Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలపై ముప్పేటదాడి జరుగుతున్నది. మరీ ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉన్నది. ప్రభుత్వాల పెను విధానాలతో బతుకీడిస్తున్న ప్రజలను.. వాయు, ఆహార, నీటి కాలుష్యాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడేమి జరుగనుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరవు తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నా చాలా దేశాలు ఎంతోకొంత దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే మనదేశంలో మాత్రం సమస్య తీవ్రమవుతున్నా పట్టించుకోకుండా ప్రాణాలతో చెలగాటమాడు తుండటం గమనార్హం. కలుషిత నగరాలు ఎక్కువగా ఉన్న భారతదేశంలో 2017లో 12.4లక్షలమంది మరణాలకు వాయు కాలుష్యమే కారణమని ది లాన్సెట్ ప్రకటించింది. వాయు కాలుష్యంతో చిన్నారుల ఎదుగుదల కూడా మందగిస్తున్నదని ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ సెంటర్, టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా నివేదికలో వెల్లడైంది. చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించకుంటే భవిష్యత్కే ప్రమాదమన్న పరిశోధకుల హెచ్చరిక యిక్కడ గుర్తించాల్సి ఉంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులు కూడా రోగాలకు కారణమవుతున్నాయి. యిందులో ప్రభుత్వాల విధానాలే అత్యధికం.
ఐక్యరాజ్యసమితి, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ సంస్థలు కూడా ఆహార, నీటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. యిప్పటికే ప్రపంచవ్యాప్తంగా 320కోట్లమంది ఆహార, నీటి సరఫరా సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, రానున్న కాలంలో ఈ సంఖ్య పెరుగుతుందని ఇటీవలి ఓ సమావేశంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. పెట్టుబడిదారుల ధనదాహానికి, పాలకుల నిర్లక్ష్యానికి, అధికారుల అవినీతికి, నీటి కాలుష్యం రోజు రోజుకు ప్రమాదకరంగా మారింది. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అంతెందుకు వ్యవసాయ పంటలకు వాడే రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకంతో నదులు, భూగర్భ జలాలు, భూసారం, తాగునీరూ సర్వం కలుషితమయం. ఆహార ఉత్పత్తులపైనా ప్రభావం పడింది. పంటల దిగుబడి తగ్గిపోతున్నది. ఉత్పత్తిరంగంలోనూ దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకటించింది. అభివృద్ధి పేరిట కార్పొరేట్ సంస్థలకు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితికి మూలహేతువు. నిబంధనలకు విరుద్ధంగా సహజ వనరులను దోపిడీ చేయడంతో పాటు పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్నా పాలకవర్గాల్లో స్పందన నామమాత్రమే. పైగా అడ్డుకునేందుకు పోరాడుతున్న సంస్థలు, వ్యక్తులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్లకే కొమ్ముకాస్తున్నాయి. గిరిజనులను వెళ్లగొట్టి అడవులను కార్పొరేట్లకు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. ఫారిస్ ఒప్పందాన్ని నీరుగార్చిన అమెరికా, యూరప్దేశాలు తమ దేశాల్లో ప్రజారోగ్యంపై దృష్టిపెట్టడం గమనార్హం.
దేశ ఆర్థికాభివద్ధి రేటు కొత్త పుంతలు తొక్కుతున్నదని గొప్పలు పోతున్న మోడీ ప్రభుత్వం కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్న ప్రజల గురించి ఆలోచిస్తున్నదెక్కడీ బీహార్లో 150మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధికి బలయ్యారు. రెండేండ్లక్రితం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో 600మంది పిల్లలు మెదడువాపు వ్యాధితోనే మరణించారు. వచ్చే రోగాలన్నీ నీటి కాలుష్యం వల్లే. అత్యధిక జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. తినే ప్రతి ఆహార పదార్థమూ కల్తీ మయమే. దేశంలోని 20రాష్ట్రాలకు చెందిన 203జిల్లాల్లో ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలుగా గుర్తించారు. అంతేకాదు, దేశంలో ఏ ప్రమాణాలూ పాటించని ఆహారోత్పత్తి సంస్థలు 23లక్షలకు పైగా ఉన్నాయి. స్వచ్ఛ భారత్తో పరిశుభ్రత పెరుగుతుందంటున్న కేంద్రప్రభుత్వం.. వేగంగా కమ్ముకొస్తున్న వాయుకాలుష్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛభారత్తో లబ్ది ఎంతవరకన్నది పక్కనబెడితే, ప్రస్తుత పరిణామాలతో ఆ పథకం అందని ద్రాక్షలాంటిదే. వాయు కాలుష్య నిరోధం, నియంత్రణ చట్టాన్ని భారత్ 1981లో ఆమోదించింది. కానీ, అందులో ప్రజా ఆరోగ్యాన్ని ప్రస్తావించనే లేదు. ఈ చట్టం కాలుష్యాన్ని ఒడిగట్టేవారికే అనుకూలంగా ఉందనీ అర్థమవుతున్నది. వాయు కాలుష్యంపై విజయవంతంగా పోరాడిన దేశాలు ప్రజా ఆరోగ్యాన్నే ప్రధానంగా తీసుకున్నాయి. మన ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ చట్టాన్ని సవరించాలని ఎంతోమంది కోరుతున్నా పాలకులు పెడచెవిన పెడ్తున్న పరిస్థితి. ప్రజల హక్కులను హరించే చట్టాలను తీసుకొస్తున్న మోడీ ప్రభుత్వం ప్రాణాలను నిలిపే చట్టాలను అమలు చేయడం అవసరం. అందుకు పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. దేశవ్యాప్తంగా వాయు కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి. ప్రజలకు మేలుచేసే చట్టాలకు పదునుబెట్టే రీతిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే పరిష్కారం.