Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నమొన్నటి వరకూ ముఖ్యమంత్రి మనది ధనిక రాష్ట్రమని అన్నారు. దేశం మొత్తం తెలంగాణవైపే చూస్తున్నదనీ అన్నారు. ఈ పేరుతో రాష్ట్రంలోని కరువును కూడా దాచేశారు. సీఎం తీరును ప్రతిపక్ష నేతలే కాదు.. కొందరు స్వపక్ష నేతలూ ఆక్షేపిస్తున్నారు. ఉన్నట్టుండి ముఖ్యమంత్రి స్వరం మార్చారు. వారం రోజులుగా ఆర్థిక స్థితిపై, బడ్జెట్పై ఆయన చేస్తున్న ప్రకటనలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బడ్జెట్ సన్నద్ధత పేరుతో నిర్వహించిన సమావేశంలో మంత్రులు, అధికారులకు పొదుపు పాఠాలు చెప్పారు. పైసలు ఆచితూచి ఖర్చు పెట్టాలనీ, బడ్జెట్లోనూ వాస్తవ పద్దులే చూపాలని హితోపదేశం చేశారు. 'భారీసైజు బడ్జెట్టు మనకొద్దు' అన్నారు. 1.46లక్షల కోట్లు మాత్రమే పెట్టారు. ఈ అనూహ్య మార్పునకు కారణం ఆర్థిక మాంద్యమేనని ముఖ్యమంత్రి సెలవిస్తున్నారు. ఇది సాకులు వెతుక్కోవడం తప్ప మరోటి కాదు. తాజా బడ్జెట్ కేటాయింపులు, ముఖ్యమంత్రి ప్రసంగపాఠమూ దీన్నే రుజువు చేస్తున్నాయి. బకాయిల చెల్లింపు తమ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని చెప్పారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చెందిన బకాయిలు సుమారు 25వేల కోట్లు ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలే తెలియజేస్తున్నాయి. ఇవి పోనూ రాష్ట్రం చేసిన అప్పులపై మరో 15వేల కోట్ల మేర వడ్డీలు ఏటా చెల్లించాలి. అత్యవసర ఖర్చులు, అనుకోకుండా వచ్చేవి సహజంగానే ఉంటాయి. ప్రకటిత బడ్జెట్లో సింహభాగం నిర్వహణ(పద్దు)కే పోతుంది. ఈ లెక్కన చూస్తే తాజా బడ్జెట్ బకాయిలకే సరిపోదు. అప్పుడు రాష్ట్ర ప్రగతికి, సంక్షేమ పథకాలకు నిధులెక్కడివి? ఈ సంక్షోభ కాలంలో ప్రజలకు భరోసా ఏదీ?
ఈ రోజు కేంద్ర, రాష్ట్రాలు ఆర్థిక చిక్కుల్లో పడ్డాయంటే దానిక్కారణం ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే. నేడు రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉంది. రెండున్నర లక్షల కోట్లకు చేరాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి మరీ తెచ్చారు. ఇంత చేసినా వీటన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధికి ఖర్చు చేయలేదు. తమకు నచ్చిన ఒకట్రొండు ప్రాజెక్టులపైనే గుమ్మరించారు. కాళేశ్వరం, మిషన్భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలకే అధికభాగం వెచ్చించారు. కేవలం 10 నుంచి 20 కోట్ల చొప్పున ఖర్చుచేస్తే పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులు అనేకం ఉన్నా వాటిని విస్మరించారు. అదేగనుక జరిగితే ఎంతో కొంత సమగ్ర అభివృద్ధికి దోహదపడేది. అన్ని ప్రాంతాల రైతుల ఆదాయాలు పెరిగేవి. ఇందుకు భిన్నంగా ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెంచి కాంట్రాక్టర్ల బొజ్జలు నింపారు. గడిచిన ఐదేండ్లలో ఏనాడూ అభివృద్ధికి ప్రణాళికాబద్ధ కృషి జరగలేదు. ప్రజల స్థిర ఆదాయాలు పెంచడంపై దృష్టిలేదు. శాశ్వత అభివృద్ధికి ఏ ఒక్క చర్యా తీసుకోలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే సర్కారు, ప్రజలు మాంద్యాన్ని తాత్కాలికంగానైనా తట్టుకునేవారు. కానీ సర్కారుకు ఎంతమాత్రమూ ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణ లేని ఫలితంగానే నేడు మన ఖజానా ఇబ్బందుల్లో పడ్డది. రాష్ట్ర పద్దులు పరిశీలించిన కాగ్ కూడా దీన్ని కుండబద్దలు కొట్టింది. రెవెన్యూ లోటును మిగులుగా చూపి ధనిక రాష్ట్రంగా భ్రమలు గొల్పుతున్నట్టు అది తేల్చింది. ఆర్నెల్ల క్రితమే కాగ్ ఈ హెచ్చరిక చేసింది. అప్పటికైనా ప్రభుత్వం పాఠాలు నేర్వలేదు. ఇలాంటి అనేక పాపాల ఫలితంగానే ఈ రోజు మాంద్యం మనల్నీ చుట్టుముట్టింది. ఫలితంగా అన్ని తరగతుల ప్రజలూ కష్టాల్లో పడ్డారు. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలు సైతం కుంటుతున్నాయి. అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఈ విపత్కర స్థితిలోనూ ప్రభుత్వం ప్రకటించిన తాజా బడ్జెట్ ప్రజలను ఆదుకునేలా లేదు. బకాయిలే ప్రాధాన్యం అని చెప్పడం ద్వారా సంక్షేమ పథకాలు ఇక బబ్బుంటాయని చెప్పకనే చెప్పటం. ఈ చర్య కష్టకాలంలో ప్రజలను గాలికొదిలేయడమే.
నేటికీ రాష్ట్రం కరువు కోరల్లోనే ఉంది. రైతాంగాన్ని ఆదుకునే దిశగా కూడా ఏ ఒక్క చర్యా లేదు. కరువు మండలాలు ప్రకటిస్తేనైనా కేంద్రం నుంచి కొంత సాయం అందేది. కార్మికుల కనీస వేతనాలు పెంచే విషయంలోనూ ముఖ్యమంత్రి జోక్యం లేదు. ఈ పనిచేస్తే సర్కారుకు నయాపైసా ఖర్చు కాదు. అయినా పరిశ్రమల యజమానుల కొమ్ముకాస్తున్న ప్రభుత్వం అందుకు సిద్ధపడడం లేదు. పోగా రెండోసారి గద్దెనెక్కేందుకు ప్రజలకు చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాల అమలు నుండీ ముఖ్యమంత్రి తప్పుకోజూస్తున్నారు. ఇలాంటి సంక్షోభాల కాలంలో ప్రజల కొనుగోలుశక్తి పెంచాలి. అందుకు గాను ప్రజల ఆదాయాలు పెంచడమే మార్గం. కానీ ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి మాంద్యాన్ని సాకుగా చూపి పొదుపు సూత్రాలు వల్లెవేస్తున్నారు. ఇదెంత మాత్రమూ సహేతుకం కాదు. ఇప్పటికిప్పుడే పరిశ్రమలు నెలకొల్పలేక పోవచ్చు. కనీసం చేయగల్గిన పనులైనా చేయాలి. కార్మికుల కనీస వేతనాలు పెంచే దిశగా ప్రభుత్వం కదలాలి. రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలి. తాత్కాలికంగానైనా ఊరటనిచ్చే సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి. కష్టకాలంలో ప్రజలను గాలికొదిలేయటం బాధ్యతా రాహిత్యమే!