Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ జనతా పార్టీకి చెందిన భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మళ్లీ రెచ్చిపోయారు. అజ్ఞానాన్ని, అశాస్త్రీయతను, మూఢనమ్మకాలను, అబద్ధాలనూ ప్రచారం చేయడంలో పేరు గాంచిన ప్రజ్ఞాసింగ్ ఇప్పుడు చేతబడులపై పడ్డారు. ఇటీవల మరణించిన తమ పార్టీనేతలు అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్లు ప్రతిపక్షాలు చేసిన చేతబడుల కారణంగానే చనిపోయారని ఆమె శెలవిచ్చారు. సోమవారం భోపాల్లో జరిగిన జైట్లీ సంతాపసభలో ఆమె మాట్లాడుతూ ''మీరు నమ్మండి.. నమ్మకపోండి.. నేను చెప్పింది నిజం.. జరిగిందదే.. ప్రతిపక్షాల చేతబడుల కారణంగానే జైట్లీ, సుష్మలు మరణించారు' అని స్పష్టం చేశారు. తాను పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఓ సాధువు ''చెడుకాలం రాబోతున్నందున జాగ్రత్తగా ఉండాలని'' హెచ్చరించారనీ, అయితే తాను ఆవిషయం మరచిపోయాననీ జైట్లీ, సుష్మ మరణాల తరువాత స్వామీజీ చెప్పిన సంగతి తనకు గుర్తుకొచ్చిందనీ ప్రజ్ఞా చెప్పుకొచ్చారు. ఇలాంటి అసత్యాలను, మూఢనమ్మకాలను ప్రచారం చేయడం ప్రజ్ఞాకు కొత్తేమీ కాదు. తన ఎన్నికల ప్రచార సమయంలోనే ఆమె ''మాలేగావ్ పేలుళ్ల కేసులో నన్ను అరెస్టు చేసిన ఏటీఎఫ్ చీఫ్ హేమంత్ కర్కరే నా శాపంతోనే మరణించారు'' అన్నారు. ఆమె మాటలపై అప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగినా, ఆమె తీరు మాత్రం మారలేదు.. అయినా, ఇలా మూఢనమ్మకాలను ప్రచారం చేయడం, అందునా ఓ అత్యున్నత చట్టసభకు చెందిన ప్రజాప్రతినిధిగా ఈ ప్రచారం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధమని తెలిసినా బిజేపీ ఆమెపై ఎలాంటి చర్యా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కూడా ఆమె నోటికి అడ్డుకట్ట వేయడం లేదు. పైపెచ్చు ప్రజ్ఞాసింగ్ సహచర ఎంపీ సాక్షి మహరాజ్ లాంటి వాళ్ళు ఆమెను బహిరంగంగా వెనకేసుకు వస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు. జేజేలు పలుకుతున్నారు.
ఈ మూఢత్వం కేవలం వ్యక్తులకు మాత్రమే పరిమితమైనది కాదు. వాస్తవానికి కమలనాథుల భావజాలమే అశాస్త్రీయతపై ఆధారపడినది. బీజేపీ ప్రచారం చేసే భావజాలంలో శాస్త్రీయత మచ్చుకైనా కనిపించదు. ఆ అశాస్త్రీయ భావజాలాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు కాబట్టే ప్రధాని మోడీ సైతం ''మనకు ప్లాస్టిక్ సర్జరీ పురాణకాలంలోనే ఉంది. కాబట్టే గణేశుడికి ఏనుగు తలను అద్భుతంగా అతికించడం జరిగింది'' అని పబ్లిక్గా ప్రవచించారు. ఒక ప్రజాస్వామ్య దేశపు ప్రధాని ఇంత అశాస్త్రీయతను ప్రచారం చేయడాన్ని చూసి ప్రపంచమే విస్తుపోయింది. అయినా బీజేపీ మోడీనే వెనకేసుకు వచ్చింది. ఆ బాటనే నడుస్తోంది. సాక్షాత్తూ దేశ ప్రధానే అలా మాట్లాడటం చూసి ప్రజ్ఞాసింగ్ లాంటి వారు మరింతగా రెచ్చిపోతున్నారు. పచ్చి అబద్ధాలను, మూఢనమ్మకాలను ప్రచారంలో పెడుతున్నారు.
మూఢత్వాన్ని నమ్మడం మూర్ఖత్వం. మూఢత్వాన్ని ప్రచారం చేయడం నేరం. నేరస్వభావులు మాత్రమే ఈ పని చేస్తారు. ప్రజలను మూఢత్వంలో ముంచి మత మనుగడ సాగించుకునేందుకు ఆరాటపడతారు. ఇప్పుడు కమలనాథులు ఆపనే చేస్తున్నారు. అబద్ధాలతో, అభూత కల్పనలతో, అశాస్త్రీయతతో ప్రజలను మభ్యపెట్టి, మాయచేసి, ఆశపెట్టి, భయపెట్టి తమ వెనకాల సమీకరించుకుంటున్నారు. అలా సమీకరించుకున్న జనాన్ని ఓట్లుగా మార్చుకుని రాజ్యమేలుతున్నారు. పాలకులు ఎవరైనా హేతుబద్ధ భావజాలాన్ని ప్రచారం చేయాలని రాజ్యంగం నిర్థేశిస్తున్నా, మూఢ నమ్మకాలను ప్రచార చేయడం నేరమని చట్టం స్పష్టం చేస్తున్నా మోడీ నుంచి ప్రజ్ఞాసింగ్ వరకు కమలనాథులంతా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ప్రజల దృష్టిని, ఆలోచనలనూ ప్రక్కదారి పట్టించేందుకు. భారత ఆర్థిక వ్యవస్థను ప్రయివేట్, విదేశీ బహుళజాతి సంస్థల చేతుల్లో పెడుతున్న కారణంగా నేడు ప్రజలలో ఆకలి, అశాంతి పెరిగిపోతున్నాయి. ప్రజల ఆలోచనలను ఆవైపు నుంచి మళ్లించకుంటే వాళ్ళు తిరగబడడం ఖాయం. అప్పుడు మొదటికే మోసమొస్తుంది. ప్రజల ఆలోచనలను మొద్దుబార్చేందకు, దారితప్పించేందు మూఢత్వమే మేలైన మార్గం. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకున్నారు.
అవును! ఇదంతా ఎవరో ప్రజ్ఞాసింగ్ లాంటి కొందరు వ్యక్తులు చేస్తున్న నేరం కాదు. ఇదొక వ్యవస్థీకృత నేరం. చాలా పద్ధతిగా, పకడ్బందీగా, జాగ్రత్తగా, సంస్థాగతంగా చేస్తున్న వ్యవస్థీకృతం నేరం. ఇందులో ప్రజ్ఞా సింగ్ లాంటి వాళ్ళు తెరముందటి పాత్రధారులు. ఇలాంటి సుశిక్షుతులైన పాత్రధారులు ఇప్పుడు మన దేశంలో తెరముందు, వెనుక లక్షల మంది ఉన్నారు. వీరి చేతుల్లోనే ప్రజలల్లో శాస్త్రీయ, హేతువాద భావజాలన్ని పెంచి, వారిముందు వెలుగు దారులు పరవాలని ప్రయత్నిస్తున్న కల్బుర్గీ, దబోద్కర్ లాంటి మానవతా మూర్తులు దారుణంగా చంపబడుతున్నారు.
శాస్త్రీయతకు, హేతువుకు తమ భావజాలం చుక్కెదురని, ప్రజలు మూఢత్వాన్ని వీడితే తాము మనుగడ సాగించడం అసాధ్యమనీ కమలనాథులకు, వారి సోదరులైన సంఘ్ పరివార్ శక్తులకూ మాబాగా తెలుసు. కాబట్టే, అనుక్షణం ప్రజలను మూఢత్వంలో ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని ఎదుర్కోకుంటే, ప్రజలనుంచి వీరిని వేరు చేయకుంటే ఈ దేశం చీకటి యుగంలోకి తిరిగి పయనిచడం తథ్యం. ఈ నేపథ్యంలో ఈ ప్రజా వ్యతిరేక శక్తులను ప్రతి చోట, ప్రతిఘటించడం ప్రగతిశీల శాస్త్రీయ శక్తుల కర్తవ్యం.