Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసింది. 'ధనికరాష్ట్రం' ఊసులేదు. ''తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ'' అన్నట్టు వ్యవహరించింది. ఆర్థిక మాంద్యం వల్ల సమస్యలు తలెత్తాయనీ, తమ ప్రభుత్వం బాధ్యత ఏమీలేదనీ చెప్పుకునేందుకు ప్రయత్నించింది. ఆర్థిక పరిస్థితి బాగుంటే తమ ఘనతగానూ, మాంద్యం వస్తే మాత్రం తమ అపజయం ఏమాత్రం కాదని నమ్మబలికారు. గతేడాదిన్నర కాలంగా ఆర్థిక మాంద్యం స్థిరంగా వెన్నాడు తున్న దన్నారు. అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రానికీ ఆదాయం పడిపోయిం దన్నారు. అన్ని ప్రధాన రంగాలూ తిరోగమనంలో ఉన్నాయని చెప్పారు. ఇక్కడే అసలు ప్రశ్న ముందుకొస్తున్నది. ఈ విషయాలన్నీ రాష్ట్ర పాలకులకు ఇప్పుడే అర్థమయ్యాయా? ఫిబ్రరిలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు తెలియలేదా? సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే ఆ రోజు లక్షా ఎనభైరెండు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా! ఒకటిన్నర సంవత్సరాలుగా మాంద్యం వెన్నాడుతున్నదంటే.. ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టేనాటికే ఈ విషయం ముఖ్యమంత్రికి స్పష్టంగా తెలుసు. అయినా ప్రజలను పక్కదారులు పట్టించారు. లేనిది ఉన్నట్టుగా చూపించారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలకు నిజాలు చెప్పకుండా తమ వైఫల్యాలను కప్పిపెట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఇది దాచేస్తే దాగేది కాదు. ఏండ్ల తరబడి కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరించిన తప్పుడు విధానాల ఫలితంగా దాపురించిన ఆర్థిక మాంద్యం. అయితే.. తామెంతో చేయాలనుకున్నామనీ, మాంద్యం వల్లనే చేయలేకపోతున్నామనీ ప్రజలను మభ్యపెట్టి తప్పించుకోజూడటమే ఇక్కడ వింత.
ప్రతి బడ్జెట్లోనూ లేని ఆదాయం ఉన్నట్టుగా చూపి మభ్యపెట్టటం ఆనవాయితీగా మారింది. దీనికి పరాకాష్ట 2018-19 బడ్జెట్. అంచనాలకు భిన్నంగా రూ.40వేల కోట్ల మేరకు రాష్ట్ర ఆదాయం పడిపోయిందని ఎకౌంటెంట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. ఇప్పుడు చేసేది లేక బడ్జెట్ సైజు తగ్గించి బీదారుపులు మొదలు పెట్టారు. ఆర్థిక విధానాలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమేనన్నారు ముఖ్యమంత్రి. ఏదో కొత్త రహస్యం తవ్వితీసినట్టు మాట్లాడారు. రాష్ట్రాలు కేంద్రం నిర్ణయించిన పరిధిలోనే వ్యవహరించక తప్పదన్నారు. అంటే.. కేంద్రం అనుసరించిన తప్పుడు విధానాల ఫలితమే ఈ మాంద్యం అని చెప్పదలిచారు. ఈ ఐదేండ్ల కాలంలో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారా? ప్రశ్నించకపోగా భజన చేసారు కదా! ఇప్పుడు తమకేమీ బాధ్యత లేదని తప్పించుకో జాలరు. పైగా కేంద్రం నుంచి ఈ ఐదేండ్లలో రాష్ట్రానికి కేవలం రూ.32,802 కోట్లు మాత్రమే అందిందన్నారు. గత ఐదేండ్ల లాలూచీ కుస్తీలో ఈ నిజం కనిపించలేదా? కేంద్రం, రాష్ట్రం పరస్పరం సహకరించుకుంటున్నామన్నారు. కేంద్రం నుంచి నిధులు సహకారంతోనే వస్తాయన్నారు. ఈ పేరుతో పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఇప్పుడు నిధులు ఇవ్వలేదని లబోదిబోమంటే ప్రజలు 'అవును పాపం' అనుకుంటారనుకుంటే పొరపాటు. అంతా పచ్చగా ఉంటే ఆ ఘనత తమదేనని జబ్బలు చరుచుకున్నారు. సమస్యలు తలెత్తటంతో తమ బాధ్యత లేదంటున్నారు. ఇంతకన్నా అవకాశవాదం ఉండదు. ఈ సమస్యల ఫలితంగా అసంతృప్తి పెరిగితే, ప్రజలు ఆందోళన బాట పట్టితే.. అణచివేసే బాధ్యత మాత్రం తీసుకున్నారు. పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు. ఆధునీక రించారు. ఈ విషయం ముఖ్యమంత్రి తమ ఘనకార్యంగా చెప్పుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత లేదు. అణచివేసే బాధ్యత మాత్రం తమదేనని గర్వపడుతున్నారు.
ఆర్థిక మాంద్యం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనన్న విషయంలో సందేహం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏమీలేదని తప్పించుకోజాలదు. కేంద్రానికి అన్ని విషయాలలో సహకరించి ఆ పాపాలన్నింటిలో భాగం మూటగట్టుకున్నది. పైగా ప్రజలకు కనీస ఊరట కలిగించే అవకాశాలు ఉండికూడా చేయలేదు. ప్రభుత్వశాఖల్లో ఖాళీపోస్టులు భర్తీ చేయలేదు. పైగా 95శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చే విధంగా కొత్త జోనల్ విధానం తెచ్చామని చెప్పుకోవటం హాస్యాస్పదం. రైతులకు రుణాల గురించి మాట్లాడలేదు. గిట్టుబాటు ధర కోసమే రైతు సమన్వయ సమితులన్న పాలకులు ఇప్పుడా మాటే దాటవేసారు. రీడిజైనింగ్ పేరుతో అంచనా వ్యయాలు భారీగా పెంచి కాంట్రాక్టర్ల బొజ్జలు నింపారు. చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల మీద ఖర్చు చేసి ఉంటే లక్షలాది మంది రైతులకు ఇప్పటికే సాగునీరు అందేది. కార్మికుల కనీస వేతనాలు పెంచితే ప్రభుత్వానికి ఖర్చు లేకుండానే కార్మిక కుటుంబాల ఆదాయాలు పెరిగేవి. తామే చెప్పిన ఐదు లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తే లక్షలాది మందికి ఉపాధితో బాటు సొంత ఇండ్లు దక్కేవి. కేజీ టూ పీజీ అమలు చేస్తే కార్పొరేట్ విద్యా సంస్థల బారి నుంచి ప్రజలు ఊరట పొందేవారు. ఆరోగ్యశ్రీ పేరుతో పెట్టే ఖర్చు ప్రభుత్వాస్పత్రులలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు పెడితే ప్రజలకు ఆదా అయ్యేది. ఆదాయంలో ముప్పావువంతు విద్య, వైద్యం, ఇంటి కిరాయిలకే పోతున్నది. ఈ విషయాలలో బాధ్యతగా వ్యవహరించి ఉంటే మాంద్యం నుంచి మెజారిటీ ప్రజలకు ఊరట లభించేది. పెద్దలే తప్ప ప్రజల కష్టాలు కనిపించని పాలకుల వైఫల్యాలను ఇప్పుడు మాంద్యం పేరుతో కప్పిపుచ్చే ప్రయత్నం తగదు. ప్రజలెన్నుకున్నది తప్పించుకునేందుకు కాదు.. బాధ్యత వహించడానికి.