Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షరజ్ఞానం ఉండగానే సరిపోదు, ప్రపంచ గమనాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, చైతన్యం అవసరం. చదవడం, రాయడం రాగానే అక్షరాస్యులయినట్టు కాదు. వయోజన విద్య ప్రచార కార్యక్రమాల్లో సంతకం పెట్టడం వస్తే చాలన్నట్టుగా వ్యవహరించేవారు. దశాబ్దాలుగా సంపూర్ణ అక్షరాస్యత కోసం చేసిన ప్రయత్నాలు నేటికీ ఫలించలేదు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రతి ఏటా సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం నిర్వహించా లని యునెస్కో 1966లోనే ప్రకటించింది. అర్ధ శతాబ్దం గడిచినా ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు మనదేశం. కేరళ ఒక్కటే ఈ లక్ష్యానికి సమీపంగా ఉన్నది.
దేశంలోని 36 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అక్షరాస్యతలో బీహార్ది చివరిస్థానం కాగా, తర్వాతి స్థానం తెలంగాణదే. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. గురుకులాల ఏర్పాటులో కనిపించే హడావిడి ప్రభుత్వ స్కూళ్ళ మెరుగుదలలో కనిపించదు. నిజానికి పిల్లలు తక్కువ ఉన్నారనే పేరుతో అనేక ప్రభుత్వ స్కూళ్ళని మూసివేస్తున్నారు. పిల్లలు బడికి వెళ్ళే దూరం పెరిగే కొద్దీ వారు చదువులకు దూరమయ్యే ప్రమాదముంది. విద్యకోసం తగినంత బడ్జెట్ కేటాయించకుండా సర్కార్ బళ్ళను మూసివేస్తూ, ప్రయివేటు బళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యల వల్ల అక్షరాస్యత శాతం పడిపోవడం, లేదంటే మధ్యలోనే పిల్లలు బడి మానేయడం వంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కనుకనే తెలంగాణ రాష్ట్రాన సంపూర్ణ అక్షరాస్యత అనేది ఒక కలగానే మిగిలింది. రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనూ సంపూర్ణ అక్షరాస్యత గురించి మాటలు వినిపిస్తున్నాయే గానీ చేతల్లో కనిపించడం లేదు. అక్షరాస్యతని సాధించగానే సరిపోదు. ప్రజల్ని విజ్ఞానపథంలో నడిపించాలి. శాస్త్రీయ వివేచనని ప్రోది చేయాలి. చంద్రుని మీద పాదం మోపే వైపు పురోగమిస్తున్న దేశంలోనే చవితి చంద్రుడ్ని చూడటం కీడనే భావన ఉంది. వాడవాడలా విగ్రహాల్ని పెట్టి పూజలు చేయడం ఏ చదువుల ఫలితం? కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదని తెలిసినప్పటికీ, శివుని ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదనే నమ్మకాలూ చెలామణీలో ఉన్నాయి.
శతాబ్దాల మూఢత్వం నుంచి విముక్తి అయ్యే దిశగా మనుషుల్ని నడిపించలేనప్పుడు అక్షరాస్యత ఒక్కటే జనాల్లో చైతన్యాన్ని పాదు కొల్పదు. మతం కేవలం వ్యక్తిగతానికే పరిమితం కాక, మొత్తం రాజకీయ వ్యవస్థని శాసించేదిగా పరిణమించడానికి మూలం చైతన్య రాహిత్యం. తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచామనుకునే కాలం కాదిది. ప్రతి పరిణామానికి మూలం, నేపథ్యం శాస్త్రీయంగా తేటతెల్లమవుతున్న వైజ్ఞానిక దశలో ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల పురోగమనం విశ్వరహస్యాల్ని మన ముందు ఉంచింది.
గ్రహాలు, శాంతులు, రాహుకేతువుల చంక్రమణం వంటి నిరాధార, నిర్హేతుక మాటలకు కాలం చెల్లినప్పటికీ విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యం కోర్సులు నిర్వహిస్తున్నారు. స్వయంగా పాలకులే యాగాలు చేస్తూ, దేవాలయాలు కడుతూ విగ్రహారాధన ప్రొత్సహిస్తున్నారు. ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా విధివిధానాలు ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. కానీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పాలకులే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బడుల కోసం వెచ్చించాల్సిందిపోయి గుడుల కోసం వందల కోట్లు వృధా చేస్తున్న పాలకుల మూర్ఖత్వాన్ని మేధావులు, రచయితలు, కళాకారులు ప్రశ్నించాలి.
ప్రజాస్వామ్యంలో హేతు రాహిత్యానికి చోటు లేదు. హేతువుని, ప్రశ్నించే తత్వాన్ని పెంచేలా చదువులు ఉండాలి. శాస్త్రీయ ఆలోచనా దీప్తికి తావునిచ్చే రీతిన సిలబస్ రూపొందించాలి. ఇందుకు అనువైన విద్యావిధానం అనుసరించినప్పుడే శాస్త్రీయతకు చోటు ఉంటుంది. ప్రజల్లో మూఢత్వం తొలగి ఆలోచించే చైతన్యం పాదుకుంటుంది. కంప్యూటర్కు బొట్లు పెట్టి పూజించే అజ్ఞానం మాసిపోవాలంటే చిన్నతనం నుంచే ఈ ప్రపంచం పుట్టుక, మానవ పరిణామం గురించి ఆలోచించేలా పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఇవి కొరవడినందునే దశాబ్దాలుగా రాముడు కేంద్రంగా రాజకీయ అజ్ఞానం రాజ్యమేలుతున్నది. రామాయణం చరిత్ర కాదు, ఒక ఇతిహాసం. అయినప్పటికీ అయోధ్యలోనే రాముడు పుట్టాడని, అక్కడే నివసించాడని నమ్మించే ధూర్తత్వం క్షమించరాని నేరం.
అధికార అందలాల కోసం ఇలాంటి నిరాధార, నిర్హేతుక నమ్మకాల్ని ప్రచారంలో పెట్టే మూకస్వామ్యం పెట్రేగిన మూర్ఖత్వానికీ, ఉన్మాదానికీ పరాకాష్ట. ప్రజల్ని అజ్ఞానంలో ఉంచినంత కాలం తమ ఆటలు సాగుతాయని పాలకులు భావిస్తారు. అందుకే జనం అక్షరాస్యులయినప్పటికీ విజ్ఞాన వంతులు కారాదనే కుట్రపూరిత స్వభావంతో వ్యవహరిస్తారు. ఈ కారణంగానే విశ్వవిద్యాలయాల్లో సైతం శాస్త్రీయ దృక్పథంతో కూడిన చర్చలకు ఆస్కారం లేకుండా పోయింది. పురోగామి శక్తుల వాణిని వినిపించే వేదికలు కొరవడినాయి.
దిన, వార ఫలాల్ని ప్రకటించే పత్రికలు సైతం మూఢత్వాన్ని పెంచి పోషిస్తూ అధికారంలో ఉన్నవారికి వంత పాడుతున్నాయి. పాలకుల కాళ్ళముందు అవి సాగిలపడటం వర్తమాన వికృత దృశ్యం. ఆలోచనాపరులయిన వారే వ్యక్తులుగా, చిన్న చిన్న సమూహాలుగా బయలుదేరి అజ్ఞానపుటంధకారం నుంచి ప్రజల్ని విముక్తి చేసే దిశగా ప్రయాణించాలి. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రాత్రిపూట పాఠశాలల్ని 'సంగం' కార్యకర్తలు నిర్వహించారు. ఇవాళ సైతం ఆ విధంగా శాస్త్రీయ ఆలోచనా భావధారని ప్రోది చేసేందుకు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో స్టడీసర్కిళ్ళు నిర్వహించాలి. చదువుతోపాటు వైజ్ఞానిక చైతన్యం పరివ్యాప్తమవడానికి ఇలాంటి క్రియాశీలత తప్పనిసరి.