Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్లో ఏం జరుగుతోంది..? అంతా సవ్యంగానే ఉందనీ, అంతటా సాధారణ పరిస్థితులే నెలకొన్నాయనీ, ప్రజలు తమ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారనీ చెపుతోంది భారత ప్రభుత్వం. జాతీయ మీడియా కూడా ఇందుకనుకూలంగానే వార్తా కథనాలను ప్రసరిస్తున్నది. కానీ, అంతర్జాతీయ మీడియా మాత్రం కాశ్మీర్లో ప్రజాస్వామ్య దురాక్రమణే కొనసాగుతున్నదనీ, అడుగడుగునా సైనిక పదఘట్టనల మధ్య నిఘా నీడలో కాశ్మీర్ నిర్బంధించబడిందనీ వెల్లడిస్తోంది. ఏది నిజం? ఏది అబద్ధం? ఇవీ దేశం ముందున్న ప్రశ్నలు. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్లో పరిస్థితుల పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్షాలను అనుమతించక పోగా బలవంతంగా తిప్పిపంపడం ఈ ప్రశ్నలకు మరింత బలం చేకూరు స్తున్నది. నిజంగా ప్రభుత్వమూ, పాలకపార్టీ చెపుతున్నట్టు కాశ్మీర్లో సాధారణ పరిస్థితులే ఉంటే, భారత ప్రభుత్వ నిర్ణయాన్ని లోయ ప్రజలు అంతగా స్వాగతిస్తూ ఉంటే ఇంత అప్రజాస్వామికంగా ప్రతిపక్షనేతలను అడ్డుకోవడమెందుకు..!?
వెళ్లినవారేమైనా వేర్పాటువాద నాయకులా? తీవ్రవాద నాయకులా? లేక మతఛాందసవాదులా? సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరీ, సీపీఐ నేత రాజా, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సహా దేశంలోని ఎనిమిదిపార్టీలకు చెందిన నేతలు. భారత ప్రజాస్వామిక వ్యవస్థలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రాజకీయపార్టీల ప్రతినిధులు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలకు చెందిన నాయకులు. అలాంటి వారికి ఏ కారణం చేత అనుమతి నిరాకరించినట్టు? ఎందుకు ఎయిర్పోర్టు నుంచే వెనక్కి పంపించినట్టు..!? అకారణంగా వారి పర్యటన అడ్డుకున్న ఈ ఒక్క కారణం చాలు కాశ్మీర్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి!
ఒక వైపు కాశ్మీర్ ప్రశాంతంగా ఉందనీ, శాంతిభద్రతల సమస్యే లేదని చెపుతూనే మరోవైపు ప్రతిపక్ష నేతల పర్యటనలనడ్డుకోవడం దేనికి సూచిక ఇటీవల దేశభద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పర్యటనను కాశ్మీర్లో నెలకొన్న సాధారణ పరిస్థితులకు, స్థానిక ప్రజలు తమ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తీరుకు ఉదాహరణగా ప్రభుత్వమూ, జాతీయ మీడియా ఆకాశానికెత్తాయి. కాశ్మీర్ రహదారుల అంచున ధోవల్ ప్రశాంతంగా భోజనం చేసిన దృశ్యాలు, స్థానిక గొర్రెల కాపరులతో సుదీర్ఘంగా సంభాషించిన దృశ్యాలు ప్రసార ప్రచార మాధ్యమాలను ముంచెత్తాయి. ఆ దృశ్యాలన్నీ అబద్ధాలా? కేవలం తమకనుకూలంగా దేశ ప్రజల అభిప్రాయాలను మలుచుకోవడానికి చేసుకున్న కృత్రిమ ఏర్పాట్లా? కానప్పుడు కాశ్మీర్లోకి ప్రతిపక్ష నేతలను అనుమతించక పోవడంలోని ఆంతర్యమేమిటి?
ఇదంతా ఒకెత్తయితే ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీరు మరో ఎత్తు. కాశ్మీరు ప్రజలు అసంతృప్తితో ఉన్నారనేది అసత్య ప్రచారమనీ, కాశ్మీర్లో ఏ నిర్బంధమూ లేదనీ, ప్రజల ప్రజాస్వామిక హక్కులకు ఎలాంటి భంగమూ వాటిల్లడం లేదనీ, లోయ నలుమూలలా ప్రశాంతత ఆవహించి ఉన్నదనీ, కావాలంటే వచ్చి చూసుకోవచ్చనీ ట్విట్టర్ వేదికగా ఆయన రాహుల్గాంధీకి సవాల్ విసిరారు. ఓ రాజ్యాంగ బద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, ఓ రాజకీయ నాయకుడిలా స్వయంగా ఓ ప్రతిపక్ష నేతకు సవాల్ విసరడం సరైనదా కాదా అనే విషయం పక్కనబెడితే... ఆయన సవాల్ను అదే ట్విట్టర్ వేదికగా రాహుల్గాంధీ స్వీకరించి, 'నేను కాశ్మీర్ పర్యటనకు వస్తానని' ప్రకటించారు. తీరా వెళ్లాక శ్రీనగర్ నుంచే తిప్పి పంపించారు. సీతారాం ఏచూరిని అడ్డుకోవడం ఇది రెండోసారి. ఈ సవాళ్లు విసరడాలూ, వాటికి నిలబడకపోవడాలు, అనుమతి నిరాకరించడాలూ అడ్డుకోవడాలు చెపుతున్నదేమిటీ? కాశ్మీర్ గుండెచప్పుడు ఎవరికీ వినపడకుండా కనపడకుండా దాచే కుతంత్రాన్నే కదా..!?
నిజానికి కాశ్మీర్లో జరుగుతున్నదేమిటి? మోడీ సర్కార్ ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా రెండు ముక్కలు చేసిన నాటినుంచీ కాశ్మీరం నిర్బంధంలోనే కొనసాగుతున్నది. ఎటు చూసినా బంద్ వాతావరణమే నెలకొన్నది. ప్రభుత్వ రవాణా వ్యవస్థ నిలిపివేయబడింది. మార్కెట్లన్నీ మూతబడ్డాయి. నిలిచిపోయిన టెలిఫోన్, సెల్ఫోన్, ఇంటర్నెట్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి తేలేదు. ప్రజలు నిత్యావసరాలకూ, అత్యవసర మందులకూ నోచుకోని దయనీయస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలు స్థానికంగా తమ నిరసనను తెలియజేయడానికి దొరికిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ నిరసనలపై విరుచుకుపడుతున్న భాష్పవాయు గోళాలు, పెప్పర్ గ్రనేడ్లు, టియర్ గ్యాస్, పెల్లెట్ షాట్లకూ కొదువలేదు. ఇందుకు సంబంధించిన భయానకదృశ్యాలనేకం అంతర్జాతీయ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. అయినా కాశ్మీరం ప్రశాంతంగా ఉందంటే నమ్ముదామా? మాజీ ముఖ్యమంత్రులతో సహా కాశ్మీరీ నేతలనేకులు ఇంకా నిర్బంధంలోనే మగ్గుతుంటే, కాశ్మీర్ సీపీఐ(ఎం) నేత యూసఫ్ తరిగామీ ఎక్కడ నిర్బంధించబడ్డాడో ఆచూకీ సైతం తెలియని స్థితి ఉంటే.. అక్కడ సాధారణ పరిస్థితులే నెలకొని ఉన్నాయంటే ఎలా నమ్మడం? ప్రజల హృదయాలను గెలుచుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్ప... అసత్యాల మాటున, నిర్బంధాల నీడన సమస్యను పరిష్కరించాలనుకోవడం అర్థరహితమే కాదు, అమానవీయం అప్రజాస్వామికం.