Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భిన్నాభిప్రాయాలపై విషం చల్లడానికి నేడు స్వేచ్ఛ ఒక మార్గంలా ఉపయోగపడుతోంది'' అంటున్నారు జస్టిస్ డి.వై. చంద్రచూడ్. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ''కళారంగంలో స్వేచ్ఛ'' అనే అంశంపై ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు వర్తమాన భారతానికి అద్దం పడుతున్నాయి. నిజమే కదా..! కనిపించని సంకెళ్లలో 'స్వేచ్ఛ' స్వేచ్ఛగా బందీ అవుతుంటే మాట్లాడవలసిన మానవ చైతన్యం శూన్యంలోకి చూస్తున్న దైన్యానికి ఎవరిని నిందిద్దాం..? నిజం నిర్బంధంలో కూరుకుపోతుంటే అబద్ధం రోజు రోజుకు చైనావాల్కన్నా బలం పుంజుకుంటున్న వైనానికి కారణం ఎక్కడ శోధిద్దాం..? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా నోరువిప్పలేని ఈ చీకటి కాలాన్ని ఎలా ఛేదిద్దాం..? దేశభక్తి అర్థం మారిపోయిన ఈ రోజుల నుంచి దేశాన్ని ఎలా కాపాడుకుందాం..!? అన్నీ ప్రశ్నలే...!
''సమాజ పురోగమనానికి కళ అన్ని దిశలలో విస్తరించేందుకు స్వేచ్ఛ అవసరం. కానీ ఆ స్వేచ్ఛే ఆక్రమణకు గురైనప్పుడు అది వ్యక్తుల ద్వారా, రాజ్యం ద్వారా అబద్ధాలను వ్యాప్తిచేసే ప్రమాదం ఉంది.'' అంటున్న జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. సంపద సృష్టికర్తలు శ్రమజీవులన్న భౌతిక సత్యాన్ని దాచి, దోపిడీ శక్తులే దేశసేవకులని సాక్షాత్తూ దేశాధినేతలే తమ ప్రందాగస్టు ప్రసంగాలలో అబద్ధాలను కీర్తిస్తుంటే.. ఆయన వ్యాఖ్యలను సత్యదూరమని భావించగలమా! వ్యక్తిగత అభద్రత చేతనో రాజకీయ ప్రయోజనాల కారణంగానో తెలియదుగానీ నిన్నటిదాకా సర్కారు విధానాలను తూర్పారబట్టిన ప్రతిపక్షనేతలు సైతం ఏలినవారి ఆ ప్రసంగాలను కొనియాడుతుంటే.., తమ ఆర్టికల్ 370రద్దును కాశ్మీర్ ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని నమ్ముబలుకుతుంటే, గిట్టనివారే అనవసర రాజకీయ రాద్దాంతం చేస్తున్నారని ఎర్రకోట బురుజల నుంచే నిజాలకు సమాధులు కడుతుంటే.., నిరంకుశ కాశ్మీర్ విభజనను నిర్లజ్జగా సమర్థించుకుంటుంటే... అబద్ధాలు పాలకవర్గాల హక్కులుగా, తలలూపడం దేశ ప్రజల మొక్కులుగా మారిపోతున్నాయి. రెక్కలు విరిచేసి కదలికలు నిలిపేసాక, నిర్బంధం నీడలో నిస్సహాయులుగా మిగిలిన సమూహాలను చూపి.. వారెవరూ మా నిర్ణయాన్ని ప్రతిఘటించడంలేదు చూడండీ.. అంటే ఏం చెపుతాం! ఈ పరిస్థితుల్లో కళాస్వేచ్ఛకూ నిషేధాలు తప్పని తీరుపై జస్టిస్ చంద్రచూడ్ ఆవేదన అర్థం చేసుకోదగినదే కాదు, ఆలోచించదగినది కూడా. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆలోచించక తప్పనిది కూడా. మొన్నటి 'బాండిట్ క్వీన్' నుంచి నిన్నటి 'భూభి ష్యోటర్ భూత్' వరకూ భారతీయ సినిమాలపై కొనసాగుతున్న నిషేధాలనూ, కళారంగంపైనే గాక కళాకారులు, రచయితలపైనా జరుగుతున్న దాడుల పరంపరనూ కండ్లముందుంచుకుని కూడా ''నిజాలు వెల్లడిస్తే తట్టుకునే స్థితిలో ప్రస్తుత రాజకీయాలు లేవు'' అంటున్న ఆయన అభిప్రాయాలను ఎలా కాదనగలం!
తమకు భిన్నమైన ఆలోచనలపైనే కాదు, ఆహార్య, ఆహార అలవాట్లపైనా అసహనం అంతకంతకూ పెరిగిపోతున్నదనీ, అది విద్వేషాలను రెచ్చగొడుతున్నదనీ, అందుకు కూడా స్వేచ్ఛను ఒక మార్గంలా వాడుకుంటున్నారనీ ఆయన పేర్కొన్నారు. పెహ్లూఖాన్ను బలితీసుకున్న మూకదాడుల కేసులో తీర్పుపై ఆయన స్పందిస్తూ... ఈ కేసులో విచారణ జరిగిన తీరు తనకు అత్యంత విచారం కలిగించిందని చెప్పడం గమనార్హం! నాణ్యతలేని విచారణల కారణంగానే ఇలాంటి కేసుల్లో దోషులు తప్పించుకుంటున్నారనడం అసలు సంగతిని కుండ బద్దలు కొడుతోంది! దేశంలో సంచలనం సృష్టించిన పెహ్లూఖాన్ కేసులో పోలీసుల విచారణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం మన న్యాయస్థానాల నిస్సహాయతను వ్యక్తీకరిస్తున్నది. ఏం చేద్దాం.. నరహంతకులు నిర్దోషులుగా విడుదలవు తుంటే ఈ దేశంలో న్యాయం సస్యశ్యామలమవుతోంది మరి..!
మరోవైపు ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని మోడీ విశ్వవిద్యాలయంగా మార్చాలనీ, గురుత్వాకర్షణశక్తిని న్యూటన్ సిద్ధాంత వెలుగులో కాదు, మతగ్రంథాల చీకటి సందుల్లో వెతుక్కోవాలనీ మంత్రులూ, ఎంపీలు యధేచ్ఛగా ప్రసంగాలు చేస్తుంటే మన వాక్స్వాతంత్య్రం వైభవోపేతంగా వర్ధిల్లుతోంది..! రాతి యుగం నుంచి నేటి ఆధునికయుగం దాకా జరిగిన మానవ పరిణామక్రమాన్ని చరిత్రగతిలో కాక, పురాణ స్మృతిలో దర్శించండనే ప్రభోదాల వెల్లువలో మన భావస్వేచ్ఛ వర్థిల్లుతూనే ఉంది..!! కానీ, ఇలాంటి అశాస్త్రీయ భావనలకూ, మూఢవిశ్వాసా లకూ వ్యతిరేకంగా ప్రసంగించినందుకే ప్రముఖ హేతువాది ఎం.ఎం.కల్బుర్గీ హంతకులకు లక్ష్యంగా మారాడని 'సిట్' విచారణ తేల్చడంతో మన ప్రజాస్వామ్యమే ప్రశ్నకు చోటులేనిదయి విలపిస్తోంది! సైనికుల వీరమరణాలే ప్రభుత్వాల ఏర్పాటుకు సోపానాలవుతుంటే మానవీయత మరణదండనకు గురవుతోంది. కులం, మతం, జాత్యాహంకారాలే జాతీయభావాలై చెలరేగుతుంటే.. గాలివాన కథలోని తుఫాను బీభత్సమే నిజమవుతోంది..! అన్ని విలువలూ కోల్పోయి ఉన్నదంతా డొల్లగా మారిపోయాక, ఈ ఎల్లలు లేని అఖండ భారత నిర్మాణం ఎవరికోసం? ఎందుకోసం!? ఈ ప్రశ్న ప్రజల బాధ్యతే కాదు, హక్కు కూడా...