Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజం ఒక పక్కకు ఒదిగి కూర్చుంటే అబద్ధాల ఊరేగింపు అట్టహాసంగా సాగుతోంది. సత్యవాక్పరిపాలన అన్నది కేవలం నినాదంగా మిగిలి అబద్ధం దబాయింపులతో రాజ్యం చేస్తోంది. ఎల్లెడలా అబద్ధాలే నిజాలని భ్రమించేంతగా గొంతు చించుకు కేకలు పెడుతున్నాయి. చారిత్రక సత్యాల గొంతు పిసికి అబద్ధాల వాగాడంబరం వికృతంగా దర్శనమిస్తున్నది. సాంకేతికత పారదర్శకతని అందిస్తుం దని ఆశించడం సహజం. ఇందుకు భిన్నంగా అబద్ధాల ప్యాకేజీని మెదళ్లలోకి చొప్పించే మాయామేయ కుతంత్రం నిర్లజ్జగా పెట్రేగిపో తున్నది. ఏది నిజమో, ఏది అబద్ధమో అనే సంశయాలకు తావు లేకుండా అబద్ధాలే నిజాలని భావించక తప్పని స్థితిలోకి నెట్టివేసిన అసత్యాల వికటాట్టహాసం వర్తమాన రాజకీయ యవనికపై ప్రతిధ్వనిస్తున్నది.
అవసరాల కోసమో, చిన్నపాటి ప్రయోజనాల కోసమో వ్యక్తులు అబద్ధాలాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యవస్థల్ని నడిపేవారు, విధాన నిర్ణేతలు అబద్ధాలతో రాజ్యం చేసే కుత్సితం కడుహేయం. ఇది మొత్తం సమాజానికీ, జాతికీ, దేశానికీ అపారనష్టం. అడుగడుగునా బారికేడ్లతో, తుపాకుల పహరాతో, నిర్బంధాలతో ఒక నేలనీ, జాతినీ బంధించి అంతా ప్రశాంతంగా ఉందని ప్రవచించడం మూకస్వామ్యపు వాచలత్వానికి పరాకాష్ట. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు చట్టసభల్లోనే ఎడతెగకుండా అబద్ధాలు వల్లిస్తుంటే జాతి జాతంతా మౌనంగా కూర్చోడం ప్రజాస్వామ్యానికి ఎంత అవమానం! చరిత్రతో పని లేదంటూ చారిత్రక వాస్తవాల్ని కాలదన్నే దుర్నీతి పాలితుల పట్ల పాలకుల వంచనాపూరిత కుట్రకు నిదర్శనం.
అబద్ధాల పునాది మీద ఒక జాతిని నిర్మించలేరు. ఒక నీతిని రూపొందించలేరు. ఒక కొత్త సంప్రదాయానికి తెరదీయలేరు. అయినప్పటికీ అబద్ధాలు వల్లిస్తూనే నూతన అధ్యాయానికి తెరదీస్తున్నామని చెప్పడం క్రూరపరిహాసం. రాజకీయాల్లోనే కాదు ఆర్థిక రంగంలోనూ, సామాజిక రంగంలోనూ, చారిత్రాకాంశాలలోనూ అంతటా అవాస్తవాలని పనిగట్టుకు ప్రచారం చేసే అబద్ధాల ఊరేగింపు అసలుసిసలు దేశభక్తికీ, కఠోర వాస్తవాలకి పెను సవాల్గా పరిణమించింది. అబద్ధాలతో చెలరేగిపోయే అహంకారానికి చెంపపెట్టు లాంటి సమాధానాలు ఇవ్వలేని ప్రజాప్రతినిధుల నిష్క్రియాపరత్వం ముందు సత్యం చిన్నబోయింది.
నిజాలు మాట్లాడాల్సిన మీడియా అబద్ధం పాదాల ముందు సాగిలపడింది. అబద్ధమే శిరోధార్యంగా భావించే నీచస్థితికి దిగజారింది. సోషల్మీడియాని సైతం అబద్ధాల బేహారులు ఆక్రమించిన దృశ్యం భయానకం. నిజాలు మాట్లాడటమే నేరంగా పరిగణించే ప్రమాదం కనిపించని కంచెలని నాటుతున్నది. అబద్ధాల్ని విని, అబద్ధాల్ని జీర్ణం చేసుకొని, అబద్ధాల్నే నిజాలుగా నమ్మి, తిరిగి ఆ అబద్ధాలనే వల్లించే మనుషులు కావాలి రాజ్యానికి. వాటిని తయారు చేసే యంత్రభూతములే పత్రికలు, టీవీలు, ఇంటర్నెట్లు, మొబైళ్ళు. అయినప్పటికీ నిజం చాటుమాటుగా ఎక్కడో పొక్కుతుందోనని, నివురుగప్పిన నిజం ఎక్కడ రగులుతుందోనని రాజ్యం వణికిపోతున్నది. అందుకే మంచులోయలో నిజాలకు పాతరవేసింది. తమ చర్యల్ని చెప్పి ఒప్పించలేని నిస్సహాయ, నీరస స్థితిలో మొబైళ్ళ మీద, చానళ్ళ మీద విధినిషేధాలకు ఒడిగట్టింది.
సత్యం గొంతు మీద కాలుపెట్టి అబద్ధం తాండవం చేస్తున్న దృశ్యమే కనిపిస్తుంటుంది. అంతమాత్రాన సత్యం మరణిస్తుందా? సజీవమైన సత్యం ఊపిరి పీల్చుకోడానికి ప్రయాస పడుతున్న వైనం నిజం. గొంతు నొక్కే అబద్ధపు పాదాల్ని నెట్టివేసే బలం ఏదో సత్యంలో అంతర్నిహితమై ఉంటుంది. అది సత్యానికి ఉన్న నిజాయితీ. నిజంలో దాగి వున్న నిర్భీతి. సత్యానికి మరణం ఉండదు. అబద్ధం చరిత్ర చెత్తకుప్పలో బూడిదవడం ఖాయం. గోబెల్స్కు మించిన ప్రచారంతో అబద్ధాల ప్రచార దళాలు ఎంతగా గందరగోళానికి లోను చేసినా సత్యం మాసిపోదు. నిజాలకు మకిలీ అంటదు. అబద్ధం ఎంత గట్టిగా గొంతు చించుకుంటే నింపాదిగా ఉన్న నిజం అంతగా తన బలాన్ని సంతరించుకుంటుంది. తన పునాదుల మీద తాను కచ్చితంగా నిలబడుతుంది. చుట్టూ చేరిన అబద్ధాలు ఎంత చెలరేగినా నిశ్చలంగా ఉండే నిజం చెక్కుచెదరదు. తనలోని సారాన్నీ, సారాంశాన్నీ కోల్పోదు.
భూమి గుండ్రంగా ఉందన్న కోపర్నికస్ చెప్పిన నిక్కమైన మాటే గెలిచి నిలిచింది. నిజం చెప్పినందుకు అతణ్ణి హతమార్చిన పాలకులు మట్టిగొట్టుకుపోయారు. చరిత్రలో రక్తమోడుతూ నిలబడిన నిజాలు కొత్త తరాలకు ఉద్దీపన ఇచ్చాయి. నిక్కమైన సత్యం ముందు అబద్ధం ఓడిపోక తప్పదన్నది చరిత్ర చెబుతున్న పాఠం. హిట్లర్, ముస్సోలినీల దురహంకారాన్ని సత్యానికి బద్ధులైన వారి పోరాటాలే మట్టి కరిపించాయి. చరిత్రలోనే కాదు వర్తమానంలోనూ సవాళ్ళు విసురుతున్న శక్తులు, వ్యక్తులు లేకపోలేదు. అందుకే బేజారెత్తిన పాలక తంత్రం వ్యక్తుల్నీ, సంస్థల్నీ చెరబట్టే దురుసుచట్టాలతో బెదిరిస్తున్నది.
చారిత్రక సత్యాలు తెలిసినా వర్తమానం కలవరపెట్టక మానదు. కపటత్వంతో, అబద్ధాలతో, వంచనతో శాసించే దుర్మార్గపు దుష్ప్రవర్తన ఆందోళనకు లోను చేస్తుంటుంది. నిత్యం అసత్యాల్ని వల్లె వేసే పాలక తంత్రపు నైచ్యం ఏహ్యత కలిగిస్తున్నది. విభజనవాదులు, విద్రోహులు దేశభక్తులుగా చెలామణయ్యే కపట నాటకాన్ని సమర్థించే కళాకారుల, రచయితల, సినిమావాళ్ళ వినయవిధేయతల ప్రదర్శన రోత పుట్టిస్తున్నది. అబద్ధాల మీద బతుకుని వెళ్లబుచ్చే కుహనా దేశభక్తుల, నీతిపరుల లొంగుబాట్ల పర్వం ముసుగులు తొలగిస్తున్నది. అసలు సిసలు దేశభక్తులెవరో, అబద్ధాల ఊరేగింపులో కలిసిపోయినవారు ఎవరో, తెలిసిపోతున్నది. నిప్పులాంటి నిజాల పక్షాన నిలబడేవారి స్థయిర్యం, ధైర్యం నికార్సయిన సత్యానికి నిండయిన బలం.