Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భావజాల రంగంలో ప్రజలకు వాస్తవిక దృష్టిని అందించే శక్తులకిది గడ్డుకాలం. అవాస్తవాలే వార్తలుగా చలామణీ అవుతూ ప్రజల ఆలోచనలను నియంత్రిస్తుంటే... నిజాలు వెలుగు చూడటమే గగనమైపోయిందన్న ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతుంటే... ఇప్పుడు నిజాలు మాట్లాడటమే ప్రమాదకరంగా పరిణమించడం ఈ దేశంలో భావప్రకటనా స్వేచ్ఛకు పెను సవాలుగా మారింది. ఇందుకు మరో తాజా ఉదాహరణే అనురాగ్ కశ్యప్ ప్రకటన. ''స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే అవకాశమే లేనప్పుడు, నేను ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిది. అందుకే నేను ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నా'' అని ఆయన నిష్క్రమించారు. ఇది అభిప్రాయాల గొంతు నులుముతున్న అరాచక శక్తుల వికృతాలకో తార్కాణం. దేశంలో కనుమరుగవుతున్న ప్రజాస్వామిక వాతావరణానికో నిదర్శనం.
అందుబాటులోకొచ్చిన డిజిటల్ వ్యవస్థ ద్వారా భారతీయ సినిమాను ప్రజాస్వామ్యీకరించాలనీ, ప్రజలకు చేరువ చేయాలనీ కోరుకునే వ్యక్తుల్లో అనురాగ్ కశ్యప్ ఒకరు. బాలీవుడ్లో సామాజిక స్పృహ కలిగిన ప్రతిభావంతుడైన దర్శక నిర్మాతగా అతడు సుపరిచితుడు. ఆయన తన అభిప్రాయాలతో ఏకీభవించే తోటి అభ్యుదయ శక్తులు, సినీ దిగ్గజాలైన శ్యామ్బెనగల్, మణిరత్నం, శుభా ముద్గల్ మొదలైన 49మంది ఫిల్మ్మేకర్స్తో కలిసి, దేశంలో ''జైశ్రీరామ్'' పేరుతో జరుగుతున్న మూకదాడులపై ప్రధానికి బహిరంగ లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ, వారు ఈ దేశానికి చెందిన పౌరులుగా, మేధావులుగా, సృజనకారులుగా తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి స్పందించడమే పెద్ద నేరమైపోయింది. వెంటనే దీనికి ప్రతిగా మరో 60మంది సినీ ప్రముఖులు హేతువుకు నిలబడని కారణాలతో వారిని ఖండిస్తూ మరో బహిరంగ లేఖతో దాడికి దిగారు. రెచ్చిపోతున్న మూకస్వామ్యానికి నెత్తురోడుతున్న మనుషుల పట్ల చలించి స్పందించిన మానవీయతపై అమానవీయంగా దాడికి దిగిన ఈ వైనం రోతపుట్టిస్తోంది. అయినప్పటికీ తప్పు పట్టలేం! ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడించే స్వేచ్ఛ, హక్కు అందరికీ ఉంది గనుక. కానీ ఈ పేరుతో వారిపై మానసికమైన దాడులకు పూనుకోవడం, భయబ్రాంతులకు గురిచేయడం మాత్రం అప్రజాస్వామికం. అనురాగ్ కశ్యప్, మణిరత్నం తదితర 49మంది ప్రముఖులపై హిందూమహాసభ బహిరంగ హెచ్చరికలకే తెగబడింది. ఏకంగా వారిపై కోర్టులో కేసులు పెట్టి వేధింపులకు దిగింది. దీనికితోడు ఈ శక్తులే సామాజిక మాద్యమాలలో వారిపై బెదిరింపుల దాడికి పూనుకోవడం ఆందోళనకరం. ఈ నేపథ్యంలోనే అనురాగ్ కశ్యప్ ఈ ప్రకటన చేయాల్సి రావడం విచారకరం.
ఆయన తల్లిదండ్రులను చంపేస్తామనీ, ఆయన కుమార్తెపై లైంగికదాడి చేస్తామనే బెదిరింపుల తీవ్రత పెరిగినట్టు ఇటీవల మీడియాలో వార్తలొచ్చాయి. ఇప్పుడు వీటిని ధృవీకరిస్తూ ఆయన చేసిన ప్రకటన ఇలా ఉంది. ''ఆన్లైన్లో నా తల్లిదండ్రుల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వారిని చంపుతామనీ, నా కుమార్తెపై లైంగికదాడి చేస్తామని బెదిరిస్తున్నారు. దేశంలో దొంగల పాలన నడుస్తున్నది. ఇక మనం దానికే అలవాటుపడాలి కాబోలు. ఈ నవభారత్లో మీరంతా సంతోషంగా బతకగలుగుతారని ఆశిస్తున్నా. అభిప్రాయాలను వెల్లడించే అవకాశమే లేనప్పుడు మౌనంగా ఉండటమే మంచిది. అందుకే నేను ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నా.. ఇదే నా చివరి ట్వీట్. గుడ్బై...'' భయాందోళనల చెరజిక్కిన భావస్వేచ్ఛకు ప్రతీక ఈ ప్రకటన.
మూడేండ్ల క్రితం జరిగిన మరో సృజనశీలి, ప్రగతిగామి అయిన ప్రఖ్యాత తమిళ రచయిత మురుగదాస్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోందీ సంఘటన. రాచరిక వ్యవస్థలోని రాణివాసపు అకృత్యాలను కండ్లకు కడుతూ ఆయన రాసిన ''అర్థనారి'' (తెలుగులో)పై కూడా ఇవే శక్తులు కన్నెర్రజేశాయి. ఆయనపై భౌతికంగా దాడిచేసి గాయపరిచాయి. ఆ రచనను నిషేధించాలని గోల చేశాయి. చివరికి న్యాయస్థానమే ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పినా.. ఈ అరాచక పరివారం సృష్టించే భయాందోళనల ముందు ఆ తీర్పు భరోసానివ్వలేకపోయింది! అందుకే, ఆయన తనలోని ''రచయిత'' చచ్చిపోయాడని ప్రకటించి బతికిపోయాడు. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ కూడా అదే చేశాడు. ఈ మూకలకూ, ఈ మూకల వెనుకున్న శక్తులకు కూడా కావాల్సింది అదే. లేకుంటే ఇంకెత మంది కల్బుర్గీలను, పన్సారీలను, దబోల్కర్లను, గౌరీలంకేశ్లను బలి తీసుకుంటారో తెలియదు!
అభిప్రాయాలను బంధించే అడ్డుగోడల నిర్మాణం వేగంగా సాగిపోతుందన్నది ఈ ఉదంతాలన్నీ స్పష్టం చేస్తున్న నిజం. ఈ రాజ్యానికి తాము ప్రభోదించే అబద్ధాలనే నమ్మి, ఆ అబద్ధాల్లోనే మనుగడ కొనసాగించే మనుషులు కావాలన్నది అంతకంటే నిజం. అందుకు నిజాన్ని నినదిస్తున్న అభిప్రాయాల్ని నియంత్రించే ప్రయత్నమే ఈ అడ్డుగోడలు. కానీ అభిప్రాయాల కోసం బాధల్ని లక్ష్యపెట్టని వాళ్లు ఈ గోడల్ని బద్దలు కొడతారు. వేల సంవత్సరాల ఈ సమాజ పురోగమనాన్ని వెనక్కి మళ్లించే కుట్రలను కూకటివేళ్లతో సహా పెకిలిస్తారు. ఎందుకంటే సమాజమెప్పుడూ ముందుకే సాగుతుంది. ఈ చారిత్రక సత్యాన్ని ఏ అబద్ధమూ నిరోధించలేదు. ఏ అడ్డుగోడలూ బంధించ లేవు.