Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి ఏపని చేయాలన్నా, ఏమి సాధించాలన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. మనిషి చురుగ్గా ఉంటే భిన్నమైన ఆలోచనలతో ముందుకుసాగుతూ ఉత్తమ ఫలితాల సాధనకు అవకాశాలుంటాయి. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. వైరల్ జ్వరాలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నది. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ధర్మాస్పత్రుల్లో రోగుల సంఖ్య లక్షల్లోనే ఉందనే సంగతి తెలిసిందే. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రవేశపెట్టిన ఈజేహెచ్ఎస్ పథకాలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. దీంతో వైద్యం గగనకుసుమమే. ఆరోగ్యం గాలిలో దీపమైంది. డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా తదితర సీజనల్ వ్యాధులతో తెలంగాణ అస్తవ్యస్థమైంది. అయినా ప్రభుత్వానికి కించిత్బాధ లేకపోవడం గమనార్హం. లక్షలాదిమంది రోగపీడితులు వైద్యం కోసం సర్కారు ఆస్పత్రుల్లో అడుగుపెడుతుంటే, తాత్కాలిక చర్యలతో నాన్చుడు ధోరణికి ప్రభుత్వం అలవాటు పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైరల్ జ్వరాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? రోగులు కాటికి పోవడం తప్ప.
సర్కార్ నిర్లక్ష్య ఫలితంగా డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా స్వైరవిహారం చేస్తున్నాయి. దాదాపు 25 లక్షల మంది రోగులు హైరిస్క్ జోన్లో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర దవాఖానాల్లో కాలుపెట్టే సందులేకుండా పోయింది. సీజనల్ వ్యాధులను అంచనా వేయడంలోనూ, సకాలంలో వైద్యం అందించి అరికట్టడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్- భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం- భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో పరిస్థితులు పూర్తిస్థాయిలో విషమించాయి. సమస్యలను పరిష్కరించడానికి తాత్కాలిక ఉపశమన చర్యలే తప్ప శాశ్వత ప్రాతిపదికపై దృష్టి కొరవడటంతో వైద్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడలానే ఉంది. రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలు, బోధనాస్పత్రులు, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు మొత్తం 26,404మంది ఉండవల్సి ఉండగా, ఇందులో ఇంకా 9,256 ఖాళీలున్నాయి. అందులోనూ 4,201వైద్యుల పోస్టులే కావడం గమనార్హం. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో 4,500మంది వైద్యులు అవసరం కాగా, 2100మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2400 డాక్టర్ పోస్టులు భర్తీకాలేదు. ఇలా వైద్య, ఆరోగ్య రంగం నానాటికీ చిక్కి శల్యమై రోగుల తెలంగాణగా మారింది. విద్యా, వైద్యానికి ప్రతియేటా బడ్జెట్లో కనీసం 10శాతం నిధులు కేటాయించాలని ఆయా ప్రభుత్వాలు నియమించిన పలు కమిషన్లు సిఫారసు చేసినా, ఆ దిశగా ఏ ప్రభుత్వమూ కార్యాచరణ చేపట్టకపోవడంతో పేదలకు అగచాట్లూ తిప్పలూ తప్పడం లేదు. గతేడాది డెంగ్యూ కేసులు 6362నమోదయ్యాయి. ఈసారి అంతకుమించే వచ్చే పరిస్థితులు చుట్టుముట్టాయి. చికిత్స కోసం వైద్యుల సెలవులు రద్దుచేశామని ఘనంగా చెప్పుకుంటున్న సర్కారు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పురపాలక, ఐసీడీఎస్, మత్స్య, విద్యాశాఖలను సమన్వయం చేయడంలోనూ వెనుకపడింది. కుంటలు, కాలువలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో దోమల నివారణకు మందు 'స్ప్రే' చేస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అవి అంతంతే అని ప్రత్యక్షంగా కనిపిస్తున్నదే. ఈ వ్యాధులు ప్రబలడానికి మరో కారణం కూడా కనిపిస్తున్నది. స్థానిక సంస్థల దగ్గర నిధుల్లేక పోవడమే. పంచాయతీల్లో పైసలుంటే స్థానిక ప్రభుత్వాలు ఎంతో కొంతమేర చర్యలు తీసుకునేవి. ఆ మేరకు తాజా వ్యాధుల తీవ్రత కొంతైనా తగ్గేది. డెంగ్యూ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తామని సర్కారు ప్రకటించింది. డెంగ్యూ కేసులు వేలాదిగా నమోదవుతుండగా, దీనినే సాకుగా తీసుకుని ప్రయివేటు దవాఖానాలు, డయాగస్టిక్ సెంటర్లు పేదల నుంచి రక్తపరీక్షల పేర విపరీతంగా ఆర్థిక దోపిడీ చేస్తున్నాయి. డెంగ్యూ లేకపోయినా ఉన్నట్టూ ప్లేట్లెట్లు సరిపడినంతగా ఉన్నా, తక్కువగా చూపిస్తున్నాయనే ఫిర్యాదులు కోకొల్లలు. ప్లేట్లెట్లు పడిపోయే తీవ్రతను బట్టి రూ.40 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్న ప్రయివేటు 'దోమ'కాటుతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. డెంగ్యూ, జికా, మలేరియా, చికున్గున్యా, ఎల్లోఫివర్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు సైతం వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా, మానవ హక్కుల సంఘంలో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాజకీయ పార్టీలు, మావన హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. సీజనల్ వ్యాధులకు దోమల సంతతి పెరిగిపోవడానికీ, పర్యావరణంలో వస్తున్న మార్పులకూ సంబంధం ఉంది. మానవచరిత్రలో తిమింగలం కంటే ప్రమాదకరమైనది దోమేనని ప్రముఖ చరిత్రకారిణి తిమొతి వైన్గార్డ్ వెల్లడించడం గమనార్హం. మరి ఆరోగ్య తెలంగాణ ఎప్పుడో.. అర్థంకాని అయోమయ పరిస్థితి...