Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలోని విశాలత్వాన్ని, సమాజ స్వరూపాన్ని ఆవిష్కరించడానికి ఉపకరించే ప్రక్రియ నవల. మహత్తర పోరాటాల విరాట్ రూపాన్ని, చారిత్రక సన్నివేశాల్ని దర్శింపజేయడానికి అనువైనది నవల. నేటికీ సాహిత్యప్రక్రియల్లో నవలదే అగ్రస్థానం. అందుకే 'నవలారాజం' అన్నారు మనవాళ్ళు. విభిన్న ప్రక్రియల్లో అత్యంత ఆదరణ గలదంటే నవలే. అంతేగాక పుస్తకాలు చదవడమంటే నవలలు చదవడమనే అభిప్రాయం చెలామణీలో ఉండింది. తెలుగులో నవలలు అరుదయిపోయాయని, చదివేవారు ఎక్కడున్నారని కొందరు వాపోతుంటారు. కానీ చదివే అలవాటు, అభిరుచి ఉన్నవారు నవలల దిక్కే చూస్తున్నారు. తెలుగులోనూ మంచి నవలలకు, గొప్ప నవలలకు ఆదరణ ఉంది. కనుకనే క్లాసిక్స్ అనదగ్గ నవలలు పునర్ముద్రణ అవుతూ పాఠకులని ఆకట్టుకుంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కవిత్వం కన్నా, నాన్ఫిక్షన్ కన్నా ఫిక్షన్కే ఎక్కువ ఆదరణ. ఇటీవలి దశాబ్దాల్లో భారతీయాంగ్ల రచయితలు రాసిన నవలలకు ఆదరణ పెరిగింది. నవల జీవితాన్ని దర్శింపజేస్తుంది. జీవితంలోని వైరుధ్యాల్ని ఆకళింపు చేసుకోడానికి ఆస్కారమిస్తుంది. ఒకానొక కాలంలో జీవించిన మనుషుల పోరాటపటిమని చదివి ఉత్తేజితులమవుతాం. ఈ కారణంగానే మాక్సిమ్ గోర్కీ నవల 'అమ్మ' ప్రపంచంలో అనేక భాషల్లోకి అనువాదమైంది. ఒకతరం నుంచి మరో తరం ఈ నవలనుంచి స్ఫూర్తి పొందుతుంది. 'అమ్మ' నవల చదివి కమ్యూనిస్టులయినవారు ఉన్నారు.
నవల అంటే కేవలం కాలక్షేప సాధనం కాదు. వర్తమాన చరిత్రకు రికార్డు. చరిత్ర రచనకు తోడ్పడే ప్రబలమైన శక్తి. అందుకే రచయితలు సామాజిక, రాజకీయ కల్లోలాల్ని, అవి సమాజాన్నీ, మనుషుల్నీ ప్రభావితం చేసే తీరును నవల ద్వారా రికార్డు చేస్తారు. ఎమర్జన్సీ క్రూర నిర్బంధ కాలాన్ని అంపశయ్య నవీన్ 'చీకటి రోజులు', రంగనాయకమ్మ 'తెరవెనుక' నవలల్లో చూస్తాం. ఉద్యమ కార్యకర్తలని, సానుభూతిపరులను భయోత్పాతానికి లోను చేసిన పోలీసుల పాశవిక దమనకాండని ఈ రెండు నవలలు కడు వాస్తవికంగా చిత్రించాయి. ఇవాళ మన సమాజంలో నెలకొన్న భయాందోళనల పరిస్థితి గమనిస్తే ఆ నవలలు స్ఫురణ కొస్తాయి.
సమాజ జీవితానికి దర్పణం పట్టడమే కాదు, సమాజ గమనంలో రావాల్సిన మార్పులని సూచించడం నవలా రచనలో కీలకం. దీనికి దాఖలా ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన 'మాలపల్లి'. అంటరానితనం మీద మన దేశంలో వెలువడిన తొలి నవల ఇది. 1922లో ఉన్నవ రాసిన ఈ నవల ఆనాడే రెండుసార్లు నిషేధానికి గురయింది. అస్పృశ్యతలోని అమానవీయతని ఆర్థ్రమైన రీతిలో చిత్రిస్తూ శివరామ కారంత్ రాసిన 'చొమనదుడి' నవల 1932లో వచ్చింది., కాగా 1933లో ముల్క్రాజ్ ఆనంద్ రాసిన 'అన్టచ్బుల్' వెలువడింది. ఈ మూడింటిలో మొదటగా వెలువడి, పాలకవర్గాలని గడగడలాడించిన 'మాలపల్లి' మాత్రం తగిన ప్రాచుర్యం పొందలేదు. 'చొమనదుడి' సినిమాగా కూడా వచ్చి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంది. ఇక 'అన్టచ్బుల్' భారతీయాంగ్ల నవలల్లో విశిష్ట రచనగా విఖ్యాతి నొందింది. జాతీయోద్యమ నవలల్లో అగ్రశ్రేణికి చెందిన 'మాలపల్లి' ఈ తరానికి గొప్ప పాఠ్యాంశం. రెండు మామిడిపండ్లను తీసుకున్నాడని దళితుడిని హత్య చేశారంటేనే సమాజం మౌలికంగా మారలేదనే అర్థం. అందుకే 'మాలపల్లి'కి నేటికీ ప్రాధాన్యం ఉంది.
ప్రపంచీకరణ ప్రభావాల గురించి ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు గానీ ప్రేమ్చంద్ ఎనిమిది దశాబ్దాల కిందటనే 'అభివృద్ధి' పేరిట జరిగే విధ్వంసాన్ని 'గబన్' నవలలో చిత్రించారు. పచ్చని పంటపొలాల వినాశనం పర్యావరణానికి మాత్రమే కాదు, పల్లె జీవితంలోని ప్రశాంతతని దెబ్బతీస్తుందని 'గబన్' నవలలో చూపారు. ఇవాళ పక్షులకీ, జంతువులకీ మాత్రమే కాదు మనుషులకు సైతం స్థానం లేనంతగా పల్లెలు పరాయీకరణ లోనవుతున్న విధ్వంస దృశ్యాన్ని చూస్తున్నాం. ఈ పరిణామాల గురించి 'గబన్' నవల ద్వారా ప్రేమ్చంద్ ఆనాడే హెచ్చరించారు. మానవీయ ముఖం లేని అభివృద్ధిని ఆయన ప్రశ్నించారు.
ఈవిధంగా ప్రశ్నించే తత్వం తెలంగాణలోనూ మొదటినుంచి వుంది. తెలంగాణ సాయుధపోరాటానికి పూర్వం తెలంగాణ పల్లెలు ఎలా ఉండేవో రచయితలు తమ నవలల్లో సృజించారు. నిజాం రాచరికంలో, దొరల దౌష్ట్యంలో నలిగిపోయిన వారి తిరుగుబాట్లను, వెల్లువెత్తిన పోరాటాల్ని వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజలమనిషి, దాశరథి రంగాచార్య 'జనపదం, మోదుగుపూలు' చిత్రించాయి. ఇదే దృక్పథంతో ప్రజల సంవేదనలకీ, స్పందనలకీ నవలారూపం ఇచ్చే ధోరణి తెలంగాణలో కొనసాగుతున్నది. తెలంగాణలోనే కాదు, మొత్తం తెలుగు సమాజంలో జనజీవితానికి దర్పణం పట్టే నవలారచనదే పైచేయి అయిన సందర్భమిది. కొంతకాలం కొనసాగిన కాలక్షేప నవలల ధోరణికి కాలం చెల్లింది. సామాజిక, ఆర్థిక సంక్షోభాలకు చిత్రిక పట్టే నవలలు వస్తున్నాయి. కార్పొరేట్ విద్యా, వైద్య రంగాల తాకిడికి అల్లకల్లోలమైన తెలుగువారి జీవితాలకు ఈమధ్యన సింహప్రసాద్ రాసిన 'ధిక్కారం, అభయం' నవలలు అద్దం పట్టాయి. టీవీ, ఇంటర్నెట్, సోషల్మీడియా ప్రభావాలెన్ని ఉన్నా తెలుగులో నవల మనుగడలో ఉంది. మహర్దశ అందుకునే దిశగా పయనిస్తున్నది. నిజానికి ఇవాళ అనేకానేక వైరుధ్యాలతో కూడిన సమాజంలోని బహుళ పార్శ్వాల్ని ప్రబలంగా చిత్రించడం నవలా ప్రక్రియకే సాధ్యం. బృహత్తర నవలలు రాయగలిగే శక్తి ఉన్న రచయితలు ఈ దిశగా చూపు సారించడం నేటి అవసరం.