Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పిలుస్తారు. ప్రజల భవిష్యత్తుకు, భద్రతకు సంబంధించిన అనేక చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, మధించి రూపకల్పన చేస్తారని ప్రజలు విశ్వసిస్తారు. కానీ, మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం సాగిన మొదటి పార్లమెంటు సమావేశాల తీరును పరిశీలిస్తే మాత్రం ఆ విశ్వాసం సడలిపోక తప్పదు. లోక్సభలో తమకున్న మూకబలాన్ని, రాజ్యసభలో వివిధ పార్టీలను చీల్చి, వ్యక్తులను లొంగదీసుకుని సంపాదించుకున్న ఆధిక్యాన్ని అడ్డంపెట్టుకుని అధికార భారతీయ జనతా పార్టీ అనేక విలువైన, వివాదాస్పద బిల్లులను హడావిడిగా ప్రవేశపెట్టి ఎలాంటి సమగ్ర చర్చ, పరిశీలన లేకుండా ఆమోదింప చేసింది. ఈ సమావేశాలలో మొత్తం 38బిల్లులను ప్రవేశపెట్టగా, లోక్సభ 36బిల్లులను ఆమోదించింది. ఉభయ సభల్లో 28బిల్లులకు ఆమోదం లభించింది. స్వాతంత్య్రానంతరం ఇంత వేగంగా, ఇంత తక్కువ చర్చ, పరిశీలనలతో బిల్లులు ప్రవేశ పెట్టడం, ఆమోదింప చేయడం ఇదే ప్రథమమంటూ, తాము ప్రజల కోసం పార్లమెంటును పరుగులు తీయిస్తున్నామని కమలనాథులు చంకలు గుద్దుకుంటున్నారు. అయితే వాస్తవం మరో విధంగా ఉంది.
ఈ పార్లమెంటు సమావేశాలలో రెండు అతి ప్రధానమైన ప్రజా వ్యతిరేక విధానాలు చోటు చేసుకున్నాయి. అందులో 1. అతి ప్రధానమైన బిల్లులను సైతం అవసరమైన చర్చ, పరిశీలన లేకుండా ఏకపక్షంగా ఆమోదింపచేయడం. 2. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాయడం.
పార్లమెంటులో సమయాభావం రీత్యా అన్ని బిల్లులను సమగ్రంగా పరిశీలించి, చర్చించే అవకాశం ఉండదు. సంబంధిత అధికారుల ద్వారా అవసరమైన సమాచారం సేకరించి పరిశీలించడం సాధ్యపడదు. కాబట్టి పార్లమెంటులో సమగ్రంగా పరిశీలించి, చర్చించడం సాధ్యం కాని బిల్లులను ఆ పని చేసేందుకు స్థాయీ సంఘాలను, సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ, మోడీ ప్రభుత్వం మాత్రం అసలు వీటి ఉనికినే గుర్తించకుండా నియంతలా వ్యవహరిస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్షాలు ఎంతగా మొత్తుకుంటున్నా ఒక్క బిల్లునైనా స్థాయీ సంఘం, సెలెక్ట్ కమిటీలకు పంపలేదంటే మోడీ ప్రభుత్వం ఎంతటి మూక బలం ప్రదర్శిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
మొదట్లో, తాము సమాఖ్య విధానానికి కట్టుబడి ఉంటామని కాకమ్మ కబుర్లు చెప్పిన మోడీ ఆచరణలో రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించేందుకు పూనుకున్నారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర విభజన, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, సదుపాయాలు, రక్షణలు కల్పించే ఆర్టికల్ 370, 35 (ఏ) రద్దు యిందుకు తిరుగులేని ఉదాహరణలు. కాశ్మీర్ ప్రజల భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయాలను అక్కడి ప్రజలకు, వారి నాయకులకూ చివరకు పార్లమెంటుకు కూడా ఎలాంటి సంబంధం లేకుండా హడావిడిగా, దౌర్జన్యపూరితంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రద్దు చేశారు. ఆ తరువాత పార్లమెంటులో లాంఛనంగా చర్చ సాగించామనిపించింది. అలాగే, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ)కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్ట (సవరణ) బిల్లును కేవలం రెండురోజుల్లో రెండు సభల్లోనూ ఆమోదింప చేసుకున్నారు. దీనివల్ల రాష్ట్రాల పరిధిలోని అంశాలపై దర్యాప్తు అధికారం కేంద్రసంస్థకు లభిస్తుంది. రాష్ట్ర పోలీస్ చీఫ్ ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా అనుమానితుడి ఆస్తులను జప్తు చేసే అధికారం ఎన్ఐఏకు లభిస్తుంది. అలాగే, ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధంలేని వ్యక్తులను సైతం ఉగ్రవాదులుగా గుర్తించి జైళ్లపాల్జేసే నిరంకుశ అధికారం ఎన్ఐఏ సొంతమయ్యింది. రాష్ట్రాల ప్రాతినిద్యాన్ని గణనీయంగా తగ్గించే మోటారు వాహనాల చట్ట (సవరణ) బిల్లు, జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లు, వినియోదారుల హక్కుల పరిరక్షణా చట్ట (సవరణ) బిల్లులను సైతం తమ మూకబలంతో హడావిడిగా అధికార బీజేపీ ఆమోదింప చేసుకుంది. రాజ్యాంగం ప్రకారం ఈ అంశాలన్నీ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ కేంద్రస్థాయిలో నియంత్రణా సంస్థలు లేదా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాల హక్కులను కాలరాచి వ్యవస్థలను కేంద్రం గుప్పెట్లో పెట్టుకునేందుకు మోడీ ప్రభుత్వం బరితెగించింది.
అధికార వికేంద్రీకరణ ద్వారానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. సమాఖ్య స్ఫూర్తి నిలిచి, దేశం సమైక్యంగా ముందుకు సాగుతుంది. కానీ, దేశంలో నియంత పాలన సాగించాలని కలలుగంటున్న కమలనాథులు అన్ని వ్యవస్థలనూ తమ గుప్పెట పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చి, తమకిష్టంలేని రాష్ట్ర ప్రభుత్వాలను యిష్టానుసారం రద్దుచేసి అప్రజాస్వామిక పాలన సాగించాలనుకుంటున్నారు. ఇందుకు వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ లాంటి పార్టీలు సైతం వంతపాడడం గర్హనీయం. బాధిత ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులూ కలిసి ఐక్యంగా ప్రతిఘటించడమే శరణ్యం.