Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ ఆర్థిక వ్యవస్థ మరింత గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నది. కార్పొరేట్లకు ఉద్దీపన వంటి ప్యాకేజీలు ప్రకటించినా ఇప్పట్లో ఎగబాకే సూచనలు కనిపించడం లేదు. రెండురోజులక్రితం వెల్లడైన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) నివేదికలో భారత్ ఆర్థిక వ్యవస్థ తాము ఊహించిన దానికంటే ఎక్కువగా మందగించిందని తేల్చింది. తాజాగా భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ కూడా ఆర్థిక సంక్షోభం ఇంతగా దిగజారుతుందని తాను అనుకోలేదని అన్నారు. అంటే సంక్షోభ తీవ్రత ఎంత ఆందోళనగా ఉందన్నది తెలుస్తోంది. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దడం తనవల్ల కాదన్న అభిప్రాయానికి దాస్ వచ్చేశారు. వాస్తవానికి వృద్ధిరేటు ఐదు శాతానికి పడిపోవడం ఆశ్చర్యంగా ఉందని శక్తికాంతదాస్ నోటివెంట అలాంటి మాటలు రావడాన్ని బీజేపీ పెద్దలు ఊహించి ఉండరు. ఎందుకంటే ఏరికోరి శక్తికాంతదాస్ను ఆర్బీఐ గవర్నర్గా ప్రధాని మోడీ తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా చేతులెత్తేయడం గమనార్హం. సంక్షోభాన్ని గట్టెక్కిస్తారని ఆశించిన బీజేపీ నేతలకు ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు రుచించకపోయి ఉండొచ్చు. ఎంతోకొంత పడిపోతుందని అంచనా వేశాం తప్ప ఇంత తక్కువగా ఉంటుందని అనుకోలేదని వృద్ధిరేటును చూసి ఆయన ఆశ్చర్యపోవడంలో వింతేమీ లేదు. కేంద్రంలోని కార్పొరేట్ వింగ్లో ఆర్థిక సెక్రటరీగా గుర్తింపు తెచ్చుకున్న శక్తికాంతదాస్కు ఆర్థిక పరిస్థితి గురించి ముందుగానే అంచనా లేదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఆయన మోడీకి నమ్మినబంటు. ప్రస్తుత పరిస్థితుల్లో మందగమనాన్ని అంచనా వేసి చెప్పడం కష్టమేనని చెప్పిన గవర్నర్.. రెండో త్రైమాసికంలో వృద్ధి మరింత కుంగిపోయే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. అయితే, ఉద్దీపన చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటుందన్న ఆశ ఆయనకు ఏ కోశానా లేదు. పొమ్మనలేక పొగపెట్టినట్టుగా రఘురామ్రాజన్ను, ఉర్జిత్పటేల్ను తప్పుకునేలా చేసిన మోడీ సర్కార్ శక్తికాంతదాస్ను అలా సాగనంపుతారని అనుకోలేం.
కార్పొరేట్ అనుకూల నిర్ణయాలే ప్రస్తుత ఈ పరిస్థితికి కారణం. నోట్లరద్దు, జీఎస్టీలు ఆర్థికరంగాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేసాయి. ఈ విధానాలు చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగాలను కుప్పకూల్చాయి.. కనీస వేతన చట్టం అమలుగాక పోవడం, ఉపాధి తగ్గడం, ఉద్యోగాలు పోవడం జరుగుతున్నాయి. కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రుణాలివ్వడం వల్ల బ్యాంకులు దివాళా తీశాయి. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియాలను అమ్మకానికి పెట్టింది. అందులో భాగంగానే భారత్ పెట్రోలియం సంస్థను అమ్మేయడానికి రేటు కూడా ఖరారు చేసింది. ఆఖరుకు రక్షణ సంస్థలనూ ప్రయివేటీకరించేందుకు సిద్ధమైంది. బొగ్గులోనూ విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. ప్రస్తుత సంక్షోభానికీ, ప్రజల మధ్య అసమానతలు పెరగడానికీ ప్రధాన కారణం ప్రభుత్వరంగాన్ని విస్మరించి ప్రయివేటు పెట్టుబడులకు అనుమతించడమేనన్నది అనుభవం చెపుతున్న సత్యం.
వృద్ధి రేటు ఐదుశాతంగా పడిపోయిందని కేంద్రప్రభుత్వం గతనెలలోనే ప్రకటించింది. అయితే, మందగమన పరిస్థితులు పోయి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందన్న దానికి శక్తికాంతదాస్ వద్ద స్పష్టమైన సమాధానం లేదు. సర్కారు సరైన చర్యలు తీసుకుంటే పరిస్థితులు చక్కబడొచ్చంటున్న ఆర్బీఐ గవర్నర్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు మంచివేనని చెప్పేందుకు వెనుకాడుతున్నారు. రిజర్వు బ్యాంకు నుంచి అందుకున్న లక్షన్నరకోట్లకు పైగా సొమ్ములో బ్యాంకులకు రూ.70వేలకోట్లను కేంద్రం కేటాయించింది. నిరర్థక ఆస్తుల ఊబిలోకి జారిపోయిన బ్యాంకులను బయటకు లాగే పేరిట విడతలవారీగా వేలకోట్లు కుమ్మరిస్తున్నది. బ్యాంకుల వద్ద డబ్బు లేకపోవడానికి కారణం పారిశ్రామికవేత్తల్లో కొందరు తీసుకున్న డబ్బును చెల్లించకుండా ఎగ్గొట్టడమే. బ్యాంకులను మోసగించిన వారిపై ఎలాంటి చర్యలూ లేవు. వారి నుంచి వసూళ్లు చేస్తున్నదీ లేదు. మందగమనానికి ప్రజల్లో కొనుగోలుశక్తి లేకపోవడమే ప్రధాన కారణం. విదేశీపెట్టుబడుల కోసం ద్వారాలు తెరవడం, పారిశ్రామికవేత్తలకు ఉద్దీపనలు, రాయితీలు, వడ్డీరేట్లు తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నా ఇవేమీ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోలేవన్నది ఆర్థికనిపుణుల విశ్లేషణ.
యాజమాన్యాలను ఆదుకునేందుకు కేంద్రం పెద్దలు హడావుడి పడ్డారే గాని, ఉద్యోగాలు కోల్పోయిన వారికి, నిరుద్యోగులకు సహాయంగా చిటికెన వేలు కదల్చలేదు. ఈ ఉద్దీపన కుబేరులకు తప్ప సామాన్యులకు ఒరగబెట్టిందేమీ లేదు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించిన విధానాల వల్లనే అసమానతలు పెరిగాయన్నది వాస్తవం. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు, ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించడమే పరిష్కారమార్గమని అమర్త్యసేన్, ప్రభాత్పట్నాయక్ లాంటి ఆర్థిక వేత్తలతో పాటు వామపక్షాలూ చెబుతున్నాయి. పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న మోడీ ప్రభుత్వం మేధావుల విజ్ఞప్తులను చెవికెక్కించుకుంటున్నదెక్కడీ