Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాల రాజకీయ విన్యాసాలు ఆందోళనకరం. ప్రజా పరిపాలనను గాలికొదిలేసి, కార్పొరేట్లకు మద్దతునివ్వడం, వారి అడుగులకు మడుగులొత్తుతూ రూపొందించిన చట్టాలను యిష్టారాజ్యంగా రద్దుచేస్తూ రాజకీయక్రీడకు శ్రీకారం చుట్టారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడుతూ ప్రమాదకర చర్యలకు పూనుకుం టున్న వైనానికి, ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం. మతం పేర సామాన్య ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, విభజించి పాలించే బ్రిటిష్ రూల్ను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. తెలుగు రాష్ట్రాల పాలకపార్టీలు ఈ ప్రమాదాన్ని గుర్తించకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా టీఆర్ఎస్ విషయానికొస్తే, ఎన్నికల ముందు ఒకలా, తర్వాత మరోలా వ్యవహరిస్తున్నది. దేశానికి ప్రమాదకర శక్తులు బీజేపీ, కాంగ్రెస్లేనని చెప్పిన టీఆర్ఎస్ స్వరంలో మార్పు స్పష్టంగా వినిపిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రాల హక్కులు, అధికారాలను సైతం తనకు దఖలు పరుచుకునే ప్రయత్నంలో అనేక చట్టాలను ఏకపక్షంగా రద్దుచేసింది.
ప్రత్యేక ప్యాకేజీ కోరుతున్న తెలంగాణతోపాటు ప్రత్యేక హోదా ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పార్లమెంటులో కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్ను ఎత్తేయడానికి మోడీ సర్కారుకు తోడ్పడ్డాయి. తద్వారా తాము కూర్చున్న కొమ్మను తాము నరుక్కోవడమే అయ్యింది. ఇలా అనేక ప్రజా వ్యతిరేక బిల్లులు, రాష్ట్రాల హక్కులను హరించే చర్యలకు బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండూ మద్దతునిచ్చాయి. ప్రధానంగా సమాచార హక్కు చట్టం కోరలు పీకేసీ, తాము ఆడిందే ఆటా పాడిందే పాటగా ప్రభుత్వాన్ని నడపాలని భావించారు మోడీ, షా ద్వయం. టీఆర్ఎస్, వైసీపీల మద్దతును కూడగట్టుకుని ప్రజావంచకంగా వ్యవహరించారు. ఆ బిల్లు సవరణతో ఆర్టీఐ కమిషనర్ల వ్యవహారాలకు సంబంధించిన అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోయాయి. కమిషనర్ల జీతభత్యాలను నిర్ణయించడంతోపాటు, ఆ పోస్టుల పదవీకాలాన్ని ఎప్పుడంటే అప్పుడు కుదించే అధికారం, కమిషనర్లను యిష్టారాజ్యంగా తొలగించే, మార్చే అధికారాన్నీ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది. రాజ్యసభలో సమాచార బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరిన టీఆర్ఎస్, ఆ తర్వాత లోక్సభలో మాటమార్చి యూటర్న్ తీసుకుని బీజేపీకి ఓటేసింది. అంటకాగింది. తలొంచింది. ప్రశ్నించడం మానేసింది.
ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మయిన హైదరాబాద్లోని ధర్నాచౌక్ను రద్దు చేయడం ద్వారా టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలను తనంతట తాను బయటపెట్టుకుంది. దీనిపై ప్రజాఉద్యమాలు వెల్లువెత్తి ధర్నాచౌక్ తిరిగి తనగొంతును వినిపిస్తున్నది. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు రాష్ట్ర రాజధానిలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ''ప్రశ్నించే హక్కు.. ప్రాథమిక లక్షణం'' అని వ్యాఖ్యానించారు. మరో అడుగు ముందుకేసి ''నాతో ఉంటే దేశభక్తుడు.. లేకుంటే దేశద్రోహి ముద్ర'' అనే రీతిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు వ్యవహరిస్తున్నదని కూడా విమర్శించారు. మంచిదే. ఆశ్చర్యంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ప్రజలకు ఊతమిస్తున్న ఆర్టీఐ చట్టం కోరలు పీకేందుకు ఓటేసిన అంశం యిక్కడ గమనార్హం. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విషయంలో ఒక్కమాటా మాట్లాడకపోవడం, హుటాహుటిన ప్రత్యేకవిమానంలో తన ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ని ఢిల్లీకి పంపి అనుకూలంగా ఓటేయించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రజావ్యతిరేక చట్టాలు, బిల్లుల విషయంలో బీజేపీని పార్లమెంటులో ప్రశ్నించకుండా, పోరాడకుండా ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడగలు గుతారు? రాష్ట్రాల హక్కులను ఎలా రక్షించగలుగుతారు? బీజేపీ తెచ్చిన ఆర్టీఐ చట్టంలోని నిబంధనలు ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏవిధంగా నష్టమో సవివరంగా చెబుతూ కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ తెలంగాణ, ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖలు రాశారు. అయినా ఆయా రాష్ట్రాల సీఎంలకు చీమకుట్టినట్టయినా అనిపించలేదు సరికదా తమ అధికారాలను తామే కేంద్రానికి అప్పగించడంతోపాటు కాశ్మీర్ ప్రజలకు సమాచార హక్కు చట్టమే లేకుండా చేసిన చరిత్ర బీజేపీది, దానికి మద్దతిచ్చిన టీఆర్ఎస్, వైసీపీది కూడా. రాష్ట్రానికి ఆయా సమస్యల పరిష్కారం కోసం నిధులను రాబట్టడంతోపాటు నిజామాబాద్ ప్రజల చిరకాల కోరికయిన పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రాన్ని నిలదీయడంలో టీఆర్ఎస్ విఫలమైంది. దేశంలో మతసామరస్యాన్ని చెరబడుతూ, యావత్ కాశ్మీర్ను ఓపెన్ ఎయిర్ జైల్ చేసిన బీజేపీకి వత్తాసు పలకడం ద్వారా టీఆర్ఎస్ ద్వంద్వ విధానాన్ని పాటిస్తున్నది. ఈ సంగతిని ప్రశ్నించడంలో తెలంగాణ రాష్ట్రాధినేత మిన్నకుండి పోతున్నారు. బీజేపీ వికృత చేష్టలను, చర్యలను ప్రశ్నించడంలో, అడ్డుకోవడంలో టీఆర్ఎస్ పాత్ర అంతంత మాత్రమే... పైపైన తిట్టడం, కీలకాంశాల్లో చేతులు కలపడం, కారు కిందకు నీళ్లు రావడం ఖాయమని రాజ కీయ విశ్లేషకులే సెలవిస్తున్న సంగతి పరిశీలనలో ఉండాలి సుమా..!