Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''జన గణ మన అధినాయక జయహే!
భారత భాగ్యవిధాతా!
పంజాబు సింధు, గుజరాత, మరాఠా
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా గంగ
ఉచ్చల జలధితరంగ!''... అంటూ వైవిధ్య భరితమైన భారతదేశ భౌగోళిక, భాషా, సాంస్కృతిక ముఖచిత్రాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్.. ఇది కోట్లాది మంది భారతీయులు గొంతుల్లో ప్రతిధ్వనించే మన జాతీయగీతం. మన జాతీయ భావనకు, నిజమైన భారతీయతకు ఓ ప్రతీక. రవీంద్రుడు చెప్పినట్టు భిన్న మతాలకు, భిన్నజాతులకు, భిన్న భాషలకు, విభిన్న సంస్కృతులకు నిలయం ఈ నేల. భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వమే భారతీయతగా నిర్మించబడ్డ దేశం. కాబట్టే సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని ''ప్రతిజ్ఞ'' చేస్తున్నాం. కానీ నేడు ఆ భారతీయతకే ప్రమాదం ముంచుకొస్తుందా..? పాలకపార్టీ నేతల ప్రకటనలు, వారి పాలనా తీరూ చూస్తుంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ''ఒకే దేశం.. ఒకే భాష'' అంటూ బీజేపీ అధ్యక్షుడు, హౌం మంత్రి అమిత్షా తాజా ప్రకటన దీనిని మరింత రుజువు చేయటమే కాదు, దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది.
''హీందీ దివస్'' సందర్భంగా.. హిందీ జాతీయ భాషగా అమలు పరచాలనీ, అందరూ హిందీ మాట్లాడాలనీ, దేశాన్ని ఏకం చేయగలిగే భాష హిందీ ఒక్కటేననీ సెలవిచ్చారు అమిత్షా. ఇది రాజ్యాంగ విరుద్ధమే గాక, భారతదేశ ఔన్నత్యానికే పెను సవాలు. ఎందుకంటే.. ఈ దేశం భిన్న జాతుల, మతాల, భాషల, సంస్కృతుల సమాహారం. అందుకే స్వాతంత్య్రానంతరం ఈ దేశాన్ని ''భారత యూనియన్''గా ప్రకటించుకున్నాం. కానీ, ఇప్పుడా సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగించే విధంగా బీజేపీ వ్యవహరిస్తున్నది. ఇప్పటికే అమలులోకి తెచ్చిన ఆర్టికల్ 370 రద్దు వంటి అప్రజాస్వామిక నిర్ణయాలు మొదలుకుని ఇప్పుడు ''ఒకే దేశం ఒకే భాష'' అనే అప్రజాస్వామిక ప్రతిపాదన వరకూ అన్నింటా ఇదే వ్యక్తమవుతుండటం గమనార్హం!
ఈ దేశంలో 130 కోట్లమంది ప్రజలున్నారు. మెజారిటీ ప్రజలకు హిందీ మాతృభాష కాదు. దేశం మొత్తం మీద చూసినా హిందీ మాట్లాడేవారు 45శాతానికి లోపే. కాబట్టే మన రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 22 భాషల్ని అధికార భాషలుగా గుర్తించింది. ఈ విధంగా అన్ని భాషలకూ సమాన ప్రాధాన్యతనిస్తూ మన భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటానికి, భావోద్వేగపరమైన అనేక సమస్యల పరిష్కారానికీ కృషి చేసారు మన రాజ్యాంగ నిర్మాతలు. ఈ నేపథ్యాన్ని విస్మరించి ఒక భాషను దేశం మొత్తం మీద రుద్దడమంటే అది ప్రజలపై దాడి చేయడమే. 21వ రాజ్యాంగ సవరణ 1967 ద్వారా రాష్ట్రాలకు కల్పించిన భాషాధికారాలకు చెల్లుచీటి రాయడమే. అంతే కాదు.. దేశంలో ప్రతి పౌరుడు తనకు నచ్చిన భాషను ఎంచుకునే హక్కును కల్పించే రాజ్యాంగంలోని 29వ అధికరణాన్ని కూడా ధిక్కరించడమే. ఇంతకు తెగించి కోట్లాది ప్రజల మాతృభాషలను కాలరాసాక ప్రజల అభివ్యక్తికి అసలు అవకాశముంటుందా..!? ఇది ప్రజలను తాము పుట్టిన మట్టికి తమనే పరాయివాళ్లను చేయడం కదా..!? అటువంట ప్పుడు భారతదేశం నా మాతృభూమి అని, బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని ఎలా చెప్పుకోగలం..!?
అందుకే అమిత్షా ప్రకటన పట్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. హిందీయేతర రాష్ట్రాలన్నీ విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ప్రత్యేకించి దక్షిణాది భగ్గుమంది. ఆయా రాష్ట్రాల ప్రజలూ, భాషా సాంస్కృతిక సంస్థల నిరసనలు మిన్నంటాయి. ఆయా రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ స్పందించారు, ఖండించారు. కానీ తెలుగు నేలమీద ఆ స్థాయి స్పందనలు లేకపోవడం, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ నోరు మెదపకపోవడం విచారకరం.
రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రజలు ప్రధానంగా మాట్లాడే 22 అధికార భాషల్లో హిందీ కూడా ఒకటన్న విషయాన్ని మరుగునపెట్టి.. హిందీ ఒక్కటే జాతీయ భాష అన్న అబద్ధాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగజూస్తున్న పరివారానికి అడ్డుకట్ట వేయకపోతే జరుగబోయేది సాంస్కృతిక విధ్వంసమే. అది చరిత్రనే కాదు, భవిష్యత్తునూ మంటగలుపుతుంది. ఇది అమిత్షా బృందానికి తెలియనిదేమీ కాదు. తెలిసీ ఎందుకు చేస్తున్నారంటే.. వారికి కావల్సింది కూడా అదే కాబట్టి. మౌలికంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్లది భారతీయ సాంస్కృతిక వైవిధ్యానికీ, చారిత్రక నేపథ్యానికీ, భిన్న జాతుల, మతాల సహజీవన సౌభ్రాతృత్వానికీ విరుద్ధమైన భావజాలం. భారత రాజ్యాంగానికీ, దాని లౌకిక స్ఫూర్తికీ వ్యతిరేకమైన రాజకీయ సిద్ధాంతం. కాబట్టి ఆ సిద్ధాంతాల ప్రాతిపదికనే అవి పాలన సాగిస్తున్నాయి. కానీ వాస్తవమేమిటంటే.. వారు ప్రతిపాదిస్తున్న హిందీ, హిందూ, హిందూత్వలకు భిన్నమైనదీ, ఉన్నతమైనదీ, విస్తృతమైనదీ ఈ దేశం. ''భిన్నత్వంలో ఏకత్వమ''నే భారతదేశ విశిష్టతనూ, ప్రత్యేకతనూ మరిచి, హిందీ మాత్రమే ఈ దేశాన్ని ఏకం చేయగలదనడం ముమ్మాటికీ తప్పుడు అభిప్రాయం. అయినా అధికారం చేతిలో ఉంది కదా అని బలవంతంగా రుద్దితే అది భాషాపరమైన యుద్ధాలకు దారితీసి దేశ సమైక్యతకూ, సమగ్రతకూ ముప్పు తెస్తుందే తప్ప ఐక్యత ఎలా సాధిస్తుంది..!? ఇది ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నిక అనే ఆర్ఎస్ఎస్ భావజాలంలోంచి పుట్టుకొచ్చిన కుతంత్రం. ఈ కుతంత్రాలను గ్రహించి ఎండగట్టడం ద్వారా మాత్రమే ఈ దేశ ఐక్యత కాపాడుకోగలం.