Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశాన్ని 5ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షలకోట్లు) ఎకానమీగా మార్చేస్తానని ప్రధాని మోడీ చెపుతున్నారు. కానీ జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు (స్థూల జాతీయోత్పత్తి) ఐదు శాతంగా నిలిచింది. గత ఆరేండ్లలో ఇది అతి తక్కువ వృద్ధిరేటు కావడం గమనార్హం. గతేడాది తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు 8శాతంగా ఉంది. అక్కడ్నుంచి క్రమంగా జీడీపీ వృద్ధి క్షీణిస్తూ వస్తోంది. చివరికి ఆ ఏడాది 6.8శాతానికి పడిపోయి ఇప్పుడు ఐదుశాతానికి దిగజారడం ఆందోళనకరం. రంగాల వారీగా చూసినా వద్ధిరేటు నేలచూపులే చూస్తున్నది. గతేడాది వ్యవసాయంలో 5.1శాతం ఉంటే ఈ ఏడాది 2శాతమే. ఉత్పాదకరంగం 12శాతం నుంచి 0.6శాతానికి దిగజారింది. ప్రస్తుత ఆర్థికవ్యవస్థ పతనానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణం. తిమ్మినిబమ్మిని చేసి గణాంకాలను దాచిపెట్టేందుకు ఎంతగా ప్రయత్నించినా నిజం బయటపడక తప్పలేదు. అయినా, పాలకులు ఇంకా ప్రజలను భ్రమల్లో ఉంచుతూ వారిని మరింత అగాథంలోకి నెట్టేందుకు ప్రయత్నించడం దారుణం. ఈ చర్య మంచిది కాదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నా పాలకులు ఆ మార్గాన్నే ఎంచుకోవడం గమనార్హం. ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే పేరుతో కొంతమందికే అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మరింత దిగజారడం ఖాయం. దేశం మాంద్యం దిశగా ప్రయాణిస్తున్నదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభానికీ, ప్రజల మధ్య అసమానతలు పెరగడానికీ ప్రధాన కారణం ప్రభుత్వరంగాన్ని విస్మరించి అన్నింట్లో ప్రయివేటు పెట్టుబడులకు అనుమతించడమేనన్నది అనుభవం చెపుతున్న సత్యం.
జీడీపీ వృద్ధి తగ్గడానికి వాస్తవ జాతీయ స్థూలఉత్పత్తి, వాస్తవ ఆదాయాలు, ఉపాధి, పారిశ్రామిక ఉత్పత్తి, టోకు, చిల్లర అమ్మకాలలో ప్రభావమే కారణం. ప్రభుత్వవ్యయంలో కోతలు, మద్దతు ధరల తగ్గింపు, ఉత్పత్తి వ్యయాలు బాగా పెరగడం కూడా జీడీపి వృద్ధిరేటు తగ్గడానికి మరో కారణం. అసంఘటిత రంగాల్లోనూ ఆర్థిక మందగమనం ప్రభావం తీవ్రంగా ఉంది. నోట్లరద్దు, జీఎస్టీ అమలు వల్ల ఆయా రంగాల్లో తీవ్ర ప్రభావం పడింది. వీటివల్ల వచ్చిన నష్టాలను దాచిపెట్టి ఆర్థికవ్యవస్థ సజావుగా ఉందని చూపడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం. కార్ల కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో వారంతా నిరుద్యోగులుగా మారడం ఇందుకు ఓ ఉదాహరణ. ఇది కూడా ఆర్థిక మాంద్యానికి సూచికగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం సర్వీస్ సెక్టార్(సేవారంగం) మాత్రమే కొద్దిగా వృద్ధిరేటు చూపిస్తున్నది. పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధిరేటు చాలా తక్కువగా ఉంది. ప్రోత్సాహం పేరుతో విదేశీపెట్టుబడుల కోసం ద్వారాలు తెరవడం, పారిశ్రామికవేత్తలకు ఉద్దీపనలు, రాయితీలు, వడ్డీరేట్లు తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నా ఇవేమీ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోలేవన్నది ఆర్థికనిపుణుల విశ్లేషణ. 2008లో అమెరికా, తదితర ప్రపంచదేశాల్లో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కొంతవరకే ఉపశమనం కలిగించాయి. కానీ ప్రమాదాన్ని తగ్గించలేకపోయాయి. ఇవి ప్రజల కొనుగోలుశక్తి పెంచేందుకు ఏ మాత్రం దోహదపడవు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని తొలగించు కోకుండా ఏవేవో ఉద్దీపన లేదా రక్షణ చర్యలతో బయటపడగలమని భావిస్తే మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని రఘరామ్రాజన్ వంటి ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
చైనాలో అంతర్గత మార్కెట్ బలంగా ఉండడం వల్లే పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నది. విదేశీ పెట్టుబడుల అవసరాలను బట్టిగాక, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు, ప్రణాళికలు తయారు చేసుకుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నది వాస్తవం. ఆ రీతిన మోడీ ప్రభుత్వం పనిచేస్తుందనుకోవడం అత్యాశే. ఇందుకు గత విధానాలే నిదర్శనం. బ్యాంకులను ముంచి విదేశాలకు తరలిపోయిన ప్రబుద్ధులందరినీ కేంద్రప్రభుత్వం ఉపేక్షించిన విషయం తెలిసిందే. వారంతా కేంద్రం అండదండలతోనే విదేశాలకు పారిపోయారన్నదీ జగద్వితం తాజాగా రూ.1.76లక్షల కోట్ల రిజర్వుబ్యాంకు సొమ్మును కేంద్రం తన ఖజానాకు తరలించుకున్నది. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసమే అని చెబుతున్నా ఆ డబ్బంతా పెట్టుబడుదారులకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకేనన్నది వాస్తవం. నష్టాలొస్తున్నాయన్న పేరుతో కార్పొరేట్లకు పన్ను రాయితీ కల్పిస్తున్న ప్రభుత్వం.. రైతులు, సామాన్యులు బ్యాంకులకు బకాయి పడితే మాత్రం ఆస్తులను జప్తు చేసి నానా యాగీ చేస్తున్నది. సర్కారు అనుసరించే ఈ ఆర్థికనీతే ప్రజల పాలిటి దమననీతిగా మారుతున్నది. 2008 నాటి ఆర్థికసంక్షోభం వంటిది మళ్లీ విరుచుకుపడితే తట్టుకోగలిగిన శక్తి ప్రస్తుతం మన ఆర్థిక సంస్థకు లేదు. ఈ కీలకమైన అంశాన్ని ప్రజలందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన బాధ్యత మేధావులు, ప్రజాతంత్రవాదులపై ఉంది. లేనిపక్షంలో కార్పొరేట్ల కాసుల కక్కుర్తికి సమిధలయ్యేది సామాన్యులే!