Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్డు ప్రమాదాలను అరికట్టే పేరుతో మోడీ సర్కార్ ప్రజలను మరింత ఆగాధంలోకి నెట్టేయబోతున్నది. ఇటీవల ఆమోదించిన మోటారు వాహన చట్ట సవరణ(ఎమ్వీ యాక్టు) బిల్లు సెప్టెంబర్ నుంచి అమలులోకి రాబోతుంది. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై భారీగానే వడ్డన పడుతుంది. ఈ బిల్లు కోసం నాలుగేండ్లుగా కాషాయ ప్రభుత్వం పడుతున్న తాపత్రయం వెనుక రహస్యం ఏమిటన్న సందేహాలే ఇప్పుడు పటాపంచలయ్యాయి. భద్రత, సౌలభ్యం అంటూ రవాణా వ్యవస్థల్లో ప్రయివేటు శక్తులు, వ్యక్తులకు లబ్ది చేకూర్చేందుకు వాహన చట్ట సవరణ బిల్లును తెచ్చింది. బిల్లులో పేర్కొన్న సవరణలపై చాలా రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. ఇది తమ హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశాయి. కార్మిక సంఘాలు కూడా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. కార్మికుల ఉపాధిని దెబ్బతీసే రీతిలో ఈ బిల్లును ఒప్పుకోబోమని తెగేసి చెప్పాయి. అయినా, వారి మాటను వినేందుకు మోడీ సర్కార్ సిద్ధం కాకపోవడం గమనార్హం. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న విధానాలను, కార్పొరేట్లు, ప్రయివేటు సంస్థలకు రూట్లను అప్పగించడం వంటి వాటిని బిల్లులో నుంచి తొలగించేందుకు ససేమిరా అంటోంది. కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు ఈ బిల్లుతో 2020 నాటికి ప్రమాదాలను సగానికి సగం తగ్గించడం మాట అటుంచి రవాణారంగాన్ని ప్రయివేటు చేతుల్లో కట్టబెట్టడం ఖాయం. లోక్సభలో పూర్తి మెజారిటీ, వివిధ పార్టీలను చీల్చి రాజ్యసభలో పెంచుకున్న బలంతో చాలా బిల్లులను మోడీ ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. ఎమ్వీ చట్ట సవరణ బిల్లు కూడా అందులో భాగమే.
మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినకొత్తలోనే మోటారు వాహన చట్టం-2016ను లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 2014లో రోడ్డు రవాణా, భద్రతా బిల్లు ఉండగా,, దానిపై వ్యతిరేకత రావడంతో పేరు మార్చి మోటారు వాహన చట్ట సవరణ బిల్లు-2016తో ముందుకొచ్చింది కేంద్రం. వాస్తవానికి 2014లోని బిల్లుకూ, 2016లోని బిల్లుకూ పెద్దగా తేడా లేదన్నది కార్మికసంఘాలు వాదిస్తూ వస్తున్నాయి. తర్వాత ఆయా రాష్ట్రాల సూచనలతో కొన్ని సెక్షన్లలో సవరణలు చేసినట్టు చెప్పినా బిల్లు కాపీని బహిర్గతం చేయలేదు. ఇటీవల ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన సమయంలోనూ ముందస్తుగా బిల్లును సభ్యులకు అందించకపోవడం గమనార్హం. బిల్లులో ప్రధానంగా నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై భారీస్థాయిలో జరిమానాలు విధించడం, ప్రమాదానికి కారణమైన డ్రైవర్లపై చర్యలు తీసుకోవడం, జైలు పాలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా బిజీగా ఉన్న రూట్లను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అనుమతించడం, అటువంటి రూట్లల్లో ఆర్టీసీ బస్సులను అనుమతించకపోవడం, థర్డ్పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను పెంచడం, వాహనాల విడిభాగాలు బ్రాండెడ్ వస్తువులే వాడటం, షాపుల్లో స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు నిరాకరణ ఇలా ఎన్నో ప్రజా వ్యతిరేకమైన అంశాలను బిల్లులో కేంద్రప్రభుత్వం చేర్చింది. ఇవన్నీ ప్రజారవాణాను ధ్వంసం చేసేవే. దీనివల్ల ఆర్టీసీ మనుగడకు ప్రమాదం వాటిల్లనుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ను ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేస్తే.. ఆ రూట్లో ఆర్టీసీ బస్సులు తిరగడానికి వీల్లేదు. ఇది లాభదాయకమైన రూట్లను ప్రయివేటుకు ఇచ్చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యం కానున్నాయి. ప్రభుత్వఉద్యోగులకు భద్రత ఉండదు. సెక్షన్ 138ను సవరించడం ద్వారా సైకిల్, రిక్షా నడుపుతున్న వారి హక్కులు హరించబడతాయి. ఇప్పుడున్న అధికారాలతోనే పోలీసులు ముప్పతిప్పలు పెడుతున్నారు. కొత్త బిల్లుతో మరిన్ని చిక్కులు రావడం ఖాయం. చిన్నచిన్న షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్న లక్షలాది మంది భవితవ్యం రోడ్డున పడనుంది. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తమవుతున్నది.
రోడ్డు భద్రత కోసమే ఈ బిల్లును తెచ్చామనీ దీనివల్ల ప్రమాదాలు తగ్గుతాయని కేంద్రమంత్రి గడ్కరీ చెబుతున్నారు. జరిమానాలు విధించడమే రోడ్డు భద్రతకు సరైన మార్గమని చూపడం దురదృష్టకరం. ప్రమాదాలు జరగడానికి డ్రైవర్లనే బాధ్యులుగా చూపడం సరికాదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు కాంట్రాక్టర్ల లోపాలున్నాయి. ముందుగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. వాహనాలకు పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసైన్సు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి. ఈ సవరణతో కేంద్రం పరిధిలోకి వెళ్లబోతున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసే ఒక సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ రెండు ప్రక్రియలనూ ఔట్సోర్సింగ్ చేస్తుంది. అంటే రాష్ట్రాలకు ఉన్న హక్కులను కేంద్రం కాలరాయడమే. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. బిల్లు విషయంలో కేంద్రం చెబుతున్న దానికి చేస్తున్న పనులకు పొంతనలేదు. ఇలాంటి ప్రమాదకరమైన బిల్లును తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కోట్లాదిమంది కార్మికుల పొట్టకొట్టే బిల్లును నిలువరించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలి.