Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ఐదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5లక్షల కోట్ల డాలర్లకు(రూ.350 లక్షల కోట్లకు) చేర్చడమే తన లక్ష్యంగా ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. బడ్జెట్ ప్రసంగంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. వృద్ధిరేటును ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతానికి పైగానే నమోదు చేస్తామన్నట్టు పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే, గత ఐదేండ్ల మోడీ పాలనలో సంబరాల్లో మునిగితేలినవారు.. మరోసారి ఆయన చెబుతున్న మాటలు వినేందుకు సిద్ధంగా లేరన్నది స్పష్టం. దీనంతటికీ ఆర్థిక వ్యవస్థ పెనుప్రమాదంలో పడటమే. మాంద్యం ముప్పు చుట్టుముడుతున్నదని పారిశ్రామిక వేత్తల్లో ఒకటే ఆందోళన. 2008లో అమెరికాలో వచ్చిన సంక్షోభం రాబోతోందని ఆర్థిక వేత్తలు విశ్లేషించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. ఈ విషయాన్ని కొత్తగా కనుక్కొన్నట్టు.. అదెదో ఇప్పుడు వచ్చినట్టు మాంద్యం నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నామని కేంద్రం చెప్పడం విడ్డూరం. ఈ ప్రమాదం రాబోతున్నదని వామపక్షాలు, మేథావులు, ఆర్థికవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నా చెవికెక్కించుకున్నదెక్కడీ మోడీ విధానాలతో దేశం వ్యాపార సౌలభ్య సాధనలో పైనున్న 50దేశాల్లో ఒకటిగా నిలవబోతుందని బాకాలు ఊదిన మీడియా సంస్థలు ఇప్పుడు ఆ మాట చెప్పేందుకు వెనుకాడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశన సాగుతున్నదన్న వార్త మీడియాలో ప్రచురించని రోజు లేదంటే ఆశ్చర్యమే మరి. మాంద్యం గురించి చెప్పేందుకు గతంలో గుంభనం పాటించిన పారిశ్రామికవేత్తలు, కంపెనీలు ఒక్కొక్కరుగా మీడియాలో కథనాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి బీజేపీ ప్రభుత్వం అనుసరించిన కార్పొరేట్ విధానాలే ఈ స్థితికి దిగజార్చాయి.
మేక్ ఇన్ ఇండియా ప్రారంభించిన రోజున ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని, తయారీరంగం రూపురేఖలు మారిపోతాయని బీజేపీ ప్రభుత్వం తెగ ప్రచారం చేసింది. ఐదేండ్ల తర్వాత తరిచి చూస్తే ఆటోమొబైల్, దాని అనుబంధ రంగాల పరిశ్రమల ఉత్పత్తి, అమ్మకాలు మునుపెన్నడూలేని విధంగా ఇరవై ఏండ్ల కనిష్టానికి పడిపోవడం గమనార్హం. ఈ రంగంలో నెలకొన్న పరిస్థితులు క్రమంగా అన్ని రంగాలలోకి విస్తరించే అవకాశాలున్నాయి. కమ్ముకుంటున్న మాంద్యం వల్ల 10లక్షల మంది కార్మికులను పనుల నుంచి తొలగించనున్నామని ఆటోమొబైల్స్ అనుబంధ పరిశ్రమల నిర్వాహకులు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరినీ నష్టాల బారినుంచి బయటపడేలా చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలమ్మ చెబుతున్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగానికే లక్షకోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ఇస్తే మిగతా రంగాలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇవ్వాలి? ఒకవేళ ఇన్ని లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ఇచ్చినా దేశం ఆర్థిక మాంద్యం నుంచి బయట పడుతుందని, తొలగించిన ఉద్యోగులు, కార్మికులకు పోయిన ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ ఉందా? అంటే అనుమానమే. దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రజలకు, రాజకీయాలకు, పరిపాలన వ్యవస్థకు సంబంధం లేదన్నట్టు.. సొంత వ్యవహారంగా మోడీ వ్యవహరిస్తూ వచ్చారు. కార్పొరేట్ రంగాలకు లాభపడే నిర్ణయాలు తప్ప ప్రజలను పరిగణనలోకి తీసుకున్నది లేదు. ప్రయివేటు రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉద్దీపనలు ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సూచించారు.
ప్రపంచ దేశాల్లో చాలా వరకు ఆర్థిక మాంద్యం దిశగానే పయనిస్తున్నాయి. భవిష్యత్తులో అమెరికాలోనూ మళ్లీ మాంద్యం ముప్పు రానుందని ఆ దేశ ఆర్థికవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇటీవల బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 2008 ప్రపంచ మాంద్యానికి ముందు కూడా బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. మన దేశంలో సంక్షోభానికి లక్షలాది మందికి ఉపాధి కరువై కనీస వేతనాలు తగ్గడం, ప్రజల్లో కొనుగోళ్లు లేక వస్తువుల అమ్మకాలు పడిపోవడమే. పరిస్థితి ఇలా ఉంటే రానున్న ఐదేండ్లలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్న ప్రధాని.. ప్రస్తుత సంక్షోభంలో అన్ని నిధులు ఎలా సమకూరుస్తారన్నది ప్రశ్న. వాణిజ్య బ్యాంకులతోపాటు నాన్బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు(ఎన్బీఎఫ్సీలు) మొండి బాకీల ఊబిలో చిక్కుకున్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం మొండి బాకీల్లో 17శాతం వాటా మౌలిక వసతుల రంగానిదే. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో దేశ దేశాల్లోని అవినీతి సొమ్ము, గుప్తధనం వచ్చి పేదల ఖాతాల్లో చేరుతుందనే భారీ ఆశలను కల్పించిన ప్రధాని.. విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడమంటేనే ఎవరిమెప్పు కోసం ఈ ప్రభుత్వం ఉందన్నది స్పష్టమవుతున్నది. సంక్షోభ సమయంలోనూ కార్పొరేట్లు తప్ప ప్రజల గురించి ఆలోచిస్తున్నది శూన్యం. ఆర్థికవ్యవస్థలో వచ్చిన సంక్షోభాన్ని పరిష్కరించకుండా ప్రజలను మతం, భావోద్వేగాలతో విభజించేందుకు ప్రయత్నిస్తున్నది. అంటే సమస్య నుంచి ప్రజల దృష్టి మరల్చడమే. మాంద్యం ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ప్రజలకు ఉపాధి కల్పించడం, కనీస వేతనాలు అమలుచేయడం, రైతులకు, చిన్న వ్యాపారులకు, యితర వర్గాలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడమొక్కటే మార్గం.