Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కులం అడ్డుగోడలు - మతం నిలువు గోడలు మనిషి జీవితాన్ని ఛిద్రం చేస్తున్న సమాజం మనది. తమ కులానికి చెందని వారిని, తమ మతం కానివారిని ప్రేమించినందుకు, పెండ్లాడినందుకు సొంత బిడ్డల్ని సైతం నిర్థాక్షిణ్యంగా నరికి చంపుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో బుధవారంనాడు సర్వోన్నత న్యాయస్థానం కుల, మతాంతర వివాహాలపై వెలువరించిన అభిప్రాయం అక్షరాలా అనుసరణీయం. ''కులాంతర, మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు. అలాంటి వివాహాలవల్ల 'సమాజవాదం' బలపడుతుంది. హిందూ-ముస్లిమ్ వివాహాలు కూడా ఆమోదయోగ్యమే. చట్టప్రకారం ఒకరినొకరు పెండ్లాడితే సమస్య ఏముంటుంది. కులాల అంతరాలు కూడా తొలగిపోతే మంచిదే. ఉన్నత కులాలు, నిమ్న కులాలుగా చెప్పుకుంటున్నవాళ్లు పెండ్లిండ్లు చేసుకుంటే మరింత మేలు'' అని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఛత్తీస్ఘడ్కు చెందిన హిందూ యువతిని ముస్లిం యువకుడు హిందూ మతంలోకి మారి పెండ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తండ్రి హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆ ఇద్దరూ కలిసి జీవించవచ్చునని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమ్మాయి తండ్రి సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ కేసును విచారించేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ఈ కేసు విచారణ జరపబోమని స్పష్టం చేస్తూ ''ఆమె ప్రయోజనాలు కాపాడాలని తాము కోరుకుంటున్నామని, ఆ యువతిని బాగా చూసుకోవాలని, నమ్మకమైన భర్తగానేకాక గొప్ప ప్రేమికునిగా మసలుకోవాలని'' కోర్టు అతనికి సూచించింది.
భారత రాజ్యాంగం, చట్టం ఏనాడూ కుల, మత వివక్షలను అంగీకరించలేదు. వ్యక్తులు ఏ మతం నుంచి ఏ మతంలోకైనా మారే స్వేచ్ఛను, అలాగే ఏ మతం, కులంవారినైనా వివాహమాడే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేవారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు కూడా తయారు చేసింది. అయితే చట్టం కన్నా విశ్వాసం ముఖ్యమని భావించేవాళ్లు, రాజ్యాంగం కన్నా మనుధర్మం ఉత్తమమని నమ్మేవాళ్లూ మాత్రం చట్టాలను చట్టుబండలు చేసి మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. మత విశ్వాసం, కులహౌదా చుట్టూ అల్లబడిన మాయ (మిత్)కు లోనై, 'స్థాయి' (స్టేటస్)కు బందీలై తమ కులం కలుషితం కాకుండా, మతం మలినం కాకుండా కాపాడుకోవాలన్న 'అహం'తో ఆలోచనలు కమ్మేయగా తమవేలితో తమ కండ్లనే పొడుచుకుంటున్నారు.
మానవత్వం ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరైనా తాము అల్లారుముద్దుగా కనిపెంచుకున్న తమ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు పచ్చగా పది కాలాల పాటు బతకాలనుకుంటారు. అందుకు ఎంతో శ్రమిస్తారు. అయితే వివాహం విషయంలోకి వచ్చేసరికి తమ ఆచారాలను పాటించని తమ పిల్లల ఎడల హంతకులుగా మారిపోతారు. తమ పిల్లలను వివాహమాడే వ్యక్తులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, వారి దాంపత్య జీవితం సాఫీగా, సుఖవంతంగా సాగిపోతుందన్న నమ్మకమున్నప్పటికీ కేవలం కులం, మతం కారణంగా వారి వివాహాన్ని అడ్డుకుంటారు, వారిని అంతమొందించే దుస్థితికైనా దిగజారుతారు. దిగజారుతున్నారు కూడా. మన దగ్గర ప్రణరు ఉదంతం నుంచి, కేరళకు చెందిన హరియా ఇప్పుడు ఈ యువతి వరకూ ఇలాంటి ఉదంతాలు మన దేశంలో వేలూ లక్షలు.
నిజానికిది ఒక భయంకరమైన మానసిక సమస్య. అంతకుమించి భావజాల సమస్య. అవును! వ్యక్తులను తమతమ కులాల, మతాల పరిధిలో బంధించేందుకు సృష్టించిన భావజాలాలు అనివార్యంగా ఆయా కుల, మతస్తుల బుర్రకెక్కి వారిని బుద్ధిహీనులుగా మార్చుతున్నాయి.
రక్త సంబంధీకులు అన్య కుల, మతస్తులను ప్రేమించి, పెండ్లాడే సమయంలో వారి కుటుంబ సభ్యులు ఇంత కిరాతకంగా ప్రవర్తించేందుకు వారి చుట్టూ ఉన్న సాటి కులస్తులు, మతస్తులు కూడా ఒక ప్రధాన కారణం. ఇంకా భూస్వామ్య భావజాలం అధికంగా ఉన్న మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో గ్రామంపై తమ పట్టు నిలుపుకునేందుకు కులపెద్దలు ఇలాంటి విషయాలలో ఆయా కుటుంబీకులపై నిర్థాక్షిణ్యంగా, దారుణంగా ప్రవర్తిస్తారు. హర్యానా ఖాఫ్ పంచాయతీలంత భయంకరంగా భౌతిక దాడులకు పాల్పడనప్పటికీ, మానసికంగా, సామాజికంగా వారిని ఒంటరి చేసి, వెలివేస్తారు. కుల, మతాతీత వివాహాలు జరిగిన కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు వివాహాలు కాకుండా వేధిస్తారు. సాటి సమాజం నుంచి ఎదురయ్యే ఈ దారుణ మానసిక, శారీరక, సామాజిక దాడిని తట్టుకోలేక తమ పిల్లలు చేసిన 'పాపానికి' ప్రక్షాళనగా పాము తన పిల్లలను తానే చంపుకుతిన్నట్టు ప్రవర్తిస్తారు.
ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం పలికిన హిత వచనాలు, చేసిన సూచనలు సాటి మనుషుల పుట్టుక కారణంగా వారిపై వివక్ష ప్రదర్శించే చెంపపెట్టులాంటివి. మూర్ఖపు కులతత్వం నిండిన తల్లిదండ్రులకు, రక్త సంబంధీకులకు కనువిప్పులాంటివి. సర్వోన్నత న్యాయస్థానం హితవచనాలను నిండుమనస్సుతో స్వీకరిద్దాం. మనమూ పాటిద్దాం. వివక్ష కానరాని ఉన్నత సమాజంవైపు అడుగులేద్దాం.