Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతోష్ణ స్థితిలో సంభవించే మార్పుల పర్యవసానంగా వాతావరణంలో పెనుసంక్షోభం ఏర్పడుతుంది. ఇది కోట్లాది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుందని 'క్లైమేట్ చేంజ్ అండ్ లాండ్' అనే అంశం పైన ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్, వరల్డ్ రిసోర్సెస్ సెంటర్ ఇన్స్టిట్యూట్ గత వారంలో విడుదల చేసిన నివేదికలు తెలియజేశాయి. వ్యవసాయ భూమి నిర్వీర్యమై పంటలకు పనికిరాకుండా పోవటంతో దానిపై జీవించే 82కోట్లమంది జీవనోపాధి కోల్పోతారని ఈ నివేదికలు వివరిస్తున్నాయి. రాబోయే దశాబ్దాలలో వ్యవసాయభూమి నిర్వీర్యమైన ప్రాంతాలలో, ఎడారిగా మారిన ప్రాంతాలలో లేక దగ్ధమైన అడవులన్న ప్రాంతాలలో పెనుతుఫానులు, టోర్నాడోలవల్ల, వరదల కారణంగా 300కోట్లమంది ప్రజల జీవనం దెబ్బతింటుంది.
వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్కి చెందిన అక్వెడక్ట్ ప్రాజెక్టు నివేదికను అనుసరించి మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాలలో ప్రపంచ జనాభాలో నాల్గవ వంతు ప్రజలు నివసిస్తున్న 17దేశాలలో తాగునీటి సంక్షోభం ఏర్పడుతుంది. కరువులు సంభవిస్తాయి. ఇవి వరదలకంటే నాలుగు రెట్లు ఎక్కువగా నష్టాలను కొనితెస్తాయి. వీటితో నిరోధించగలిగే రోగాలు ప్రబలుతాయి. పంటలు నాశనమవుతాయి. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. వందల కోట్ల ప్రజలు వలస పోవలసి వస్తుంది. అలా ప్రజలు వలసగా పోయిన అనేక ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడుతుంది.
గత వందేండ్లకుపైగా బొగ్గును, చమురును, సహజ వాయువును కాల్చటం కారణంగా పెరిగిన భూతాపంవల్ల ఈ సామాజిక సంక్షోభాలు తలెత్తాయి. సారవంతమైన భూమి ఎడారిగా మారటం, సముద్ర మట్టాలు పెరిగి తీరప్రాంతాలు కనుమరుగవటం, నేలలో ఘనీభవించి వుండే మంచుపొర(పర్మాఫ్రాస్ట్) కరగటంతో కుంగిపోయే నగరాలు, తదితర మార్పులన్నీ శీతోష్ణస్థితిలో వస్తున్న మార్పులవల్లేనని అనేకవందల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ మార్పులు అంతర్భాగంగా వున్న విస్తృత ప్రక్రియల కారణంగా గత దశాబ్దంలో వడగాడ్పులు తీవ్రమయ్యాయి. అలాగే హిమానీనదాలు (గ్లేసియర్స్) వేగంగా కరగటం జరుగుతోంది. శిలాజ ఇంధనాలను కాల్చటం వల్ల విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ వాయువు భూమి ఉపరితలంపై కప్పబడిన దుప్పటిగా మారటంతో భూమి ఉష్షోగ్రత పెరుగుతోంది.
భూగోళ వాతావరణంలోకి నిరంతరంగా గ్రీన్హౌస్ వాయువులు విడుదలవుతున్నందున భూతాపం 1980వ దశకం నుంచి పెరుగుతోంది. ప్రస్తుతం భూగోళ శీతోష్ణ స్థితి ఒక గుణాత్మక దశలోకి ప్రవేశించింది. గత 50ఏండ్లలో భూవాతావరణాన్ని ప్రభావితం చేయటంలో పారిశ్రామిక కార్యకలాపాలు భూభౌతిక ప్రక్రియలతో పోటీపడ్డాయి. దీనితో భూవాతావరణంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు మరింత వేగవంతమవుతాయని అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హెచ్చరించింది. కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా పర్మాఫ్రాస్ట్ను కరిగేలాచేసే భూభౌతిక ప్రక్రియను భూతాపం వేగవంతం చేస్తుందని ఆ సంస్థ అంచనా.
ఈ రెండింటి కలయికతో భూమి 'ఉష్ణగృహం'గా మారే ప్రమాదం పొంచి వుంటుంది. దీనితో శిలాజ ఇంధనాలను కాల్చటంతో ఇక ఏమాత్రం ప్రత్యక్ష ప్రమేయంలేకుండా భూతాపం వేగంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిని నియంత్రించటం ఆధునిక విజ్ఞానశాస్త్ర సాంకేతికతకు కష్టమవుతుంది. దీని పర్యవసానాలు ప్రళయభీకరంగా ఉంటాయి. గత దశాబ్దంలో వాతావరణంలో సంభవించిన తీవ్ర వాతావరణ పరిణామాలు ముందుముందు రాబాయే భయంకరమైన ఉప్పెనలకు, దీర్ఘకాల వడగాడ్పులకు, కరువుకాటకాలకు, నిరంతరం చెలరేగే దావానలాలకు పురోభావి సూచికలే. ప్రపంచ వ్యాప్తంగావున్న కోరల్ రీఫ్స్ చనిపోతాయి. ఆహార గొలుసులో కొన్ని ప్రముఖ భాగాలు ఎగిరిపోతాయి. హిమానీనదాలు కరగటంతో సముద్రమట్టాలు పెరుగుతాయి. పర్యవసానంగా మూడవ వంతు ప్రపంచ జనాభా నివసిస్తున్న తీర నగరాలను సముద్రం నీరు ముంచెత్తి వందల కోట్ల ప్రజల మరణానికి కారణభూతమౌతుంది. భూమిపై నివసించే ప్రాణులలో కనీసం 10లక్షల ప్రాణులు మరణిస్తాయి. ప్రపంచంలో ఒక ఖండంతో సమానమైనంత ప్రాంతం మానవ నివాసానికి యోగ్యం కాకుండా పోతుంది.
కార్బన్ ఉద్గారాల విడుదలను తక్షణం ఆపేందుకు అవసరమైన నూతన సాంకేతికతను అభివృద్ధి చేయాలని, రవాణా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ప్రపంచంలో విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని పున్ణవ్యవస్థీకరించాలని శాస్త్రవేత్తలు రూపొందించిన అనేక నివేదికలు విజ్ఞప్తి చేశాయి. అయినప్పటికీ వాతావరణంలోకి విపరీతంగా కలుషిత ఉద్గారాలను విడుదల చేస్తూ ఈ మార్పులకు కారణభూతమైన అభివృద్ధిచెందిన పెట్టుబడిదారీ దేశాలు తాము చేయగలిగినంత చేయటం లేదు. ఇందుకు ఉదాహరణగా 2020 సంవత్సర బడ్జెట్లో వాతావరణ పరిశోధనలపై చేస్తున్న కేటాయింపులను 84శాతంవరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుదించాడు. వాస్తవంలో పెట్టుబడిదారీ లాభాల వేటకు, పర్యావరణ క్షీణతకు అవినాభావ సంబంధం ఉంది. అంటే రెండవది ఆగాలంటే మొదటిది పోవాలి. అంటే మానవాళి మనుగడకు ఈ భూమి కలకాలం పదిలంగా ఉండాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దు కావటమనేది ఒక అనివార్య ఆవశ్యకత అనేది సుస్పష్టం.