఫలితాలు ఎందుకు వస్తున్నాయి? అన్న ప్రశ్నకు, ఆర్థిక విశ్లేషకుల నుంచి వచ్చే సమాధానం... ''గత ఐదేండ్లుగా ఎంచుకున్న ఆర్థిక నిర్వహణ, అమలుజేసిన విధానాలు''. నోట్లరద్దు, జీఎస్టీ అమలు తర్వాత కొంతమంది కార్పొరేట్లు తప్ప ఎవరూ లాభపడింది లేదు. సమస్య తీవ్రత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దానిప్రభావం ఇప్పటికీ ఆయా రంగాలపై ఉందన్నది ఆర్థికవేత్తల అంచనా. ఉపాధి లభించకపోవడం, దీనికితోడు కొనుగోళ్లు లేకపోవడంతో వాహనాల అమ్మకాలు బాగా తగ్గాయన్నది వాస్తవం. గత 18నెలల్లో డీలర్లు తమ కార్యకలాపాలను ఆపేయడం ఇందుకు ఉదాహరణ. మహారాష్ట్రలో 84మంది డీలర్లు వ్యాపారాలను మానేశారు. తమిళనాడు, ఢిల్లీ, బీహారు, రాజస్థాన్, ఇలా పలు రాష్ట్రాల్లో చాలామంది డీలర్లు వ్యాపారాలకు పుల్స్టాప్ పెట్టేశారు. ఈ పరిస్థితి ఏ ఒక్క వారమో... నెలనో కాదు. గత కొన్నినెలలుగా తయారీరంగంలో ఉన్న పరిశ్రమలు తిరోగమనంలో కొట్టుమిట్టాడు తున్నాయి. ఈ విషయంలో తమకేమీ సంబంధం లేదన్నట్టు పాలకులు చేతులెత్తేసి.. ప్రతిపక్షాలపై రుద్దేందుకు మార్గాలు వెతకడం నీచాతినీచం. ఆటోమొబైల్ పరిశ్రమ నిలదొక్కుకోవడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం.
గతంలో ప్రభుత్వ విధానాల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధపడేవారు కాదు. సంక్షోభం పెరుగుతున్నకొద్దీ వారు కూడా తమ గళాన్ని సరిచేసుకుని నిరసన తెలియజేస్తుండటం గమనార్హం. ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రిని పరిశ్రమ దిగ్గజాలు కలిసి వాహనాలపై జీఎస్టీ రేటును 28శాతం నుంచి 18కి తగ్గించాలని కోరారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేందుకు ముందుకు వచ్చారంటేనే.. అది సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. అయితే, మోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆర్థికరంగం బాగుంది అన్న రోజే లేదు. ప్రయివేటు పెట్టుబడులు, దేశీయ వినియోగం, ఎగుమతులు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది. మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. కంపెనీలన్నీ కుదేలయ్యాయి. ఉపాధి లేక నిరుద్యోగం పెరుగుతున్నది. ప్రజలనుంచి వసూలు చేసే పన్నులు మాత్రం బాగా పెరిగాయి. కొనుగోళ్లూ తగ్గాయి. దాంతోపాటు వాహనాల అమ్మకాలూ తగ్గాయి. నష్టపోయిన కంపెనీల్లో వాటాదారులు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటుంటే, బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి ప్రభుత్వ ప్రోత్సాహంతో నీరవ్మోడీ వంటివారు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. జీఎస్టీ దేశానికి కొత్త ఊపిరులూదుతుందని అరుణ్జైట్లీ చెప్పిందంతా అబద్ధమేనని తేటతెల్లమవుతున్నది. బడ్జెట్ ప్రవేశపెట్టి నెలరోజులవుతున్నా వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహం లేదు. ఈ నేపథ్యంలో రోజురోజుకు జటిలమవుతున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయత పేరుతో మోడీ సర్కార్ కాశ్మీర్ అంశాన్ని ముందుకు తెచ్చిందన్న అభిప్రాయం ఉంది. సంక్షోభ నివారణకు వడ్డీరేట్ల తగ్గింపు ఒక్కటే సరిపోతుందనుకుంటే అంతకంటే మూర్ఖపు ఆలోచన మరోటి ఉండదు. నయా ఉదారవాద విధాన చట్రంలోంచి బయటపడకుండా అందులోనే పరిష్కారం కోసం వెతుకులాడడం ఎండమావుల వెంట పరుగు తీయడమే. ప్రత్యామ్నాయ విధానాలతోనే ఆర్థికాభివృద్ధి సాధించగలం. ప్రభుత్వం ప్రజల ఆదాయం పెరగడానికి చర్యలు తీసుకోవాలి.