Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటును స్తంభింపజేసి(ప్రోరోగ్) కార్మికుల జీవన ప్రమాణాలను చావుదెబ్బ కొట్టే బ్రెగ్జిట్ ఎజెండాను బలవంతంగా అమలు చేయాలని ప్రయత్నించటం ద్వారా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజాస్వామ్యంపై యుద్ధాన్ని ప్రకటించాడు. ప్రత్యామ్నాయ వాణిజ్య, కస్టమ్స్ ఏర్పాట్లు లేకుండా యూరోపియన్ యూనియన్ను వీడటం సరియైన పద్ధతి కాదని మెజారిటీ ఎంపీలు భావిస్తున్నందున నడుస్తున్న పార్లమెంటును బ్రిటిష్ ప్రధాని ఐదు వారాలపాటు స్తంభింపజేశాడు. అంటే అక్టోబర్ 31 కల్లా యూరోపియన్ యూనియన్తో ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకోవటమో లేక కుదుర్చుకోకపోవటమో తేలిపోతుంది.
ఇలా బ్రిటిష్ రాజ్యాంగ నియమాలను ఒక ప్రధాని తుంగలో తొక్కటం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న దాడిలో భాగమే. ప్రపంచవ్యాప్తంగా పాలకవర్గాలు తమకు ఎదురవుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించలేక నియంతృత్వ పాలనకు తెగబడుతున్నాయి. ఎమర్జన్సీ రూల్తో నడిచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలన, పోలీసు రాజ్యాలుగాను, సైన్యాన్ని సాయుధంచేసే రాజ్యాలుగాను మారిన జర్మనీ, ఫ్రాన్స్, ఇతర ఐరోపా దేశాలు, మన దేశంలో నడుస్తున్న మోడీ నియంతృత్వ పాలన ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ప్రజాస్వామ్య హననంలో భాగమే.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మరిన్ని మితవ్యయ విధానాలకు పాల్పడటం, వీర జాతీయవాదాన్ని రెచ్చగొట్టటం, వలసొచ్చిన విదేశీయులపై ద్వేషాన్ని రగిలించటం, నియంతృత్వ పాలనకు తెగబడటం, ఫాసిస్టు శక్తులను ప్రోత్సహించటం వంటి చర్యలకు వివిధ దేశాల ప్రభుత్వాలు దిగుతున్నాయి. 'థాచర్ విప్లవం'లో మిగిలిపోయిన లక్ష్యాలను పూర్తిచేయటానికి యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని భావిస్తున్న బ్రిటిష్ పాలక వర్గ విభాగానికి ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి. గ్రేట్ బ్రిటన్ను ఒక నియంత్రణ లేని పన్నుల ఆశ్రయంగా మార్చటం, కార్మికవర్గాన్ని అడ్డూఅదుపూ లేకుండా దోపిడీ చేసేందుకు వీలు కల్పించటం, ఎంతోకొంత మిగిలివున్న సంక్షేమ రాజ్య భావనను రద్దుచేసి ప్రయివేటీకరించటం అనే లక్ష్యాలతో ఆయన పనిచేస్తున్నాడు. ప్రపంచ రంగస్థలంపైన బ్రిటిష్ సామ్రాజ్యవాద ఆకాంక్షలను నెరవేర్చటానికి అమెరికా సంసిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హామీ కారణంగా బ్రిటిష్ ప్రధానికి ఈ అవగాహన ఏర్పడింది.
బ్రిటిష్ ప్రధాని పార్లమెంట్ను స్తంభింపజేయటంతో బ్రెగ్జిట్ను కోరుకుంటున్న బ్రిటిష్ పాలకవర్గంలోని ఒక ముఠాకు చెందిన అప్రజాస్వామిక, జాతీయవాద ఎజెండా బహిర్గతమైంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకువచ్చి తమ దేశాలలో రాజ్యమేలుతున్న నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని వలసొస్తున్న ప్రజలకు వ్యతిరేక విధానాలను అమలుచేస్తే జాతీయ వైద్య సర్వీస్కు కావలసినన్ని నిధులు సమకూరుతాయనీ, 'బ్రిటిష్ ఉద్యోగాలు బ్రిటిష్ కార్మికులకే' వస్తాయనే ఆశలు కల్పించారు. అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలు. బ్రెగ్జిట్తో మరిన్ని మితవ్యయ చర్యలు ఉంటాయి. రాజ్యహింస పెరుగుతుంది. విదేశీయులపట్ల ద్వేషం, వీర జాతీయవాదం వ్యాప్తితో సమాజంలో విషబీజాలు పడతాయి.
పార్లమెంట్ ఔన్నత్యానికి భంగం కలుగుతుందని వాదిస్తున్న బ్రెగ్జిట్ని వ్యతిరేకించే బ్రిటిష్ బూర్జువావర్గం కూడా ప్రజాస్వామిక హక్కులను, కార్మికవర్గాన్నీ జాన్సన్ కంటే ఎక్కువగా వ్యతిరేకిస్తుంది. అమెరికాతో స్నేహం చేస్తూనే యూరోపియన్ యూనియన్లో కొనసాగితే ఒకేఒక మార్కెట్ అందుబాటులోకి వస్తుందనీ, అది బ్రిటన్కు లాభదాయకంగా ఉంటుందనీ, వాణిజ్య యుద్ధాలను ఎదుర్కోవటానికి అనువుగా ఉంటుందనీ ఈ వర్గం భావిస్తోంది. వీళ్లు అధికారంలో వున్నా గ్రీస్, పోర్చుగల్, స్పెయిన్లలో వలే యూరోపియన్ యూనియన్ ఆదేశంతో కార్మికవర్గంపై జరుగుతున్న దాడులు ఆగవు. ఐరోపా ఖండం అంతటా యూరోపియన్ యూనియన్ అనుకూల పాలకవర్గ పార్టీలు ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడులు చేస్తూనే ఉన్నాయి. జర్మనీలో నయా ఫాసిస్టులను మహాకూటమి ప్రోత్సహిస్తోంది. అలాగే ఫ్రాన్స్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్ అవలంబించిన అణచివేత విధానం, నాజీలతో అంటకాగిన నియంత ఫిలిప్ పెటైన్ను ఆయన పొగడటం ఈ అప్రజాస్వామిక పాలనకు ఉదాహరణలే.
వర్తమాన జాతీయ, అంతర్జాతీయ వైరుధ్యాలను ప్రజాస్వామిక సంస్థలు తట్టుకోలేవనేది నిష్టుర సత్యం. సామాజిక పోరాటాల నుంచి రక్షణకు ప్రజాస్వామిక వ్యవస్థ ఒక సేఫ్టీవాల్వ్ లాగా పనిచేస్తుంది. అయితే వర్గ, జాతీయ, అంతర్జాతీయ వైరుధ్యాల తీవ్రతకు ఈ సేఫ్టీ వాల్వ్ దెబ్బతింటుంది. అప్పుడది నియంతృత్వానికి దారితీస్తుంది. తమకు అవసరమైన మార్కెట్ల, వనరుల నియంత్రణ కోసం సామ్రాజ్యవాద దేశాలమధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఈ ఘర్షణ వాణిజ్య యుద్ధాలకు, సాయుధ సమరాలకు దారితీస్తోంది. తత్ఫలితంగా సామాజిక అసమానతలు ఎన్నడూలేనంతగా పెరిగి వర్గ సంఘర్షణను తీవ్రం చేశాయి. ఈ వైరుధ్యాల పరిష్కారం పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలో జరగదని చరిత్ర పదేపదే నిరూపిస్తొంది. ప్రజాస్వామ్యమే కాకుండా మానవాళి మనుగడే పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటంపై ఆధారపడి ఉన్నదనే సత్యాన్ని గ్రహించేదాకా ప్రజాస్వామ్య హననం కొనసాగుతూనే ఉంటుంది.