Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మనుషులను విడిచిన మానవత్వం
ఎగురుకుంటూ.. ఎగురుకుంటూ...
వినువీధిని చేరి.. మేఘాలను తాకి ఘర్షణ కలిగించింది
ఆ ఘర్షణల ఒరిపిడిలో రాలుతున్న చినుకులు తుఫానుగా మారి
జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి'' అన్నారొక కవి. అవును. ఇప్పుడు ఆ మానవత్వమే ప్రశ్నార్థకమైంది. మనుషుల్లో వెతుక్కోవాల్సి వస్తున్నది. వస్తువులకు ఇచ్చిన విలువ కూడా సాటి మానవులకు ఇవ్వలేని అత్యాధునిక జీవితంలో బతుకుతున్నాం. ఇతరులకు కాస్త ప్రేమా ఆప్యాయతా పంచే స్వభావం క్రమంగా కొరవడుతున్నది. ఈ వైజ్ఞానిక యుగంలో మనిషి పక్షిలా ఎగరడం, చేపలా ఈదడం, కోకిలలా పాడటం, నెమలిలా నాట్యం చేయడం ఇలా తనవి కానివన్నీ పట్టుబట్టి నేర్చుకుంటున్నాడు. తనకు సహజ సిద్ధమైన మానవత్వాన్ని మాత్రం మరిచిపోవడం ఆందోళనకరం. కండ్ల ముందే దారుణాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న ఉదంతాలు ప్రసార మాధ్యమాల్లో నిత్యం చూస్తూ రావడం బాధాకరం.
''ఏ కులము వెన్నెలది? తుమ్మెద లెట్టి జాతికి చెందినట్టివి/అట్టిదే కదా మానవత్వము అన్నిటికీ ఎత్తైన సత్వము'' అంటారు సినారె. కుల మతాల్లో ఏముంది... సాటి మనిషికి సాయం చేసే గుణముండాలి గానీ. కష్టాన్ని చూసిన హృదయం, ఇంకొకరి కోసం నిరీక్షించకుండా తక్షణమే సహాయం చేసేలా స్పందించడం నిజమైన మానవత్వం. అందుకే సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మతం గొప్పదా? మానవత్వం గొప్పదా? అంటే కొన్నిసార్లు మన అనుకునే వారిని కూడా దూరం చేసేది మతం. ఏ మనిషినైనా దగ్గర చేసేది మానవత్వం. మతానికీ, మానవత్వానికీ ఉన్న తేడా అది! మతపరమైన భావనలు ఎంతగా ఉన్నా సాంఘిక దృక్పథం సమాజంలో బాగా కొరవడిందని నేడు ఎన్నో దృష్టాంతాలు రూఢ చేస్తున్నాయి. అయితే మానవ సంబంధాలకు విలువ తగ్గిందనీ, పట్టణ సంస్కృతి పెరిగాక ఎవరి జీవితం వారిది అన్నట్టుగా తయారైందనీ, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఓదార్చే చెయ్యి కూడా కరువవుతోందనీ కొందర్నుంచి ఆవేదన వ్యక్తమవుతున్నది. ఇది వాస్తవమే..! వినిమయసంస్కృతి యథేచ్ఛగా విస్తరిస్తున్న ఈరోజుల్లో కుటుంబ బాంధవ్యాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఒకర్నొకరు ఆప్యాయంగా పలకరించుకునే రోజులు రోజురోజుకూ దూరమవు తున్నాయి. 'నెట్టింట్లో' చొరబడ్డాక పక్కింట్లో ప్రమాదాలు సంభవించినా పట్టడం లేదు. ప్రాణాలు పోతున్నా లెక్కలేదు. ఆ ప్రమాదం మనల్ని మీటినప్పుడుగానీ తెలుసుకోలేని స్థితికి పడిపోవడం విచారకరం. అంతెందుకు.. పక్కపక్కనే కూర్చుని కూడా మెస్సేజ్లలో మాట్లాడుకోవడం దిగజారిపోతున్న మానవ సంబంధాలను ఎత్తిచూపుతున్నది. వ్యాపార సంస్కృతి వలయంలో చిక్కుకోవడం దీనికో కారణమైతే.. 'ఎవరికేం అయితే నాకేంటి. నేను లాభపడ్డానా లేదా..' అనే దృక్పథం మరో ప్రధానాంశం. సమాజంలో డబ్బే అన్నింటికీ మూలం అనే వాతావరణం ఆవహించడం కుంచించు కుపోతున్న విలువలూ, వాటి పర్యవసానాలను తేటతెల్లం చేస్తున్నది. మనకు తెలియకుండానే మన వంట గదిలోకి చొరబడిన ప్రపంచీకరణ ప్రభావంలో కొట్టుమిట్టాడుతున్నాం. పప్పుదినుసులు తినే స్టేజీ నుంచి పిజ్జాలను ఆరగించే సంస్కృతిలోకి అడుగుపెట్టాం. ఎదురుగా ఎన్ని ఘోరాలు సంభవిస్తున్నా ఫొటోలు, వీడియోలు తీస్తూ లైకులు, షేర్ల కోసం పాకులాడే పరిస్థితి దాపురించింది. శవం పక్కన కూడా సెల్ఫీలు తీసుకునే స్థితికి దిగజారాం. చివరకు జరగాల్సిందంతా జరిగిపోయాక 'సానుభూతి' సందేశాలు నష్టాన్ని పూడ్చలేవన్న నిష్టుర సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం.
'ఇది తత్వం కాదు. మతమూ కాదు. ఒక జీవన దృక్పథం. నిత్యనూతనంగా ప్రవర్థిల్లేది' అని గురజాడ మానవతాపద్ధతి తెలియజేస్తున్నది. ఇది ఒక సిద్ధాంతం మాత్రమేకాదు. సకల సిద్ధాంతాలనూ విశ్లేషించి వాటిలోని మానవతాభ్యుదయ ప్రోద్బల భావాలను నిరంతరంగా తనలో సంలీనం చేసుకొంటూ సాగే విశాల దక్పథం. దాన్ని ఒక తత్వంగానో, మతంగానో పరిగణిస్తే దానిలో ఉన్న సహజత్వం, ఔన్నత్యం లోపిస్తాయి. మానవతావాదానికి కావలసిన ముడిసరుకు 'హేతువు'. సత్యంకోసం, జ్ఞానంకోసం మానవులు చేసే పోరాటంలో ఉపకరించే అమోఘమైన సాధనం హేతువు. హేతువు ద్వారా మాత్రమే మానవుడు తన శక్తినీ, పరిమితులనూ, సమాజాన్నీ అర్థం చేసుకోగలుగుతాడు. మంచి చెడుల్ని విశ్లేషించ గలుగుతాడు. మానవ సంబంధాల మంచీ చెడులను కూడా హేతుబద్ధంగానే పరిశీలించాలి. జీవన నిలయాలు అనురాగాల ఆలయాలుగా మారాలంటే తోటివారితో అన్యోన్యంగా మెలగడం అలవర్చుకోవాలి. నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని జాగృతం చేయాలి. వ్యాపార ధోరణిలో మానవత్వానికీ, మానవ సంబంధాలకూ స్థానం లేదు. అది డబ్బు సంబంధాలుగానే చూస్తుంది. పరస్పర సహకారమే మానవత్వ లక్షణం. మానవత్వం మాత్రమే నిత్యం విరాజిల్లే వెలుగుకిరణం. అది సూర్యరశ్మిలా మలయమారుతంలా మానవలోకాన్ని అలుముకున్నప్పుడే సమాజం ప్రకాశవంతంగా కాంతులీనుతుంది... పరిమళిస్తుంది...!