Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గతము నుండియే నేర్వుము హితమునంత.. భవితయంతయు నిర్మింప ప్రతిభతోడ' అన్నారో కవి. నిత్య సాధనతోనే నైపుణ్యం సాధించాలని దానర్థం. కవి వాక్యాలు ఎంత మాత్రమూ కాదనలేం. ఎందుకంటే కాలం మారుతున్నది. అది నిత్యనూతనం. ఈ మార్పుల్లో కండ్ల ముందే ఎన్నో అద్భుతాలు ఆవిష్కృత మవు తున్నాయి. సాంకేతిక యుగంలో ఆ వేగమూ కాస్త ఎక్కువే. ఇలాంటి స్థితిలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే కాలానికి అనుగుణంగా వైఖరి మార్చు కోవాలి. కాలయాపన చేస్తే పోటీ ప్రపంచంలో వెనుకబడి పోతాం. కాబట్టి ఓర్పూ నేర్పునకు తోడు నైపుణ్యత పెంపొందించు కున్నప్పుడే గమ్యాలవైపు అడుగులు వేయగలం.
'భళిరా..! యేమీ శిల్పుల కళ! నైపుణ్యంబు నందు ఘనులోయీ!' అన్నారు పెద్దలు. శిల్పుల కళలు చరిత్రకు ఆలవాలం. చదువూ సంధ్యా లేకపోయినా వారి చేయి నుంచి జాలువారిన కళలు కళానైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. సమాజానికి దర్పణాలు. అయితే డిగ్రీలు, పట్టాలు ఉన్నంత మాత్రాన సృజనశీలురు అని చెప్పలేం. నైపుణ్యంతో కూడిన ఆలోచనా దృక్పథం ఉండాలి. ఒక అనుభవం గల కార్మికుడి ఎదుట కొత్త ఇంజినీర్ కూడా సరితూగలేడు. అప్పటికే ఆ కార్మికుడు అనుభవం కలవాడు. ఎన్నో భవనాలు, కట్టడాల్లో భాగస్వామి. అందుకే కార్మికుడి ప్రతిభాపాటవాల ముందు పుస్తక మేధస్సు కూడా కొన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు. ఆ మాటకొస్తే ప్రపంచంలోని అన్ని కంపెనీల్లోనూ నైపుణ్యం గురించే ప్రస్తావిస్తున్నారు. పట్టాలకన్నా ఏ పని ఎంత సత్వరంగా చేయగలవు? ఎంత సమర్థవంతంగా నడిపించగలవు? అనేదానిపైనే ఉపాధి అవకాశాలు ఆధారపడుతున్నాయి. ఉద్యోగమనే కాదు.. వ్యాపారం కావొచ్చూ, సమాజంలోనూ కావొచ్చు. ఏ రంగంలోనైనా నైపుణ్యమే కీలకం. అంతెందుకు? ప్రకృతిలో మమేకమైన పక్షిని పరికించినా నైపుణ్య లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. చాతకపక్షి నేలమీద నీటిని అసలే ముట్టుకోదు. సరిగ్గా వర్షం కురుస్తున్న సమయంలో చినుకులతోనే నేరుగా దాహం తీర్చుకుంటుంది. నేర్పుతో, ఓర్పుతో బొట్టుబొట్టునూ గొంతులోకి ఒడిసి పడుతుంది. అదీ ప్రత్యేకత. ఆ పక్షి మిగతా పక్షులు కూడా పుల్లా పుడకా ముక్కున చేర్చి సృజనాత్మకతతో గూడుకట్టుకోగలవు. గాలులు వీచినా చెదిరిపోకుండా గూడు అల్లుకోగలవు. ఇది ప్రకృతి సహజం! అయితే నేడు ఇంజినీరింగ్ దినోత్సవం సందర్భంగా ఇంజినీర్ల ప్రతిభను దేశం ఏ మేరకు ఉపయోగించుకోగలుతున్నది అనేది ప్రశ్నార్థకం. యేటా వేల సంఖ్యల్లో ఇంజినీర్లుగా పట్టాలు పొందుతున్నా వారిలో నైపుణ్యాలు కొరవడుతున్నాయని పలు సర్వేల్లో వెల్లడైంది. ఇప్పటికే ఇంజినీరింగ్, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు సైతం అటెండర్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న ఉదంతాలు మనకు తెలుసు. స్వాతంత్య్రానికి పూర్వం అక్షరాస్యత తక్కువగానే ఉన్నా, పట్టభద్రులు పెద్దగా లేకపోయినా చదువుకు తగిన నైపుణ్యాలుండేవి. అలీ నవాబ్జంగ్ బహదూర్ హైదరాబాద్ను ప్రపంచ ప్రఖ్యాత నగరంగా నిలపడంలో ఎంతో కృషిచేసి చరిత్రలో నిలిచిపోయారు. తెలంగాణ సమాజానికి చిరకాలం గుర్తుండిపోయే ప్రాజెక్టులు, కట్టడాలు అందించి తన ప్రతిభను చాటారు. ఆయన సేవలను మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైతం కొనియాడారు. అత్యంత ప్రతిభావంతుడైన ఇంజినీర్గా ప్రపంచ పుటల్లోకెక్కారు.
'బువ్వపెట్టని విద్య బండెడైనా దండగే' అన్నట్టు నైపుణ్యం లేని శిక్షణ నేడు ఎందుకూ కొరగానిదై మిగిలిపోతున్నది. దేశంలో ఇంజినీరింగ్ విద్య చదువుకోవడానికే పరిమితమవుతున్నది. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు పుట్టుకొస్తున్నా సగం మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణకు నోచుకోవడం లేదు. దీనివల్ల పుస్తక అంశాలు పరిశ్రమల్లో ఆచరించే అవగాహన లేకుండా పోతున్నది. దేశ జనాభాలో అరవైశాతానికిపైగా ఏదో ఒక పనిలో ఉన్నప్పటికీ ఉపాధి శిక్షణ తీసుకున్న వాళ్ల సంఖ్య ఎనిమిది శాతం మాత్రమే. విషయాన్ని ఆకళింపు చేసుకునే నైపుణ్యాలు, సమర్థంగా విధులు నిర్వహించేందుకు అవసరమైన భాషా నైపుణ్యాల్లోనూ వెనుకబడి పోతున్నారు. విద్యా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లే ఈ దయనీయ పరిస్థితికి దారితీసాయన్నది నిపుణుల వాదన. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలోనే నాణ్యమైన బోధనా, శిక్షణా సమాజానికి చేరడం లేదు. పుట్టగొడుగుల్లా ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు పుట్టుకొస్తున్నాయే గానీ విద్యా ప్రమాణాలు పాటించలేక పోతున్నాయి. నాణ్యతను మెరుగుపరచడం లేదు. శాస్త్ర సాంకేతిక రంగం పురోగమిస్తున్న నేపథ్యంలో నైపుణ్యం లేని చదువులు ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఇదిలాగే కొనసాగినా, పట్టభద్రులకు నైపుణ్య శిక్షణ అందించకపోయినా నిరుద్యోగ సమస్య ఇంకా హెచ్చుమీరినా ఆశ్చర్య పోనక్కర్లేదు. దేశ అభివృద్ధికి ఈ పరిస్థితి శ్రేయస్కరం కాదు. ప్రాథమిక స్థాయి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టకపోతే ఎన్ని ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవాలు చేపట్టినా ఒనగూరేదేమీ ఉండదు. సాంకేతికతకు అనుగుణంగా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దినప్పుడే నవోదయానికి నాంది. భవిష్యత్ తరాలకు బాసట.